NZB: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) సెక్రటరీగా మోస్రా మండలానికి చెందిన పిట్ల శ్రీరాములు నియమితులయ్యారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
NRML: కడెం మండలంలోని కొత్త మైసంపేట్ గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి కొత్త మైసంపేట్కు చెందిన మాడావి దేవ్ రావు మృతి చెందాడు. పశువుల కాపరిగా పనిచేస్తున్న దేవరావు గత రెండు రోజుల క్రితం పశువులు మేపడం కోసం అటవీ ప్రాంతానికి వెళ్ళాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికిన కనిపించకపోగా శుక్రవారం వ్యవసాయ బావిలో శివమై కనిపించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
HNK: ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో విజన్, విషయం లేదని BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు.” ఈ బడ్జెట్ సామాన్య ప్రజలకు, పెట్టుబడిదార్లకు, మార్కెట్కి విశ్వాసం కల్పించడంలో ఘోరంగా ఫెయిలయ్యింది. ఆరు గ్యారంటీలకు మంగళం పాడారు. డిక్లరేషన్లకు నీళ్లు వదిలారు. ఓటు వేసిన వాళ్లకు వెన్నుపోటు పొడిచారు.” అని ఫైర్ అయ్యారు.
JN: కొడకండ్ల అభివృద్ధికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కృషి చేస్తున్నారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ నాయక్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కొడకండ్లలో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటుపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తావించడం అభినందనీయమన్నారు. కొడకండ్ల ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేస్తే ఈ ప్రాంత ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
SRD: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం (RSETI) ఆధ్వర్యంలో ఉచిత ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 19-45 ఏళ్ల లోపు యువకులు ఈ శిక్షణకు అర్హులు. ఆసక్తి గల వారు బైపాస్ రోడ్డులోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో మెమోరాండం అందజేశారు. ఆరు గ్యారంటీలు, నిరుద్యోగ భృతి అమలులో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు.
MNCL: నెన్నెల మండల కేంద్రంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం అకాడమిక్ బ్లాక్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
JGL: మైతాపూర్ గ్రామంలో శ్రీ గిరి గుట్ట కనకదుర్గాదేవి ఆలయానికి మెయిన్ రోడ్డు నుంచి సిమెంట్ ఆధార నిర్మాణానికి హద్దులు చూపించాలని కోరుతూ వార్డు సభ్యులు శుక్రవారం రాయికల్ తహశీల్దార్ నాగార్జునకు వినతిపత్రం సమర్పించారు. రాజ్యసభ సభ్యుడు దామోదర రావు రూ.15 లక్షల నిధులు మంజూరు చేశారని, భూమికి సరిహద్దుల విషయంలో స్పష్టత లేకపోవడంతో వివాదం నెలకొందని పేర్కొన్నారు.
భద్రాచలం సమీపంలోని కొల్లుగూడెం సమీపంలో ఐదుగురు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు ఇప్పటికే లభ్యం కాగా, తాజాగా మరో మృతదేహం లభ్యమైంది. మిగతా ఇద్దరి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ ఘటనపై మంత్రి తుమ్మల విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
SRCL: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలోని సుందరయ్య నగర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ వైద్య శిబిరంలో 263 మందిని పరీక్షించి మందులను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సంపత్ కుమార్, రామకృష్ణ ఉన్నారు.
KNR: రామగుండం సింగరేణి సంస్థ GDK-1వ బొగ్గు గని ఆవరణలో ఇటీవల నిర్మించిన మీటింగ్ హాల్ను RG-1 GM లలిత్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. కార్మికులు విశ్రాంతి సమయంలో అధికారులకు మీటింగ్ హాల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గుర్తింపు కార్మిక సంఘం (AITUC) నాయకులు మడ్డి ఎల్లా గౌడ్, అధికారులు రమేశ్, సురేశ్, నాయకులు సంకే అశోక్, తదితరులు పాల్గొన్నారు.
PDPL: జిల్లా నూతన కాంగ్రెస్ కమిటీ నియామకంలో భాగంగా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కొత్త నరసింహం DCC సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నరసింహం BRS హయాంలో ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు.
KMM: కామేపల్లి మండలంలోని పండితాపురం శ్రీకృష్ణ ప్రసాద్ పశువుల సంత వేలం పాట శుక్రవారం మళ్లీ వాయిదా పడింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయించిన కనీస మద్దతు ధర రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ దారావత్ అనురాధ తెలిపారు. ఆశించిన స్థాయిలో ధర రాకపోవడంతో వేలం ప్రక్రియ వాయిదా పడుతోందన్నారు. తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
WGL: మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి వల్లందాసు కుమార్ డిమాండ్ చేశారు. క్వింటాకు రూ.2400 మద్దతు ధరతో కొనుగోలు చేపట్టాలని అన్నారు. కొనుగోలు చేయకపోవడంతో పౌల్ట్రీ నిర్వాహకులు ఇదే అదునుగా భావించి క్వింటాకు రూ.1600 నుంచి రూ.1900 మాత్రమే చెల్లిస్తున్నారని వాపోయారు.