GDWL: ప్రజలు ఎన్నో ఆశలతో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తారు ప్రజావాణి సమస్యలను ఎట్టి పరిస్థితుల్లోను పెండింగ్లో పెట్టవద్దని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 56 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. అధికారులు త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
SRCL: సిరిసిల్ల జిల్లాలో SSC పబ్లిక్ పరీక్షలు మూడవ రోజున ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 34 పరీక్షా కేంద్రాలలో 7,307 మంది విద్యార్థులకు గాను 7,297 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని పేర్కన్నారు. మొత్తం 11 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, 99.85% మంది విద్యార్థులు హాజరు అయ్యారని తెలిపారు.
KMR: ఎల్లారెడ్డిలోని తెలంగాణ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో నేడు పీడియాట్రిషన్ నిపుణులు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. బాలికలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. పీడియాట్రిషన్ డా.శ్రవణ్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు, ప్రత్యేకంగా HPV వ్యాక్సినేషన్ వల్ల కలిగే లాభాలపై విద్యార్థులకు వివరించామన్నారు.
MDK: నర్సాపూర్ పట్టణంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్ దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించి, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
VKB: తాండూరు బస్టాండ్లో బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ వైపు వెళ్లే బస్సులు సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రతతో వృద్ధులు, విద్యార్థులు బస్టాండ్లో పడిగాపులు కాస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సుల సంఖ్యను పెంచి, ప్రయాణికుల కష్టాలను తీర్చాలని స్థానికులు కోరారు.
SRD: కల్లు గీత కార్మికులకు బడ్జెట్లో రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డిలో కలెక్టర్ ప్రావీణ్యకు సోమవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు ఆశన్న గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ నాయకులు పాల్గొన్నారు.
SRPT: కోదాడ పట్టణంలో వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు ముమ్మరం చేయాలని మున్సిపల్ ఛైర్మన్ కుసుమ వెంకట్ రత్నం బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం 21వ వార్డులో మిషన్ భగీరథ పైప్లైన్ మరమ్మతు పనులు ఆమె పరిశీలించారు. లీకేజీలను వెంటనే అరికట్టాలని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సిబ్బందికి సూచించారు.
NLG: ఊరి కుక్కల దాడిలో దుప్పి మృతి చెందిన సంఘటన మర్రిగూడ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తానేదారుపల్లి గ్రామ శివారులో ఉన్న గుట్ట పరిసర ప్రాంత వ్యవసాయ భూముల్లో దుప్పిలు మందగా సంచరిస్తుండగా ఊరి కుక్కలు తరమడంతో పరిగెత్తాయి. ఈ నేపథ్యంలో ఫెన్సింగ్కు తాకి దుప్పి మృతి చెందింది. సర్పంచ్ నరసింహ ఫారెస్ట్ ఆఫీసర్లకు అప్పగించారు.
NLG: మునుగోడు మండలం కొంపల్లి శ్రీ పార్వతి రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ఆదాయాన్ని ఆలయ చైర్మన్ వెదిరె విజేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది రూ. 5,92,540 ఆదాయం రాగా, ఖర్చులు పోను రూ. 1,68,215 మిగిలాయి. ప్రస్తుతం ఆలయ నిధులు రూ. 12,27,362 ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
NZB: సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన దేశభక్తి అని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా నాయకులు అన్నారు. బోధన్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ల త్యాగాలను స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారన్నారు. నేటి యువతకు ఎంతో వారు ఎంతో స్ఫూర్తినిస్తారని నేతలు కొనియాడారు.
JGL: జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదలలో జాప్యం కారణంగా విద్యార్థులు రోడ్డెక్కారు. రాష్ట్రంలో మద్యం శాఖకు మంత్రి ఉన్నప్పటికీ, విద్యా శాఖకు మంత్రి లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు. తక్షణమే బకాయిలను విడుదల చేయాలని విద్యార్ధి నాయకులు డిమాండ్ చేశారు.
SRCL: రుద్రంగి మండలం, కథలాపూర్ మండలం కలిగోట సరిహద్దుల్లో పులి సంచరింస్తున్నట్లు వదంతులు రావడంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పాదముద్రలను పరిశీలించి అవి హైనా పాద గుర్తులని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్వో పద్మారావు, సెక్షన్ ఆఫీసర్ ముస్తాక్ అలీ, బీట్ ఆఫీసర్ శ్రావణ్, సర్పంచ్ రమేశ్ ఉన్నారు.
MHBD: యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తొర్రూరు ఎస్సై ఉపేందర్ సూచించారు. ఇవాళ తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామంలో గంజాయి నిర్మూలన, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం నవాబుపేట్ మండలం నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన కే.గిరిని ఏఎంసీ ఛైర్మన్ గీత సింగ్, డైరెక్టర్స్ కందాడ నరసింహారెడ్డి, చిట్టెపు రాజశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని,అందుకు అందరూ సహకరించాలని కోరారు.
జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు నిరసన చేపట్టారు. TRP జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులు కూడా చేయకపోవడం దురదృష్టకరమని, బడ్జెట్లో బీసీలకు మొండిచేయి చూపించారని విమర్శించారు.