తమిళ్ సూపర్స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున కాంబినేషన్లో ఏషియన్ సునీల్ నారంగ్, వేంకటేశ్వర సినిమాస్ పుస్కూర్ రామ్మోహనరావు సంయుక్తంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నిర్మించిన తాజా చిత్రం కుబేర బ్రహ్మాండమైన టాక్తో సూపర్ హిట్ దిశగా దూసుకుపోయింది. శేఖర్ కమ్ములకి దర్శకుడిగా ఎక్కడ లేని క్రేజ్ రావడమే కాకుండా, మెగాస్టార్ చిరంజీవి లాంటి మైఠీ హీరో ఈ సినిమాని, అందులో నాగార్జున, ధనుష్ చేసిన పాత్రలని ఎంతో మెచ్చుకుని, అభినందించారు. కుబేరలో శేఖర్ సృష్టించిన ఓ కొత్త లోకం, గరీబుకి, అమీర్కి మధ్యన ఓ మధ్యతరగతి….ఈ త్రికోణపోరాటం, అందులో ఇమిడిఉన్న వైవిధ్యాన్ని రసవత్తరంగా ఆద్యంతం రక్తికట్టించిన విధానం క్రూడ్ క్రిటిక్స్ కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. నాకింకా మరో నలభై ఏళ్ళ కెరీర్నిచ్చాడు శేఖర్ అని స్వయంగా నాగార్జునే విజయోత్సవ వేడుకలలో చెప్పుకోవడం బట్టి, ఇందులో నటించిన నటీనటులకు ఎంత సంతృప్తి లభించింది, వారు ఎంత ఎంజాయ్ చేశారనేది అర్ధమవుతుంది.
కానీ ఎంత పెద్ద టాక్ వచ్చిందో ఈ పాన్ ఇండియా సినిమాకి అంత గొప్ప రెవిన్యూ రాకపోవడమే అందరినీ ఆలోచింపచేస్తోంది. తెలుగులో అయితే కొంత వరకూ చావు తప్పి కన్ను లొట్టపోయినట్టయిందని, లాస్ కవర్ అయి ఇంట్రస్ట్ పార్ట్ వర్కవుట్ అయింది, మహా అయితే మరో నాలుగైదు కోట్లు లాభాలతో నిర్మాతలు బైటపడతారని ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. హిందీలో కూడా ఓ రకంగా చెప్పాలంటే కొంత వరకూ బెటర్ అనే రిపోర్ట్ ఉంది. కానీ మళయాళం, కన్నడ అయితే పూర్తిగా హుళక్కి. అసలు ఎక్కడైతే దుమ్ము లేపేస్తుందని అందరూ ఊహించుకున్నారో అక్కడ కుబేర సినిమా కుచేలుడి అవతారం ఎత్తింది. అంటే పూర్తిగా అడుక్కు తింది అనేది సర్వత్రా వినిపిస్తున్న టాక్.
తమిళ్లో థనుష్కి ఉన్న ఫాలోయింగ్ అండ్ ఛరిస్మా ఆషామాషీ కాదు. టాప్ ర్యాంక్ హీరో ధనుష్ అక్కడ. కానీ కుబేర ఎందుకో అక్కడ ఆడియన్స్ని ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీసు దగ్గర బొక్క బోర్లాపడింది. నిల్ కలెక్షన్లు. అంటే నిర్మాతలు ఓ నాలుగైదు కోట్ల వరకూ అక్కడ తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. మళయాళం కన్నడ కూడా దాదాపుగా అదే పరిస్థితి. ఎందుకిలా అయిందనే ఇప్పుడు మీనమేషాలు లెక్కబెడుతున్నాడు దర్శకుడు శేఖర్. ఖర్చా చూస్తే అంతులేని ఖర్చు. అంచనాలా తారుమారు. ఎంతగా నిర్మాతలు అడ్డుపడినా 150కోట్లు వరకూ మంచినీళ్ళలా అయిపోయింది. నిర్మాతలు ఎంత వారించినా కూడా శేఖర్ని అయితే ఆపలేకపోయారు. ఇష్టానికి నిర్మాతల్ని వాడేసుకున్నాడు. పైగా తన పారితోషకమే కాకుండా లాభాలలో వాటా కూడా డిమాండ్ చేశాడని వినికిడి. దీంతో పాటు తన సొంత సంస్థ ఎమిగో ద్వారానే ఎగ్టిక్యుషన్. అంటే ఎక్కడా ఆపలేని దూకుడు. తన సైన్యంతో నిర్మాతలమీద స్వైరవిహారం చేసేశాడు శేఖర్ కమ్ముల అని యూనిట్ సభ్యులే చెబుతున్నారంటే ఏ రేంజ్లో నిర్మాతలు బలైపోయారో!
ఒక్కటే సంతృప్తి మిగిలింది నిర్మాతలకి. చాలా గొప్ప సినిమా తీశారు అనే గౌరవాన్ని మిగిల్చింది కుబేర. అది కూడా బ్యానర్కి కలిగిన భాగ్యమేనని ప్రస్తుతం నిర్మాతలు సంతోషించడంలో మునిగిలేలుతున్నారు. ఒకవేళ, వెంటనే గనక శేఖర్ కమ్ముల సునీల్ నారంగ్కి, రామ్మోహనరావుకి సినిమా అనౌన్స్ చేస్తేగీస్తే ఆ సినిమాతో వారిద్దరూ కొంత ప్రాఫిట్ మార్జిన్ తమ ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది కానీ, కుబేరతో మాత్రం వాళ్ళు పెద్దగా లాభపడింది లేదని చాలా చాలా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.