కుబేర సినిమా పెద్ద హిట్ అయిన సందర్భంగా ఈ మథ్యన నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు భారీ స్థాయిలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. దానికి సినిమా కాస్ట్ అండ్ క్రూ హాజరు కాగా, మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిధిగా వచ్చారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుబేర విజయం పట్ల తన ఆనందాన్ని అపారంగా వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ – ‘’ నేనీ కార్యక్రమానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. నేనేదో గెస్ట్ రూపంలో రాలేదని, ఈ టీమ్ లో ఓ పార్ట్ లాగే ఫీలవుతున్నాను. నాగార్జున ఓ సారి కుబేర కథ గురించి చెప్పాడు. ధనుష్ లీడ్ రోల్ చేస్తున్నాడు. నేనీ క్యారెక్టర్ చేస్తున్నాను అని వివరిస్తే, ఎందుకు ఇలాటి క్యారెక్టర్ చేస్తున్నావు అనడిగాను నాగ్ని. నాగార్జున దానికి ఎన్నాళ్లు ఒకే టైపు క్యారెక్టర్ చేయాలి, ఎక్కడో అక్కడ మార్పు రావాలి అనే ఒప్పుకున్నాను అని చెప్పాడు. కరెక్టే అనిపించింది నాకు. నాకూ అనిపించింది అప్పుడు ఎన్నాళ్ళీ ఎలివేషన్స్, ఎన్నాళ్ళీ ఒకే రకమైన క్యారెక్టర్లు చ.. కథలు ఇటువంటి చేసినప్పుడే కదా తెలియని రిలీఫ్ కలుగుతుంది అని.నాగార్జున చాలా బాగా చేయించుకున్నాడు. ఇంక ధనుష్ చేసిన క్యారెక్టర్ చేయడానికి ఇండియాలో ధనుష్ తప్పితే మరొకరు లేరు. అంతబాగా పెరఫార్మ్ చేశాడు ధనుష్. నిజంగానే నాగార్జున చెప్పినట్టుగా నాగార్జునకి మరో నలభై ఏళ్ళు తిరుగులేదు. అంత మంచి ఓపెనింగ్ ఇచ్చింది ఈ క్యారెక్టర్.’’ అని చెబుతూ మధ్యలో సునీల్ నారంగ్ కుమార్తె జాహ్నవిని ఉద్దేశించి చమత్కారంగా మాట్లాడారు చిరంజీవి.
జాహ్నవి నారంగ్ కుబేర సినిమా నిర్మాతల్లో ఒకరు. చిరంజీవి డేట్స్ ఇమ్మని ఆమె చిరంజీవిని అడగడం జరగింది. దీనికి సమాధానం చెబుతూ చిరంజీవి ‘’ నేను తప్పకుండా డేట్స్ ఇస్తాను. నీకు సినిమా చేస్తాను. కానీ అమ్మాయ్…నాకు మాత్రం మాంచి మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ కథ, క్యారెక్టరే కావాలి సుమా.’’ అని వేదిక కింద ఉన్న జాహ్నవిని ఉద్దేశించి వేదికపై నుంచి చిరంజీవి చెప్పడంతో ధియేటర్లో చప్పట్లు మారుమోగిపోయాయి.
అయితే ఇందులో విచిత్రం ఒకటుంది. ఓ పక్కన కుబేర చిత్రంలో నాగార్జున పాత్రను మెచ్చుకుంటూ, ఎన్నాళ్లు చేస్తాం ఒకే మూసధోరణి సినిమాలు, క్యారెక్టర్స్ అని చెబుతూ, నాగార్జున నిర్ణయం చాలా కరెక్ట్ అని ఒప్పుకుంటూనే, మరో పక్క మళ్ళీ తనకి మాస్ క్యారెక్టర్, కథ కావాలి అని చెప్పడమే ఎవరికీ అర్ధం కాలేదు. అంటే మెగాస్టార్ ఇంతకుముందు కొన్ని ప్రయోగాలు చేశారు. గాడ్ ఫాదర్, సైరా ఈ చిత్రాలు ఆయనకి విజయాన్ని అందించలేదు. అందుకే మళ్ళీ విశ్వంభర లాంటి ఫాంటసీ వైపు దృష్టి మళ్ళించారు. ఇప్పుడు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ని ఎంచుకున్నారు. మరి ఆ సినిమాలతో విసిగిపోయారో, అలసిపోయారో. మొత్తానికైతే నిర్మాత జాహ్నవికి తన మనసులో మాట బాహాటంగానే చెప్పేశారు. మరి జాహ్నవి ఎటువంటి కథని మెగాస్టార్కి అందిస్తుందో చూడాలి. ఎంటర్టైన్మెంటే సుమా!