BHPL: నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అందరూ కృషి చేయాలని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 2026లో 4.26 లక్షల టన్నుల లక్ష్యం ఉండగా 3.45 లక్షల టన్నులు ఉత్పత్తి అయిందని తెలిపారు. మార్చి నెలలో 4.54 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం ఉందని పేర్కొన్నారు.
ATP: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చొరవతో 46వ డివిజన్ పరిధిలో వీధి లైట్ల సమస్య పరిష్కారమైంది. స్థానిక నాయకులు ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి అధికారులను ఆదేశించారు. దీంతో 3, 4, 5వ రోడ్లలో నూతనంగా వీధి లైట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
HYD: ప్రజాభవన్లో మంత్రి సీతక్కను సినీనటి మంచు లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. ‘టీచ్ ఫర్ చేంజ్’ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా రంగంలో వస్తున్న మార్పులు, చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి లక్ష్మి మంత్రికి వివరించారు. ఈ క్రమంలోనే మార్చి 27న నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని మంత్రిని ఆహ్వానించారు.
NZB: ముప్కాల్ మండలం వేంపల్లిలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో తపాల శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ సేవలపై అవగాహన కల్పించారు. జీవిత బీమా, పొదుపు, ఇన్సూరెన్సులు, తదితర సేవలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సరికెల సాగర్, గ్రామపంచాయతీ కారోబార్ సుంకరి కిషోర్ పాల్గొన్నారు.
TPT: హనుమంతపురం గ్రామంలోని శ్రీ తుట్టే తమ్మ అమ్మవారి దేవాలయంలో మౌలిక సదుపాయాల లేమి తీవ్రంగా ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బాత్రూంలు, తాగునీటి సదుపాయం లేకపోవడంతో పాటు ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని తెలిపారు. హుండీ ఆదాయం, విరాళాల వినియోగంపై స్పష్టత లేదని ఆరోపిస్తూ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టి పారదర్శకంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులను కోరారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం హోలీ పర్వదినాన్ని, విద్యుత్ ఉద్యోగులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు సాంప్రదాయ బద్ధమైన, పసుపు కుంకుమను చల్లుకొని ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలలో విద్యుత్ ఉద్యోగులు రాజిరెడ్డి, సంపత్ రెడ్డి, జెఏవో మెహర్ బాబా, రత్నాకర్, స్వామి తదితరులు పాల్గొన్నారు
AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటలపాటు భేటీ కొనసాగింది. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జల్జీవన్ మిషన్, డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం, నిర్వహణపై చర్చించారు. జల్జీవన్ మిషన్ కింద ఈ ఆర్థిక సంవత్సరం రూ.4 వేల కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.
SRPT: కోదాడ నియోజకవర్గంని జిల్లాగా ప్రకటించాలని పట్టణానికి చెందిన బీజేపీ జిల్లా నాయకుడు హనుమంతరావు మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలు, మూడు మున్సిపాలిటీలు, 12 మండలాలను కలిపి కోదాడను జిల్లాగా ప్రకటిస్తే విద్యా, వైద్య, వాణిజ్యం, వ్యాపార రంగాలలో మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన తెలియజేశారు.
NLG: హన్మకొండ పోలీసులు లావుడి సరిత (27) అనే మహిళను అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన ఈమె, విలాసవంతమైన జీవితం కోసం 2023 నల్గొండ, హైదరాబాద్, నార్కెట్పల్లి ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉంటూ, తనను తాను డాక్టర్గా పరిచయం చేసుకుని, ఇతర యువతుల మొబైల్ ఫోన్లు, నగదు దొంగిలించేది. అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆమెను ఎస్సై అదుపులోకి తీసుకున్నారు.
ATP: అనారోగ్యంతో సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే ఉన్నాం హనుమంతరాయ చౌదరిని ఎంపీ పార్థసారథి, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి పరామర్శించారు. ఆయన కుమారుడు మారుతిని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చౌదరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
NLR: అనంతసాగరం, ఆత్మకూరు ప్రాంతాల్లో సోమశిల జలాశయం కింద సాగు చేసిన వరి పంట మరో వారం రోజుల్లో మార్కెట్కు రానుందని సీపీఎం, రైతు సంఘం నేతలు తెలిపారు. పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకుని పుట్టికి కనీసం రూ.26 వేలు గిట్టుబాటు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ అనంతసాగరం తహసీల్దార్, వ్యవసాయ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
KMM: మార్చి 5 న ఖమ్మం పట్టణం జూబ్లీ క్లబ్ లో జరిగే సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జాతీయ సదస్సును జయప్రదం చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి ఖమ్మం సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి కందగట్ల సురేందర్ మంగళవారం పిలుపునిచ్చారు. ప్రపంచ చరిత్రలో విజయవంతమైన మొదటి కార్మిక విప్లవంగా ఈ సదస్సు జరగనుందని వారు తెలిపారు.
NGKL: కొల్లాపూర్ పట్టణంలో ప్రజలు ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. మంగళవారం హోలీ పండుగ వేడుకల్లో రాష్ట్ర మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు పాల్గొని కొల్లాపూర్ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు మంత్రితో కలిసి ఒకరికొకరు రంగులు పూసుకుని ఆహ్లాదకరమైన సంబరాలు చేసుకున్నారు.
NRML: దిలావర్పూర్ మండలం న్యూ లోలం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం సహజ రంగులతో హోలీ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీలత సాయన్న మాట్లాడుతూ రసాయన రంగులతో కాకుండా ప్రతి ఒక్కరు సహజ రంగులతో హోలీ జరుపుకోవాలని సూచించారు .అనంతరం ఒకరి పై ఒకరు రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ATP: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని విజయవాడలో చేపట్టిన సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున పేర్కొన్నారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ రాయదుర్గం పట్టణంలో అంగన్వాడీలతో కలిసి రోడ్డుపై నిల్చుని పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని వారు హెచ్చరించారు.