సత్యసాయి: ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గుడిబండ మండలంలోని పలు గ్రామాల్లో ఆకస్మిక పర్యటన చేశారు. బంబుల బండ, గోల్ల హట్టి, రొప్పం సహా పలు ప్రాంతాల్లో పర్యటించి తాగునీటి సమస్యలను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వెనుకబడిన నియోజకవర్గం ఇప్పుడు కూటమి పాలనలో అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు.
నెల్లూరు జిల్లాలో గ్యాస్ ధరల పెంపు, కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గృహ సిలిండర్ ధర రూ.950కి చేరగా, టోల్ ఫ్రీ నంబర్లు పనిచేయక వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొందరు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే జిల్లాలో గ్యాస్ కొరత లేదని, నిల్వలు పుష్కలంగా ఉన్నాయని DSO బి. లీలారాణి స్పష్టం చేశారు.
పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించేందుకు నౌకాసనం ఉత్తమమైనది. నేలపై వెల్లకిలా పడుకుని గాలి పీలుస్తూ కాళ్లు, ఛాతి భాగాన్ని ఒకేసారి గాలిలోకి లేపి చేతులను మోకాళ్లకు సమాంతరంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల పొట్ట కండరాలపై తీవ్రమైన ఒత్తిడి కలిగి అక్కడ పేరుకున్న కొవ్వు కరుగుతుంది. ఇది బరువు తగ్గించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, వెన్నెముకను దృఢంగా మార్చడంలో కూడా తోడ్పడుతుంది.
CTR: జిల్లా పంచాయతీల్లో మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంటులో గురువారం ఎంపీ మాట్లాడుతూ.. మామిడి రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. అలాగే, స్వదేశీ రక్షణ ఉత్పత్తిని పెంచడానికి, ఉపాధి సృష్టించడానికి ఏపీ రక్షణ పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయాలని విన్నవించారు.
ఖమ్మం నగరంలోని పలు హోటళ్లు, బిర్యానీ పాయింట్లపై సివిల్ సప్లై అధికారులు గురువారం మెరుపు దాడులు చేశారు. కొందరు దుకాణాల యజమానులు గృహ వినియోగ (డొమెస్టిక్) సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు గుర్తించి 20 సిలిండర్లను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 6 కేసులు నమోదు చేసినట్లు DSO చందన్ కుమార్ తెలిపారు.
ADB: రూరల్ మండలంలోని చించుఘాట్ గ్రామానికి చెందిన ఆర్కా సిదమ్మ రావు కూతురు దేవ్ బాయ్ వివాహానికి గ్రామస్తులు రూ. 55 వేల ఆర్థిక సాయం చేసి కుటుంబానికి అందజేసి అండగా నిలిచారు. పేదింటి కుటుంబానికి ఆర్థిక భారం కాకూడదనే ఆలోచనతో ప్రతి కుటుంబం నుంచి డబ్బును పోగు చేసి కుటుంబానికి అందజేసినట్లు పేర్కొన్నారు. గ్రామంలో కట్న కానుకలను నిషేధించినట్లు తెలిపారు.
KNR: తిమ్మాపూర్ మండలం రేణికుంటలో అకాల మరణం చెందిన తాళ్లపల్లి మహేష్ గౌడ్ కుటుంబానికి గ్రామస్థులు మానవత్వంతో అండగా నిలిచారు. గురువారం సర్పంచ్ ఎలుక ఆంజనేయులు ఆధ్వర్యంలో బాధితుని కుటుంబానికి రూ. 45 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి గ్రామ దాతలు ముందుకు రావడం అభినందనీయమని సర్పంచ్ అన్నారు.
MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్న ముప్పారం గ్రామానికి చెందిన దాసోజు కళ్యాణి అనే 7 నెలల గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో 108 వాహనం ద్వారా నెల్లికుదురు PHCకి తరలిస్తున్న క్రమంలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్స్ను రోడ్డు పక్కన ఆపి ఆమెకు 108 సిబ్బంది మల్లేష్, సుధాకర్ సాధారణ ప్రసవం చేశారు. కళ్యాణి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
SDPT: హయత్ రెస్టారెంట్లో భోజనంలో బొద్దింక కనిపించిందని ఫిర్యాదు వచ్చింది. దీంతో మున్సిపల్ శానిటరీ సూపర్వైజర్ శ్రీకాంత్, Slలు శివకుమార్, సత్యనారాయణ, EE అన్వేష్ హయత్ హోటల్ కిచెన్ను తనిఖీ చేశారు. వారు రూ. 15,000 జరిమానా విధించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు.
NTR: విజయవాడ–నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్ విస్తరణ పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం డబ్లింగ్లో ఉన్న ఈ మార్గంలో 3, 4 లైన్లు నిర్మించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవసరమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. డీపీఆర్ సిద్ధం కోసం ఫైనల్ లోకేషన్ సర్వేకు అనుమతి లభించిందని లోక్సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.
JN: పాలకుర్తి మండల కేంద్రంలో గొర్రెల, మేకల పెంపకందారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించాలని జీఎంపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గొర్రెల పంపిణీ, పెంపకందారులకు పెన్షన్లు, బీమా సౌకర్యం, అమలు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు.
ఇప్పటికే వరల్డ్ కప్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత మహిళల హాకీ జట్టు.. WC క్వాలిఫయర్స్లో ఇవాళ భాగంగా ఇటలీతో సెమీస్ ఆడనుంది. పూల్ దశలో అజేయంగా రాణించిన సలీమా సేన.. ఇందులోనూ గెలిచి తుదిపోరుకు దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. కాగా హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ క్వాలిఫయర్స్ టోర్నీలో టాప్-3 జట్లు బెల్జియం-నెదర్లాండ్స్ వేదికగా జరిగే హాకీ వరల్డ్ కప్-2026కు అర్హత సాధిస్తాయి.
HYD: జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆరోగ్య హెల్త్ కార్డులు మంజూరు చేయాలని TWJF, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ) ప్రతినిధులు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులు సమాజానికి సేవలందిస్తున్న నేపథ్యంలో వారికి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందని ప్రతినిధులు ఆయనకు వివరించారు.
GDWL: గద్వాల పట్టణ సమీపంలోని జమ్మిచేడులో వెలసిన శ్రీ జమ్ములమ్మ అమ్మవారికి ఆలయ అర్చకులు వేకువజామునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారిని రంగురంగుల పుష్పాలు, విశేష ఆభరణాలతో నేత్రపర్వంగా అలంకరించారు. అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించుకునేందుకు గద్వాల పట్టణం సుంచే కాక చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చారు.
BPT: రేపల్లె టీడీపీ కార్యాలయంలో ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు టీడీపీ అధ్యక్షుడు సూర్యరాజు తెలిపారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.