మధుమేహంతో బాధపడేవారికి మెంతులు ఒక వరం లాంటివి. రాత్రిపూట నీటిలో నానబెట్టిన మెంతులను ఉదయాన్నే పరగడపున తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే పీచు పదార్థం ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే, జుట్టు రాలడం తగ్గించడానికి, చుండ్రు నివారణకు మెంతుల పేస్ట్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
వారానికి 120 నిమిషాలు వాకింగ్ చేస్తే మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 75 నిమిషాల పాటు నడిస్తే రెండేళ్లు యంగ్గా కనిపిస్తారు. రోజుకి 60 నిమిషాల పాటు నడిస్తే ఒబెసిటీ ప్రమాదం సగానికి పైగా తగ్గుతుంది. రోజుకి 40 నిమిషాల నడకతో గుండె సంబంధిత జబ్బులకు స్వస్తి పలకొచ్చు.అదే 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే ఒత్తిడి, ఆందోళన అదుపులోకి వస్తాయి.
కంప్యూటర్ ముందు వర్క్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో 20సెకన్ల పాటు కళ్లను మూసి విశ్రాంతి నివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. స్క్రీన్ను కళ్లకు తక్కువ ఎత్తులో ఉండేలా చూసుకోండి. రాత్రివేళల్లో సెల్ఫోన్ వాడకం తగ్గించండి. లైటింగ్ వల్ల కంటి చిన్నకండరాలు త్వరగా అలసిపోతాయి. ఏసీ, కూలర్ నుంచి వచ్చే గాలులు నేరుగా కంటిమీద పడనివ్వకండి. గోరువెచ్చని నీటితో శుభ్రపరచండి.
లోకంలో ఆరు అంశాలకు ఎప్పుడూ తృప్తి ఉండదని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అగ్ని ఎన్ని కట్టెలు వేసినా ఆరదు, సముద్రం ఎన్ని నదులు కలిసినా నిండదు. మృత్యువుకు ఎన్ని ప్రాణాలు తీసినా చాలు అనిపించదు. అలాగే లోభికి ధనంపై ఆశ, జ్ఞానికి విద్యపై జిజ్ఞాస, అందమైన స్త్రీకి అలంకరణపై మోజు ఎప్పటికీ తీరవు. వీటి సహజ స్వభావాన్ని గ్రహించి మెలగడమే ఉత్తమమని విదుర నీతి సారాంశం.
మఖానా (తామర గింజలు) అద్భుతమైన పోషక విలువలున్న సూపర్ ఫుడ్. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.మఖానాతో ఎముకలు దృఢంగా మారుతాయి. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. రక్తహీనత తగ్గుతుంది. రక్తపోటు, బరువు నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
తలస్నానం తర్వాత జుట్టు విషయంలో జాగ్రత్తలు అవసరం. తడి జుట్టును టవల్తో గట్టిగా రుద్దడం వల్ల చిక్కులు పడి వెంట్రుకలు రాలుతాయి. అలాగే కుదుళ్లు బలహీనంగా ఉన్నప్పుడు దువ్వడం, జడ వేయడం మంచిది కాదు. హెయిర్ స్ప్రేలను నేరుగా జుట్టుపై వాడకూడదు. వాటిలోని ఆల్కహాల్ హాని చేస్తుంది. కాబట్టి స్ప్రేను ముందుగా చేతుల్లోకి తీసుకుని, ఆపై జుట్టుకు రాసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనం కోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కడుపు నిండా తినకుండా కొంచెం ఖాళీ ఉంచితే బద్ధకం, నిద్ర రావు. అన్నంతో పాటు ప్రోటీన్లు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. టీవీ, మొబైల్ చూస్తూ తినడం మానేయాలి. చివరగా మజ్జిగ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనానికి అరగంట ముందు లేదా తర్వాతే నీళ్లు తాగడం ఉత్తమం.
జీవనశైలిలో చిన్న మార్పులతో డిప్రెషన్ను జయించవచ్చు. నిత్యం వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. కుటుంబం, స్నేహితులతో సమయం గడుపుతూ భావాలను పంచుకోవాలి. పోషకాహారం తీసుకుంటూ మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. ప్రతిరోజూ డైరీ రాసే అలవాటు నెగటివ్ ఆలోచనలను తగ్గిస్తుంది. కంటినిండా నిద్ర మానసిక ప్రశాంతతకు ఎంతో అవసరం.
మనం చదివే వైవిధ్యమైన పుస్తకాలు మన ఆలోచనలు, సంభాషణల్లోని లోతును పెంచుతాయి. మనం పాటించే కఠిన ఆరోగ్య సూత్రాలు మనలోని శక్తిని ఉత్తేజితం చేస్తాయి. సాకులు చెప్పకుండా మనం స్థిరత్వంతో చేసే పని మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మన సన్నద్ధత ఎంత మెరుగ్గా ఉంటే, మనకొచ్చే ఫలితాలు అంత అద్భుతంగా ఉంటాయి.
అమ్మాయిలు ఎన్నో బ్యూటీప్రొడక్ట్స్ వాడతారు. వాటిలో కొన్నిటిని రోజూ వాడితే ఇబ్బందులొస్తాయని నిపుణులు అంటున్నారు. వాటర్ప్రూఫ్ మస్కారా రోజూ వాడితే కనురెప్పలు పొడిబారిపోతాయి. చర్మాన్ని వారానికి రెండుసార్లే స్క్రబ్ చెయ్యాలి. లేదంటే పొడిబారి నిర్జీవంగా మారుతుంది. డీప్ కండీషనర్స్ రోజూ వాడితే కేశాల్లోని PH స్థాయులపై ప్రభావం చూపి నిర్జీవంగా మారుస్తుంది.
కళ్ల కింద నల్లటి వలయాలను కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చు. రోజుకు 7-8 గంటల నిద్ర అవసరం. తగినంత నీరు తాగి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. ఫోన్, ల్యాప్టాప్ వాడకాన్ని తగ్గిస్తే మంచిది. కళ్లపై కీరా ముక్కలు లేదా ఐస్ కంప్రెస్ ఉంచితే ఉపశమనం లభిస్తుంది. శనగపిండి మిశ్రమాన్ని కళ్ల కింద రాసి, ఆరిన తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. కళ్ల దగ్గర ఐస్ కంప్రెస్ చేయాలి.
మొలకెత్తిన గింజలు పోషకాల గని. వీటిని నిత్యం బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం తగ్గుతుంది. ఇవి మధుమేహాన్ని నియంత్రించడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలోని పోషకాలు నరాల వ్యవస్థను, మెదడు పనితీరును మెరుగుపరిచి శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యానికి మొలకలు ఉత్తమ ఆహారం.
చర్మ సౌందర్యానికి ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నీరు తాగడం ముఖ్యం. జంక్ ఫుడ్, డెయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. నిత్యం సన్స్క్రీన్, మాయిశ్చరైజర్ రాస్తూ మెడ, కళ్ల కింద మృదువుగా మర్దన చేయాలి. రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి, కానీ ముఖాన్ని గట్టిగా రుద్దకూడదు. మొటిమలు, మచ్చలను గిల్లడం వంటివి చేయరాదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
చాలామంది మహిళలు ఇంటి పనులు, ఆఫీస్ వర్క్ వల్లే నీరసపడుతున్నామని అనుకుంటారు. కానీ, దీనికి ప్రధాన కారణం శరీరంలో ఐరన్ లోపం కావచ్చు. ఇది దీర్ఘకాలంలో రక్తహీనతకు దారితీస్తుంది. కాబట్టి కేవలం కడుపు నిండా తినడమే కాదు, ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ముఖ్యం. నిరంతరం అలసటగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవాలి.