MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు టీపీసీసీ కో-ఆర్డినేటర్ ధారాభాస్కర్ తెలిపారు. రెండు రోజుల క్రితం నవాబుపేట పోలీస్ స్టేషన్లో తనపై కేసు నమోదైందన్నారు. అక్రమాలను అడ్డుకున్నందుకే తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. సమావేశాన్ని పోలీసులు అనుమతిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
TG: అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సంసిద్ధతను పరీక్షించేందుకు మసాబ్ టాంక్ హాకీ గ్రౌండ్లో అర్ధరాత్రి భారీ మొబిలైజేషన్ డ్రిల్ నిర్వహించారు. గోల్కొండ జోన్కు చెందిన సుమారు 650 మంది పోలీసులు ఇందులో పాల్గొన్నారు. డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ డ్రిల్లో స్పందన సమయం, అధికారుల మధ్య సమన్వయం, రక్షణ పరికరాల పనితీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
TPT: చంద్రగిరి సమీపంలోని శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 15న శాస్త్రోక్తంగా పుష్పయాగం నిర్వహించనున్నారు. ఉదయం స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం పుష్పయాగం జరుగుతుంది. గృహస్తులు (ఇద్దరు) రూ.516 టికెట్తో పాల్గొనవచ్చు. టికెట్లు 14 నుంచి ఆలయం వద్ద లభ్యం కానున్నాయి.
NLG: రాష్ట్రంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్లోని సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సదస్సులో నల్లగొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.
పరకాల నుంచి పోటీపై కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ స్పష్టతనిచ్చారు. తన తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం కొమ్మాల జాతర నుంచే మొదలైందని, తన ప్రస్థానం కూడా అక్కడి నుంచే ప్రారంభమవుతుందని ప్రకటించారు. పరకాల ఎమ్మెల్యేగా తాను తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కొండా ఫ్యామిలీ నుంచి మరో రాజకీయ వారసురాలు వస్తుండటంతో పరకాల రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
NRPT: ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగను జరుపుకోవాలని మరికల్ సీఐ భగవంతు రెడ్డి యువకులకు సూచించారు. బుధవారం హోలీ పండుగను పురస్కరించుకుని యువకులతో కలిసి హోలీ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యువకులు కలిసి మెలిసి హోలీ పండుగను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. మరికల్ పోలీస్ స్టేషన్లో సీఐ, ఎస్సైలకు యువకులు రంగులు వేసి హోలీ ఆడారు.
VSP: సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం గరుడ సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చేసి పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం సేవ నిర్వహించారు. అనంతరం మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, ప్రసాదాలను భక్తులకు అందజేశారు.
AP: మెడికల్ కాలేజీల్లో గత ప్రభుత్వ విధానంపై మంత్రి సత్యకుమార్ విమర్శలు గుప్పించారు. ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానం తెచ్చారు. ప్రైవేట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు తేడా లేకుండా పోయింది. వచ్చే రెండేళ్లలో PPP విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తాం. కూటమి ప్రభుత్వ విధానంతో ప్రతి కాలేజీలో అదనంగా 11 మెడికల్ సీట్లు కేటాయించాం’ అని వెల్లడించారు.
NDL: కొత్తపల్లి మండలం గుమ్మడాపురం గ్రామ పొలిమేరలోని భూములు ఆన్లైన్లో నమోదు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములు నమోదు కాకపోవడంతో ప్రభుత్వం నుంచి పథకాలు, పరిహారాలు అందడం లేదని వాపోతున్నారు. సమస్య పరిష్కారం కోసం సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. 2026 మార్చి 19న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను 2026 జూన్ 4కి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ నోట్ రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రకాశం: దర్శి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ బి.రాజాబాబు బుధవారం పర్యటిస్తారని తహసీల్దార్ శ్రావణ కుమార తెలిపారు. శివరాజ్నగర్ వద్ద నిర్మించిన నూతన క్రికెట్ గ్రౌండ్ను ఆయన పరిశీలిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖ పరమైన అధికారులు అందుబాటులో ఉండాలని తహసిల్దార్ ఆదేశించారు.
VSP: తూర్పు తీర రైల్వే వాల్తేర్ డివిజన్లో శిలిమ్లిగూడ-కరకవలస మధ్య డబుల్ లైన్, నాన్-ఇంటర్లాకింగ్ పనుల కారణంగా విశాఖపట్నం-కిరండూల్ (58501, 58502) ప్యాసింజర్ రైళ్లు ఈ నెల 5 నుంచి 15 వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ మేరకు ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
NLR: నగరంలోని కిసాన్ నగర్ చేపల మార్కెట్లో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ దినేశ్ బుధవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు దుకాణాల్లో చెడిపోయిన చేపలను గుర్తించి స్వాధీనం చేసుకుని పినాయిల్ పోసి నిర్వీర్యం చేశారు. నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కొనుగోలు ముందు నాణ్యతను పరిశీలించాలని తెలిపారు.
TPT: ఎర్పేడు మండలంలోని దేశంలోనే అత్యంత ప్రాచీన శివాలయంగా గుర్తింపు పొందిన గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరస్వామి ఆలయంలో ఏప్రిల్ 18 నుంచి 23 వరకు మహా కుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయ జీర్ణోద్ధరణ పనుల నేపథ్యంలో ఈ నెల 8 నుంచి బాలాలయం నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
MDK: నిజాంపేట మండలం వెంకటాపూర్ తండాకు చెందిన కవిత అనే గర్భిణికి పురిటినొప్పులు రావడంతో, 108 అంబులెన్స్లో సిద్దిపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే నొప్పులు అధికమయ్యాయి. 108 ఈఎంటీ స్వామి అప్రమత్తమై అంబులెన్స్లో చాకచక్యంగా ప్రసవం చేయగా, ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.