MLG: బామ్మర్ది మరణ వార్త విని బావ గుండెపోటుతో మృతి చెందిన ఘటన తాడ్వాయి మండలంలో జరిగింది. నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మనోహర్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మనోహర్ బావ ఎల్లయ్య తాడ్వాయి మండలంలోని నరసింగాపురం గ్రామంలో బుధవారం గుండెపోటుతో మరణించాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
MBNR: దేవరకద్ర మార్కెట్లో ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. క్వింటాల్ ధర 900 నుంచి 1,200 రూపాయల మధ్య ఉంది. 6,000 బస్తాల ఉల్లి రావడంతో మార్కెట్ నిండిపోయింది. రైతులు కష్టపడి పండించిన ఉల్లికి తగిన లాభం పొందకుండా.. వెనక్కి తీసుకెళ్లలేక ఇలాంటి ధరల్లో అమ్ముతున్నారు. వ్యాపారులు వేలంలో పాల్గొని 50 కిలోల ఉల్లిని 450–600 రూపాయలకే విక్రయిస్తున్నారు.
PDPL: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో పోలీసు కళాజాత బృందం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాటలు, నాటికల రూపంలో సైబర్ క్రైమ్, గంజాయి, చేతబడులు వంటి మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కలిగించారు. కార్యక్రమంలో సర్పంచ్ రజిత, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ADB: ఆశా వర్కర్ల యూనియన్ సభ్యులు బోథ్ MLA అనిల్ జాదవ్ను నేరడిగొండలోని ఆయన నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలల నుంచి వేతనాలు చెల్లించక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ఎమ్మెల్యేతో ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని MLA అనిల్ జాదవ్ హామీ ఇచ్చారు.
JN: బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ప్రకటించారు. పార్టీ కార్యకలాపాలను బలోపేతం చేయడంలో ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజలకు వివరించే బాధ్యతలను ఆయనకు అప్పగించింది.
NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ రేపు చందంపేట మండలంలో పర్యటించనున్నారు. ఉదయం ముర్పునూతల, బండమీది తండాల్లో CC రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే మండల కేంద్రంలోని కేజీబీవీలో నూతన తరగతి గదులను ప్రారంభించడంతో పాటు, మానవత్ తండాలో నూతన గ్రామ పంచాయతీ, మహిళా సమాఖ్య భవన నిర్మాణాలకు భూమిపూజ చేస్తారు.
KNR: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 27 మందిని నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో కరీంనగర్ నుంచి మాజీ మేయర్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావుకు చోటు దక్కింది. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన రామచందర్ రావుకు కేంద్ర మంత్రికి సునీల్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
RR: సరూర్నగర్ మార్కెట్కు మిర్చి రాక భారీగా పెరిగింది. వారం రోజులుగా వేల బస్తాల ఎర్రబంగారం మార్కెట్కు చేరుతుంది. డిమాండ్ ఉన్నప్పటికీ స్థానికంగా వ్యాపారుల సిండికేట్తో రైతులకు ఆశించిన ధర దక్కడం లేదని వాపోతున్నారు. రూ. 19వేలకు పైగా ఉన్న క్వింటాకు వ్యాపారులు కుమ్మక్కై రూ. 2వేల నుంచి రూ. 4వేల వరకు తగ్గించి ఇస్తున్నారని చెబుతున్నారు.
SRD: కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు సిబ్బంది సమయం పాలన పాటించడం లేదు. ఇందుకుగాను గురువారం ఉదయం (10:30) పదిన్నర అవుతున్న ఏ ఒక్కరూ కూడా హాజరు కాలేదు. దీంతో కార్యాలయంలోని అన్ని కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఆపరేటర్లు, EGS సిబ్బంది కూడా ఎవరు రావడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
NGKL: వంగూరు మండలం కోనాపూర్ గ్రామంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో గురువారం పశు వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. వీటి వల్ల పశువులకు ప్రాణాంతక గాలికుంటు వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు.
RR: షాద్నగర్ నియోజకవర్గంలోని పల్లె సీమల రూపురేఖలు మార్చడమే లక్ష్యమని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా లింగారెడ్డిగూడలో రూ. 30 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులను చేపడుతున్నామన్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
SRPT: జిల్లాలో ఉక్కా విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈరోజు సూర్యాపేటలోని రెండు వస్త్ర దుకాణాలపై దాడులు చేసి రూ.15 వేల విలువైన ఉక్కాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కె. నరసింహ తెలిపారు. ముగ్గురిపై కేసులు నమోదు చేశామన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు.
జగిత్యాల పట్టణంలో వితంతు, ఆసరా పెన్షన్లను రూ. 4,016కు పెంచాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు జిల్లా అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే భర్తను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వితంతువుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.
GDWL: మల్దకల్లో ఈనెల 17న (మంగళవారం) రైతు సంబరాల ప్రాంగణంలో పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల సంత ప్రారంభమవుతుంది. రైతులు, వ్యాపారస్తులు ఈ సంతను సద్వినియోగం చేసుకుని తమ వ్యాపారాన్ని ప్రోత్సహించడమే కాక, గ్రామ అభివృద్ధికి కూడా సహకరించాలని సర్పంచ్ చిట్టెమ్మ గోపాల్, కార్యదర్శి మాబి అన్నారు. ప్రతి ఒక్కరు పాల్గొని సంతని విజయవంతం చేయాలని వారు కోరారు.