NTR: తిరువూరు ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంను శాప్ డీఈ అనిల్ బుధవారం పరిశీలించారు. ఇటీవల కాలంలో ఇండోర్ స్టేడియంలోని షటిల్ కోర్టు కుంగిపోయింది. దీంతో క్రీడాకారులు ఇబ్బంది పడ్డారు. దీంతో టీడీపీ నేతలు కాళీ వర ప్రసాద్, కిరణ్, సందీప్ శాప్ ఛైర్మన్ను కలిసి మరమ్మతులు చేయించాలని కోరారు. డీఈ అనిల్ షటిల్ కోర్టును పరిశీలించి వారం రోజుల్లో పనులు చేపడతామని తెలిపారు.
KDP: వైసీపీ నాయకులను, కార్యకర్తలను పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి దూషించడం శోచనీయమని చక్రాయపేట మండల జడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా కార్యకర్తలు వైయస్ కుటుంబం వెంట ఉన్నారని, అటువంటి వారిపై షర్మిల రెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
MDCL: ఘట్కేసర్-రామచంద్రాపురం MMTS మార్గంలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇది పొడవైన రూట్ కావడంతో ప్రస్తుతం ఉన్న రైళ్లు సరిపోవడం లేదు. విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి అదనంగా రెండు MMTS సర్వీసులు కేటాయించాలని కోరారు.
W.G. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు వడదెబ్బ నుంచి తమను తాము రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులకు కూడా పలు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మధ్యాహ్నం 12.00 నుంచి 3.00 మధ్య తీవ్రమైన ఎండ ఉంటుందని, అత్యవసరమైతేనే బయటకి రావాలన్నారు.
KRNL: పెద్దకడబూరులోని ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలలో 2026- 27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆర్పీ రాఘవేంద్ర తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశాలు ఉంటాయన్నారు. టెన్త్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారని, మరిన్ని వివరాలకు ప్రిన్సిపల్ ను సంప్రదించాలన్నారు.
HYD: మైదానంలో ఖాకీల ఫుట్బాల్ ఫైట్ మొదలుకానుంది. బుధవారం నుంచి గచ్చిబౌలి స్టేడియంలో 74వ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ చాంపియన్షిప్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఈ మెగా టోర్నీని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 43 జట్లు, వెయ్యి మందికి పైగా క్రీడాకారులు తలపడే ఈ క్రీడల వేదికలు గచ్చిబౌలి, గోల్కొండ సహా 5 చోట్ల ఉన్నాయి.
MNCL: జైపూర్ బస్టాండ్ చౌరస్తాలో బుధవారం మంచిర్యాల నుంచి చెన్నూరు వైపు వెళుతున్న బైక్ అదుపుతప్పి వేగ గనిరోధక బోర్డును ఢీకొంది. ఈ ప్రమాదంలో శేఖర్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 సిబ్బందికి సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులను మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు.
నంద్యాల: మున్సిపాలిటి సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లి ఉత్తమ మున్సిపాలిటిగా నిలబెట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. మున్సిపాలిటి స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుధవారం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. పట్టణ అభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్యత అంశాలపై అధికారులతో సమీక్ష చేశారు.
ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఊరట లభించింది. స్టార్ పేసర్ బుమ్రా ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడని సమాచారం. తన ఫిట్నెస్, వర్క్లోడ్ మేనేజ్మెంట్పై దృష్టి సారించేందుకే బుమ్రా ఇటీవల BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో గత కొన్ని రోజులుగా బుమ్రా గాయంపై వస్తున్న ఊహాగానాలకు పూర్తిగా తెరపడింది.
BHPL: ఏలేటి రామయ్య పల్లె రైతులను చాందిని సీడ్ కంపెనీ మోసం చేసిందని BJP చిట్యాల మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఆరోపించారు. మంచి దిగుబడి వస్తుందని చెప్పి 30 ఎకరాల్లో సీడ్ మొక్కజొన్న అందజేసి, కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. క్వింటాకు రూ.3200 చెల్లిస్తామని కంపెనీ బాండ్ ఇచ్చిందన్నారు. ఇందుకు అనుగుణంగా వెంటనే పంట కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
HNK: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ఆటో డ్రైవర్ల ప్రధాన బాధ్యత అని CP సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు ఆయన కాజీపేట రైల్వే ఆడిటోరియంలో వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
KDP: ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా జ్యూట్, క్లాత్ బ్యాగులను వాడాలని మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ సూచించారు. బుధవారం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బ్యాన్ ఆఫ్ సింగల్ యూజ్ ప్లాస్టిక్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకూడదని ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని తెలిపారు.
SKLM: మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు విషయంలో న్యాయం గెలిచిందని, నిజాయితీ నిలబడిందని టీడీపీ నాయకుడు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు బుధవారం కూర్మారావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు తీసుకున్న చొరవ అభినీయమన్నారు. కమిషనర్కు రీపోస్టింగ్ శ్రీకాకుళంలోనే రావడానికి సహకరించిన మంత్రి అచ్చెన్నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు.
PPM: జిల్లాలో ఎన్నికల రోల్స్ మ్యాపింగ్, ఫారంల పరిశీలన పక్కగా జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారిణి కే.హేమలత అన్నారు. ఆమె ఛాంబర్లో బుధవారం జిల్లాలోని గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సమర్ధవంతంగా కొనసాగేందుకు రాజకీయ పార్టీలతో సమన్వయం అత్యంత కీలకమన్నారు.
KMM: ముదిగొండ మండలం పండ్రేగుపల్లి మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ భర్త పాము సెల్వరాజు కిడ్నాప్ కలకలం సుఖాంతమైంది. బుధవారం ఉదయం వాకింగ్కు వెళ్లి ఆయన అదృశ్యం కావడంతో కిడ్నాప్కు గురయ్యారనే ప్రచారం జరిగింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి, సెల్వరాజు హైదరాబాద్లో క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. వ్యక్తిగత పనులపైనే వెళ్లానని ఆయన తెలిపారు.