జగిత్యాల జిల్లాలోని పలు స్కానింగ్ సెంటర్లపై జిల్లా ఉప వైద్యాధికారి డా. జైపాల్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధమన్నారు. ఫారం-ఎఫ్ వివరాలను ప్రతినెల సమయానికి సమర్పించాలని, ఆన్లైన్-ఆఫ్లైన్ రికార్డులు ఒకేలా ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్షతో పాటు వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామన్నారు.
VSP: విశాఖపట్నం నుంచి భవానిపట్నంకు వెళ్లే ప్యాసింజర్ రైలు (58504) బుధవారం గంట ఆలస్యంగా నడవనుంది. సాధారణంగా సాయంత్రం 6 గంటలకు బయలుదేరే ఈ రైలు, సాంకేతిక కారణాల వల్ల 7 గంటలకు బయలుదేరేలా రీ షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను సవరించుకోవాలని, రైల్వే శాఖకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
SRCL: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పౌరసరఫరాల అధికారి బుచ్చిబాబు బుధవారం తెలిపారు. గ్యాస్ బుకింగ్లో సమస్యలుంటే 8008429738 నంబర్కు సంప్రదించాలని సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబ్బంది టీ. సృజన, వీ. వినాయక్ అందుబాటులో ఉంటారు. వినియోగదారులు ఏవైనా ఫిర్యాదులుంటే ఈ కంట్రోల్ రూమ్ ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు.
కోనసీమ: ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్ 2న హైదరాబాద్లో తన కుమార్తె డాక్టర్ సనాతని, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి కుమారుడు జనార్దన్ రెడ్డిల వివాహానికి రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత రావడ నాగు, తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. స్థానిక ఎన్టీఆర్ మైదానంలో నిన్న రాత్రి 7 గంటల నుంచి పది గంటల వరకు నిర్వహించిన అనకాపల్లి అన్నమాచార్య వాగ్గేయ వరదాయిని వారిచే ‘ఏడుకొండల వెంకటేశుడు’ సంగీత ప్రదర్శన, విశాఖకు చెందిన సాయినాట్య భారతి అకాడమీ వారు ప్రదర్శన ఆకట్టుకుంది.
KNR: రామడుగు మండలం తిరుమలాపూర్లోని దళిత కాలనీలోని గృహాల మీదుగా వెళ్తున్న 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలను వెంటనే తొలగించాలని మాజీ సర్పంచ్ తడగొండ సత్యరాజ్ వర్మ డిమాండ్ చేశారు. గ్రామస్థులతో కలిసి ఆకాశానికి చేతులెత్తి ఆయన నిరసన తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న ఈ వైర్ల వల్ల ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు.
VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పర్యటన వివరాలను బుధవారం ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. గురువారం ఉదయం 6 గంటలకు శ్రీ పరాభవ నామ ఉగాదిని పురస్కరించుకుని వారి స్వగ్రామం విఎన్పురంలో రైతులతో కలిసి ఏరువాక కార్యక్రమంలో పాల్గొంటారు. 9 గంటలకి జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి వారి ఆలయంలో జరిగే ఉగాది ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.
పెద్దపల్లి జిల్లాలో ఎల్పీజీ సిలిండర్లు సమృద్ధిగా ఉన్నాయని, వినియోగదారులు ఆందోళనతో ముందస్తు బుకింగ్లు చేయవద్దని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. 15 పంపిణీ కేంద్రాల ద్వారా 3-4 రోజుల్లోనే డెలివరీ జరుగుతుందన్నారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. గ్యాస్ సరఫరాలో ఏవైనా సమస్యలుంటే 08728 224045 నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు.
JGL: రాయికల్ పట్టణానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. పడాలతిరుపతికి “బెస్ట్ ఇండియన్ గోల్డెన్ పర్సనాలిటీ అవార్డు” లభించింది. కరీంనగర్ ఆర్ట్స్ కళాశాలలో బోటనీ విభాగంలో పనిచేస్తున్న ఆయన, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్గా అందించిన సేవలకు గానూ ఈ గుర్తింపు దక్కింది. జాతీయ ఐక్యత, గ్రామీణాభివృద్ధిపై ఆయన చేసిన అవగాహన కార్యక్రమాలను పలువురు అభినందించారు.
JGL: కోరుట్లకు చెందిన అంగన్వాడీ టీచర్ మేకల సాయీశ్వరికు తిరుపతిలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ 18వ జాతీయ సదస్సులో 2026 ఉమెన్ లీడర్షిప్ నేషనల్ అవార్డు ప్రదానం చేశారు. నల్లా రాధాకృష్ణ, యూ. సుబ్రమనియన్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకున్నారు. మహిళా సాధికారత, సామాజిక సేవలో చేసిన కృషికి ఈ గౌరవం లభించింది.
SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి, ఫోర్ క్లాస్ ఉద్యోగులకు ఆలయ ఈవో ఎల్ రమాదేవి ఆలయం తరఫున రెండు చీరలను పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం ఒకసారి నిర్వహించే ఈ కార్యక్రమం ఆలయంలో కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
KNR: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కరీంనగర్ రూరల్ ఎక్సైజ్ సీఐ గుండేటి రామును అరెస్ట్ చేసినట్లు ఏసీబీ ఇన్స్పెక్టర్ పున్నం చందర్ తెలిపారు. వేములవాడలో పని చేసిన కాలంలో స్నేహితుడు వేణు యూపీఐ ఖాతా ద్వారా రాము మామూళ్లు వసూలు చేసినట్లు గుర్తించారు. సోదాల్లో రూ. 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని, నిందితులిద్దరినీ రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
ATP: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ పరీక్షకు 16,162 మంది విద్యార్థులు హాజరు కాగా, 247 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్ వెంకటరమణనాయక్, ఇతర అధికారులు పలు కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు స్వగ్రామాలకు బయలుదేరారు.
SKLM: రణస్థలం మండలం కొండములగాం ఆదర్శపాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఏప్రిల్ 30వ తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. ఐఐటీ మద్రాస్తో స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాం ద్వారా ఆన్ లైన్ కోర్సులు అందిస్తున్నామని, ఈ కార్యక్రమం విద్యార్థులకు అదనపు జ్ఞానాన్ని అందిస్తుందన్నారు.
VSP: ఉద్యోగుల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. బుధవారం కొమ్మాది స్పోర్ట్స్ మైదానంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఎక్సైజ్ ఉద్యోగుల క్రీడల ముగింపును నిర్వహించగా ప్రతిభకనబరిచిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు.