SDPT: హయత్ రెస్టారెంట్లో భోజనంలో బొద్దింక కనిపించిందని ఫిర్యాదు వచ్చింది. దీంతో మున్సిపల్ శానిటరీ సూపర్వైజర్ శ్రీకాంత్, Slలు శివకుమార్, సత్యనారాయణ, EE అన్వేష్ హయత్ హోటల్ కిచెన్ను తనిఖీ చేశారు. వారు రూ. 15,000 జరిమానా విధించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు.
చిత్తూరు జిల్లాలో ‘పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ’ పథకం నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. 2,05,753 మంది రైతు కుటుంబాలకు రూ.115.81 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమ కానున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.
AKP: సబ్బవరం మండలం అంతకాపల్లిలో గ్రామ దేవత ముత్యమాంబ అమ్మవారి పండగను గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు అర్చనలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు అర్చనలు నిర్వహించారు.
BHPL: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి నిత్యావసర సరుకుల కొరత ఏర్పడుతుందనే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని BHPL ఎస్పీ సంకీర్త్ హెచ్చరించారు. దళారులు, కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్నారని, అలాంటి అక్రమ నిల్వలు, ధరల ఎగబాకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ కౌన్సిల్ చివరి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగినున్న నేపథ్యంలో ఇది చివరి సమావేశం కానుంది. మున్సిపల్ ఛైర్ పర్సన్ పిల్లా రమాకుమారి అధ్యక్షతన మధ్యాహ్నం 3:30 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది.చివరి సమావేశంలో 21 అంశాలపై చర్చ జరగనుంది.
KMM: అనేక అనర్థాలు, ఆత్మహత్యలకు కారణమవుతున్న గడ్డిమందును నిషేధించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. గురువారం ఢిల్లీలో మంత్రిని కలిశారు. విషపూరిత మందు వల్ల ప్రాణనష్టం జరుగుతోందని వివరించారు. ఇప్పటికే పలు దేశాలు దీన్ని నిషేధించాయన్నారు.
నెల్లూరు నగరంలో విద్యుత్ కష్టాల పరిష్కారానికి గాంధీ పార్క్ వద్ద రూ.5 కోట్లతో 11కేవీ కంటైనర్ సబ్స్టేషన్ పనులు ప్రారంభించారు. గతేడాది డిసెంబర్ నాటికే పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు, ప్రస్తుతం బేస్మెంట్ దశలోనే ఉంది. వేసవి రావడంతో విద్యుత్ అంతరాయంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పనులు త్వరగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం టీటీడీ సంయుక్త కార్యనిర్వహణాధికారి వల్లూరు వీరబ్రహ్మం శుక్రవారం ఆలయానికి రానున్నారు. రామయ్య క్షేత్రం, మాడవీధులు, విశ్రాంతిభవనం, కళ్యాణ వేదిక, నిత్యాన్నదానం కేంద్రంలో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించి మార్గనిర్దేశనం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొంటారన్నారు.
KRNL: గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై గురువారం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. మండల ఎంపీపీ వెంకటేశ్వరమ్మ అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో నీటి కొరత నివారణకు, పారిశుద్ధ్య కార్యక్రమాల సమర్థ అమలుకు చర్య లు తీసుకోవాలని సూచించారు. ఎండాకాలం సమీపిస్తున్న సందర్భంగా నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
TPT: పాకాలలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఇవాళ పర్యటించనున్నట్లు Dy.MPDO శశికళ తెలిపారు. MPDO కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ‘PM కిసాన్-అన్నదాత సుఖీభవ’ పథకంపై సమావేశం నిర్వహించనున్నారు. మండలంలోని 5,029 మంది రైతులకు అన్నదాత సుఖీభవ నగదు ఖాతాల్లో జమ కానున్నట్లు AO హరిత పేర్కొన్నారు.
TG: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి- గన్నారం మధ్య ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ADB: జిల్లాలోని యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈనెల 14వ తేదీన ఆదిలాబాద్లో ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సృజనాత్మక ఆలోచనలు ఉన్న వారు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
VKB: నవాబ్పేట్ మండలంలోని గంగ్యాడ, పూలపల్లి, నారేగూడ, సిద్ధులూర్ గ్రామాలకు బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని చేవెళ్ల కాంగ్రెస్ ఇంఛార్జ్ పామెన భీమ్ భరత్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు. నిన్న హైదరాబాద్లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా వికారాబాద్-సిద్ధులూర్ (వయా గంగ్యాడ) బస్సును వెంటనే ప్రారంభించాలని వారు విన్నవించారు.
JGL: బుగ్గారం మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ను గురువారం జిల్లా మేనేజర్ ఆశోద ఐలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్లో మల్టీఛానల్ మానిటర్, AED, ఆక్సిజన్, అత్యవసర మందుల నిల్వలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్య పరికరాల పనితీరు, రికార్డుల నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యవసర సమయంలో ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.
మంచిర్యాల జిల్లాలోని రెవెన్యూ శాఖ ఉద్యోగులం కలిసి రెవెన్యూ క్రికెట్ లీగ్ నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేశామని రెవెన్యూ సంఘం నాయకులు శ్రీనివాస్ రావు దేశ్ పాండే ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 14, 15 తేదీలలో మంచిర్యాల ఉషోదయ స్కూల్ మైదానంలో క్రికెట్ పోటీలు ఉంటాయన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు.