కోనసీమ: జిల్లాలో ఇద్దరు ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఇవాళ సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. రాజోలు ఎస్సైగా ఆర్.మల్లికార్జున రెడ్డి, అంబాజీపేట ఎస్సై గా షేక్ సుభానిను నియమించామని ఆదేశాలలో పేర్కొన్నారు. రాజోలు ఎస్సై రాజేష్ కుమార్, అంబాజీపేట ఎస్సై కె.చిరంజీవిని వీఆర్కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
E.G: గోకవరం మండలం గుమ్మలదొడ్డిలో ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయన్న ఫిర్యాదులపై భూగర్భ జలాశయ అధికారి రాధాకృష్ణ ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్యాక్టరీలో భారీ మోటర్లు బిగించడం వల్ల వ్యవసాయ బావులు ఎండిపోతున్నాయని HITTVలో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. రైతు సత్య ప్రకాశ్ రావు పొలంలోని బావిని పరిశీలించి, నీటి నిల్వలపై ఆరా తీశారు.
ADB: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఈనెల 28న చలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయటం సరైనది కాదని BRTU జిల్లాధ్యక్షురాలు సరస్వతి అన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం సోనాల మండలంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయమైన హామీలను పరిష్కరించాలని కోరారు.
MLG: జిల్లాలో గ్యాస్ కొరత లేదని కలెక్టర్ దివాకర్ తెలిపారు. సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రజలు అపోహలు పడవద్దన్నారు. లక్ష్మీ హెచ్పీ గ్యాస్ గోదాంను సోమవారం తనిఖీ చేసి స్టాక్ పరిశీలించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పుకార్లు నమ్మొద్దని, సరఫరా నిరంతరం పర్యవేక్షణలో ఉందన్నారు.
KKD: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “జీరో పావర్టీ–P4” కార్యక్రమం విజయవంతంగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా పిఠాపురం పాడా ఆఫీస్లో ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కూటమి ప్రజా ప్రతినిధులు, అధికారులు, బంగారు కుటుంబాలు, మార్గదర్శులు హాజరయ్యారు. P4 కార్యక్రమ అమలు, విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు.
HNR: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 62వ డివిజన్ సోమిడి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్యాధికారి ప్రదీప్ రెడ్డి, డాక్టర్ అనిత పాల్గొన్నారు.
VZM: ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతమవుతాయని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిత తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు సంతృప్తికరమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వేసవిలో త్రాగునీటి కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
KNR: టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర టీబీ నిర్మూలనకు న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, టీబి నియంత్రణ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి హాజరయ్యారు. క్షయ వ్యాధి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయాలన్నారు.
WNP: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీలత తెలిపారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గోపాల్, పోలీసులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
NLG: చిట్యాల పట్టణంలో రోడ్డు పనులతో పెరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ ఛైర్మన్, పాలకవర్గానికి సీనియర్ ఉద్యమ నాయకులు పోలేపల్లి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రమాదాలకు కారణమైన వాహనాలను గుర్తించలేక బాధితులు ఆర్థికంగా నష్టపోతున్నారని, చోరీల నియంత్రణకు కూడా ఇవి అవసరమని ఆయన పేర్కొన్నారు.
WGL: విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేందుకు నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్ను ప్రారంభించారు. విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం అందించాలనే ఉద్దేశంతో ఈ సెల్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సుశ్రుత ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ మాలోతు రవీందర్ చౌకీదార్ కళాశాలకు యాభై వేల రూపాయల విలువైన పుస్తకాలను విరాళంగా అందజేశారు.
TG: రైతులు వాడుతున్న గడ్డి మందు అత్యంత ప్రమాదకరమని, దానిని వెంటనే నిషేధించాలని అసెంబ్లీ తీర్మానించింది. అనేక దేశాల్లో ఇప్పటికే దీనిపై నిషేధం ఉందని, దీనివల్ల ప్రాణనష్టం జరుగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గడ్డి మందు వల్ల తలెత్తుతున్న అనర్థాలను దృష్టిలో ఉంచుకుని, దీనిని దేశవ్యాప్తంగా నిషేధించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
కోనసీమ: ప్రాణాలు నిలుపుకునేందుకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణాలు సాగించాలని మండపేట రూరల్ సిఐ పీ.దొరరాజు విజ్ఞప్తి చేశారు. కపిలేశ్వరపురంలో హెల్మెట్ వినియోగం, రోడ్డు భద్రత, సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంగర ఇన్ఛార్జ్, ఎస్సై ఎం.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
VSP: జీవీఎంసీ పరిధిలో ఇకపై జనన, మరణ ధ్రువపత్రాలు కేవలం జోనల్ కార్యాలయాల్లోనే CRS ద్వారా జారీ చేయనున్నట్లు జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి ఈ .ఎన్. వి. నరేష్ కుమార్ తెలిపారు. సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. యూబీడీ పోర్టల్ నిలిపివేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
సత్యసాయి: సోమందేపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. తహశీల్దార్ మారుతి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలు, రెవెన్యూ సంబంధిత పనుల పురోగతి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.