సినిమా ఫంక్షన్లలో ఒక్కోసారి ఇరకాటంలో పెట్టేసే పరిస్థితులు ఎదురవుతుంటాయి. సరదాగా మాట్లాడినా ఆ మాటలు ప్రాణాంతకంగా మారుతాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో. ఎందుకూ అంటే ఇక్కడ అందరూ కనిపిస్తే కౌగలించుకుంటారు. వెనక్కి తిరిగితే మనసులో మాటలు బైటకు వస్తాయి. అలాగని శత్రుత్వాలుండవు సినిమా పరిశ్రమలో. ఎదిగినవాళ్ళు ఎదుగుతూ ఉంటారు. దిగిపోయినవాళ్ళు దిగిపోతుంటారు. ఇది చాలా సహజమైన పరిణామక్రమం. దీన్ని అర్ధం చేసుకుంటూనే అందరూ ఒకరితో ఒకరు మసలుకుంటుంటారు.
మొన్నీమధ్యన జరిగిన కుబేర విజయోత్సవ వేడుకలో చిరంజీవిగారు రహస్యం విప్పిచెప్పి అన్నమాటలు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ని ఇరకాటంలో పెట్టేశాయి. మొదటనుంచీ నైజాంలో ఏ పెద్ద సినిమా అయినా, ఏ చిన్న సినిమా అయినా కూడా ఏషియన్ ఫిల్మ్స్ సంస్ధే పంపిణీ చేస్తూ వచ్చింది. నారాయణదాస్ నారంగ్ అనే ఓ మహావ్యక్తి స్థాపించిన సంస్థగా ఏషియన్ ఫిల్మ్స్ సంస్థ దశాబ్దాలుగా అగ్రగామిగా రాజ్యమేలుతోంది. ఆ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలన్నిటినీ నారాయణదాస్ నారంగ్గారే పంపిణీ చేస్తూ వచ్చారు.
నైజాం మెగాస్టార్కి కంచుకోట. పెద్ద టెర్రిటరీ కూడా. ఆంధ్రాసీడెడ్తో పోలిస్తే నైజాం అతి పెద్ద ఏరియాగా రెవిన్యూ కూడా అంతే పదింతలుంటుంది. కానీ తొలిరోజుల్లో అంటే మెగాస్టార్ విజృంభించి టాప్ర్యాంక్కి వెళ్ళక ముందు మాట. నైజాంలో ధియేటర్లు తక్కువ. నిజానికి తెలంగాణలో సినిమా సంస్కృతి చాలా తక్కువ. సినిమా మోజున్నవాళ్ళు ఆంధ్రా, సీడెడ్తో పోలిస్తే అతి స్వల్పం. ఎప్పుడో పైడి జయరాజ్, కాంతారావు, ప్రభాకర్ రెడ్డి తప్పితే తెలంగాణ నుంచి వచ్చిన లబ్దప్రతిష్టులు కూడా లేరు సినిమా పరిశ్రమలో. ఆ మేరకు సినిమా స్పృహ లేనట్టే. కానీ చిరంజీవి వేళ్లూనుకున్నతర్వాత ధియేటర్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. చిరంజీవి సినిమాలు చితకబాదుడు బాదేశాయి. దాంతో ఒక్క ఆంధ్రాసీడెడ్లోనే కాదు, తెలంగాణలో కూడా చిరంజీవి సినిమాలకి తిరుగులేని రెవిన్యూ వచ్చి పంపిణీదారులు, ప్రదర్శకులు కూడా ఎంతో బాగుపడ్డారు. అందులో పంపిణీదారులుగా ఏషియన్ ఫిల్మ్స్ సంస్ధ కూడా బాగా ఎదిగింది. కానీ, ఎప్పుడైతే చిరంజీవి సినిమాలు మోతెక్కిపోతున్నాయో, అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అనే పంపిణీ సంస్థని ప్రారంభించి, చిరంజీవి సినిమాలను ఏషియన్ ఫిల్మ్స్ దగ్గర్నుంచి తప్పించేశారు క్రమంగా. అప్పుడే మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవికిచ్చే రెమ్యూనరేషన్కి బదులు నైజాం రైట్స్ తీసుకోవడం మొదలైంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ హవా మామ్మూలుగా నడవలేదు ఒకటైంలో.
మళ్ళీ నాగేంద్రబాబు అంజనా ప్రొడక్షన్స్ పతాకంమీద వాళ్ళ పాదర్ కె. వెంకట్రావు సమర్పణలో మెగాస్టార్ చిరంజీవి, రంభ కాంబినేషన్లో జయంత్ దర్శకత్వంలో నిర్మించిన బావగారు బాగున్నారా చిత్రం మాత్రం గీతా ట్రాక్లో తప్పిపోయింది. నాగేంద్రబాబు నిర్మాత తాను స్వయంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం గీతాని పక్కనబెట్టి ఏషియన్కి నైజాం డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చి సంచలనం సృష్టించాడు. అప్పుడది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ప్రతీ సంస్థ కార్యాలయంలోనూ అదే చర్చ. ఏంటిది, గీతాని పక్కన పెట్టి ఏషియన్కి సినిమా ఎలా వెళ్ళింది, అందరికీ ఓ పెద్ద షాక్. దాన్ని జీర్ణించుకోవడానికి కొందరికి చాలా రోజులు పట్టింది.
తర్వాత మళ్ళీ మెగాస్టార్ చిత్రాలు చాలా గీతావే చేసిందనుకోండి. మళ్ళీ అల్లు అరవింద్తో సునీల్ నారంగ్ వ్యాపారాలు, మల్టీప్లెక్సులు వాటి నిర్మాణం ఇలా సాగుతూనే వచ్చాయి ఈనాటి వరకూ. అదొక్కటే కాదు. థియేటర్లు, షేర్లు చాలా వ్యవహారం ఇద్దరి మధ్యనా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
పిల్లి పిల్లి పోరు పిట్ట తీర్చిందన్నట్టుగా, ఇప్పుడు కొత్తగా మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి తీసుకుని అవి కూడా థియేటర్లు కట్టడం, పాత థియేటర్లు తీసుకుని రీమోడలింగ్ చేసి మైత్రీ అని నామకరణం చేసి, సినిమాల విడుదల వ్యవహారాన్ని మరో మలుపు తిప్పేసింది. ఇదొక రకంగా దిల్రాజుకి కూడా ఓ రకంగా ఇబ్బందే కలిగించిన మాటైతే వాస్తవం.
చిరంజీవి మొన్న కుబేర ఫంక్షన్లో సునీల్ నారంగ్ని ఉద్దేశించి, చెప్పనా, చెప్పనా అని ఊరించి ఊరించి మరీ ఆ మాట చెప్పడానికి ఇదే కారణం. అదేంటంటే, ‘’ మీ సినిమాలు మేం చేసినప్పుడు బాగా సంపాదించాం సార్. అరవింద్గారు మధ్యలో వచ్చి మమ్మల్ని పక్కకు నెట్టేశారు సార్.’’ అన్నవి సునీల్ నారంగ్ చిరంజీవితో ప్రయివేట్గా అన్నమాటలు. వాటిని ప్రస్తుతం అల్లు అరవింద్కీ, సునీల్ నారంగ్కీ మధ్యలో నడుస్తున్న లావాదేవీలకు ఎంతో కొంత ఇద్దరినీ ఇరుకున పెట్టే మాటలే. మరెందుకు చిరంజీవి ఆ మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారో ఆయనకే తెలియాలి.
ఓ పక్కన అల్లు అరవింద్ ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్యన నడుస్తున్న ఓపెన్ కోల్డ్ వార్ నేపథ్యంలో మెగాస్టార్ అన్నారా అనే అనుమానాలు ఎందరికో కలిగాయి. మళ్ళీ సునీల్ నారంగ్ కుమార్తె జాహ్నవి డేట్స్ ఇస్తున్నట్టుగా మెగా ప్రకటన కొసమెరుపును అద్దింది.