ప్రస్తుతం ఒంటరిగా ఉండటం ఒక ట్రెండ్గా మారింది. వరల్డ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం స్వీడన్ (51%), డెన్మార్క్ (50%) తదితర దేశాల్లో దాదాపు సగం మంది పెళ్లికి దూరంగా ఉంటున్నారు. ఫిన్లాండ్, జర్మనీల్లో కూడా ఇదే పరిస్థితి. వ్యక్తిగత స్వేచ్ఛ కోసం మన దేశంలోనూ 25% మంది ఒంటరి జీవితానికే మొగ్గు చూపుతున్నారు. ‘బాధ్యతల కంటే సొంతంగా బతకడమే మిన్న’ అని యువత భావిస్తుండటమే ఇందుకు కారణం.
ఉదయాన్నే వేడివేడిగా టీ తాగడం చాలామందికి ఇష్టం. అయితే పరగడుపునే తాగడం వల్ల కొందరిలో ఎసిడిటీకి దారితీస్తుంది. దీంతో ప్రత్యామ్నాయంగా టీలో అల్లం, యాలకులు, సోంపు చేర్చుకోండి. ఇవి జీర్ణక్రియకు తోడ్పడతాయి. టీ పొడిని ఎక్కువగా మరిగించడంతో టానిన్లు పెరిగి ఎసిడిటీ వస్తుంది, కాబట్టి తక్కువ సేపు మరగబెట్టాలి. టీ తాగడానికి 5 నిమిషాల ముందు గ్లాసు నీళ్లు తాగితే ఎసిడిటీ ప్రభావం తగ్గుతుంది.
యుద్ధంలో బాణాలతో అయిన గాయాలనైనా వైద్యంతో నయం చేయవచ్చు. కాలిపోయిన అడవి వర్షానికి మళ్లీ చిగురిస్తుంది. కానీ, ఒకరి మనసును గాయపరుస్తూ అనే ‘కఠినమైన మాటలు'(వాక్శరాలు) చేసే గాయానికి మందు లేదు. ఆ గాయం జీవితాంతం మానదని విదురుడు బోధించాడు. అందుకే మాట్లాడేటప్పుడు ఎదుటివారి మనసు నొప్పించకుండా జాగ్రత్తగా, మృదువుగా మాట్లాడాలని, నోరు జారకూడదని విదుర నీతి సారాంశం.
గర్భ పిండాసనం అనేది పద్మాసనంలో ఉండి, చేతులను కాళ్ల మధ్య నుంచి దూర్చి సమతుల్యతను సాధించే యోగా భంగిమ. ఇది ఉదర అవయవాలను మసాజ్ చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వెన్నుముకను రిలాక్స్ చేస్తుంది. నడుము కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, చేతులు, తొడలు, కోర్ కండరాలను బలోపేతం చేస్తుంది. నాడీ వ్యవస్థను నియంత్రించి, కోపాన్ని తగ్గించడంలో, మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.
రాత్రిపూట పనిచేసే వారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నైట్ షిఫ్టుల వల్ల శరీర జీవ గడియారం దెబ్బతిని మహిళల్లో రొమ్ము, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. పోలీసులు, టెకీలు, డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటూ.. సరైన నిద్ర, పోషకాహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రాత్రిపూట పని చేసేవారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
వేసవిలో వేడి పానీయాలు తాగడం వల్ల శరీరం చల్లబడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. వేడి పానీయాలు తాగినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి, మెదడు చెమట గ్రంథులను ఉత్తేజపరుస్తుంది. దీంతో చెమట ఎక్కువగా పట్టి, అది ఆవిరయ్యే క్రమంలో శరీరంలోని వేడిని బయటకు పంపి చల్లదనాన్ని ఇస్తుంది. అయితే, గాలిలో తేమ (Humidity) ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఇది అంతగా పనిచేయదు.
జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వల్ల శరీరంలో ఇన్సులిన్ పెరిగి మొటిమలు వస్తాయి. దీనివల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి బ్యాక్టీరియా చేరుతుంది. అందుకే మైదా వస్తువులకు దూరంగా ఉండాలి. వీటికి బదులుగా చేపలు, వాల్నట్స్, ఆకుకూరలు, క్యారెట్లు వంటి పౌష్టికాహారం తీసుకోవాలి. ఇలా ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కర్ణపీడాసనం అనేది హలాసనం యొక్క పొడిగింపు. ఇది వెన్నెముకను సాగదీసి, ఒత్తిడిని తగ్గించి, వినికిడి శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. హలాసనం స్థితి నుంచి మోకాళ్లను వంచి, చెవుల పక్కన నేలపై ఉంచడం ద్వారా ఈ ఆసనం వేస్తారు. ఇది యోగాలో మెడ, భుజాలు, వెన్నుముక ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైనది. ఒత్తిడి, ఆందోళన తగ్గి, మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ప్రస్తుతం మారిన జీవన విధానంలో కళ్లు జీవం కోల్పోయినట్లు అవుతున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే రోజులో కనీసం నాలుగైదు సార్లైనా కళ్లను చన్నీటితో కడగాలని నిపుణులు చెబుుతన్నారు. కళ్లకు తరచూ విశ్రాంతినివ్వాలి. సరిపడా నిద్ర లేకపోయినా కంటి ఆరోగ్యం ప్రభావితమవుతుంది. నిద్రలేమి వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, గీతలు, ముడతలు ఏర్పడతాయి. నాణ్యమైన ఐ మేకప్ ఉత్పత్తులు వాడాలి.
వాము నీళ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాము నీళ్లు తాగడం వల్ల శ్వాసకోశ వ్యాధులు దరిచేరవు. ముఖ్యంగా జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గడంలో ఈ నీళ్లు సహాయపడుతాయి. జీర్ణక్రియ మెరుగుపడి.. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పంటి నొప్పి తగ్గడంతో పాటు నోటి దుర్వాసన మాయమవుతుంది.
కలబంద చర్మానికి చలువ చేయడమే కాకుండా మొటిమల్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఒక స్పూన్ కలబంద గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే మొటిమల మచ్చలు తగ్గుతాయి. అలాగే కలబందలో చిటికెడు పసుపు కలిపి వాడితే బ్యాక్టీరియా నశించి చర్మం కాంతివంతంగా మారుతుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది సహజమైన ఔషధంలా పనిచేస్తుంది.
వేసవిలో రోజూ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. జీడిపప్పు, బాదం, గుమ్మడి గింజలు వంటివి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. మజ్జిగ తీసుకుంటే శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. కందగడ్డ, చిలగడదుంప, చేమదుంప రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నిమ్మరసం, సబ్జా నీళ్లు, గంజి, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు శరీరానికి చలవ చేస్తాయి.
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ పోషకాహారం తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగంగా చేసుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం లేదా నడక తప్పనిసరి. తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. రాత్రిపూట 7-8 గంటల గాఢ నిద్ర అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే దీర్ఘకాలం ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు.
పైనాపిల్ పోషకాల నిధి. విటమిన్-C, యాంటిఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఈ పండును తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ, గుండె ఆరోగ్యం మెరుగవుతాయి. క్యాన్సర్, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. అయితే షుగర్ ఉన్నవారికి ఇది ప్రయోజనం కలిగించకపోగా హానీ చేస్తుందట. ఇందుకు పైనాపిల్లో సహజ చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటమే కారణంగా నిపుణులు చెబుతున్నారు.
యుద్ధం మీద ధ్యాసతో నిద్రలేమితో బాధపడుతున్న ధృతరాష్ట్రుడికి విదురుడు ఇలా చెప్పాడు. ‘1. బలవంతుడితో శత్రుత్వం పెట్టుకున్నవాడు, సర్వస్వం కోల్పోయి ఆపదలో ఉన్నవాడు, ఇతరుల ఆస్తిని దొంగిలించాలనే బుద్ధి ఉన్నవాడు, మనసులో తీవ్ర కోరికలతో రగిలిపోయేవాడు.. ఈ నాలుగు పరిస్థితుల్లో ఉన్నవారికి మనశ్శాంతి ఉండదు, ఎప్పటికీ ప్రశాంతమైన నిద్ర కరువవుతుంది’ అని విదుర నీతి సారాంశం.