వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు NTA శుభవార్త చెప్పింది. ఉ.10 గంటలకు NEET పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అడ్మిట్ కార్డులు విడుదలైన వెంటనే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు 180 నిమిషాల్లో 180 ప్రశ్నలకు జవాబులు రాయాలి.
TG: జపాన్, జర్మనీలో కేర్ టేకర్, హాస్పిటాలిటీ, నర్సింగ్ రంగాల్లో రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జాతీయ పర్యాటక, ఆతిథ్య నిర్వహణ సంస్థ(నిథమ్) ఆధ్వర్యంలో ఆయా దేశాల భాషలపై ఒక్కో బ్యాచులో 200 మందికి 3 నెలల పాటు శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ పూర్తయ్యాక ఉద్యోగాలు ఇచ్చేలా, అభ్యర్థుల ఎంపికకు త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్ ఆయిల్ ధర 2 శాతానికి పైగా పెరిగి బ్యారెల్ రేట్ 107.48 డాలర్లకు చేరింది. హర్మూజ్ నుంచి నౌకల రాకపోకలు ఆగిపోవడంతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. యూఎస్ క్రూడాయిల్ కూడా 2 శాతం పెరిగి బ్యారెల్ ధర 96.63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ పెరుగుదల రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపనుంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2026 సంవత్సరానికి సంబంధించి మూడు భారీ నోటిఫికేషన్లను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఖాళీగా ఉన్న 3,734 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, లేదా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత గల అభ్యర్థులు వెబ్సైట్ ssc.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో రూ.7,071 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ.7,118 కోట్లతో పోలిస్తే లాభం స్వల్పంగా 0.64% తగ్గింది. నికర వడ్డీ ఆదాయం సుమారు 5% పెరిగి రూ.14,457 కోట్లకు చేరింది. ఒక్కో షేరుపై రూ.1 డివిడెండు ఇవ్వాలని డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది.
నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాదిన్నర కాలంగా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన ఆయనను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలలో భాగంగా ఆయనను బదిలీ చేశారు. ఆయనను జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ క్షమాపణలు చెప్పారు. కెనడాలో 9 మంది మరణానికి కారణమైన 18 ఏళ్ల వాన్ రూట్సెల్లార్ ప్రవర్తనను గుర్తించి చాట్ జీపీటీ ఖాతాను గత జూన్ నెలలోనే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. కానీ ఈ విషయంపై పోలీసులు అప్రమత్తం చేయలేకపోయినందుకు చింతిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మరణించిన వారి కుటుంబ సభ్యులను క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించారు.
సిబ్బంది వస్త్రధారణ విషయంలో ఇండిగో కొత్త రూల్స్ తెచ్చిందంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. తిలకం, సింధూరం, మంగళసూత్రం వంటి వాటిపై ఆంక్షలు విధించినట్లు వార్త చక్కర్లు కొడుతుంది. వీటిపై ఇండిగో స్పందించింది. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేసింది. తప్పుడు వార్తలను నమ్మొద్దని ప్రజలను కోరింది. వస్త్రధారణ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది.
AP: రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు ఇవాళ విడుదల కానున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. కానీ రిజల్ట్స్ రాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రలు అయోమయంలో పడ్డారు. ఈ ఫలితాల విడుదల వార్తలపై విద్యాశాఖ ఇప్పటి వరకు స్పందించనప్పటికీ.. త్వరలోనే ఫలితాల విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రముఖ కాఫీ దిగ్గజం స్టార్బక్స్ తమ టెక్నాలజీ విభాగంలో సిబ్బందిని తొలగిస్తోంది. ఎంతమందిని తొలగిస్తున్నారనేది ఇంకా స్పష్టం కాలేదు. గతంలోనే అమెరికా, కెనడాలో వందలాది స్టోర్లను మూసివేసిన ఈ సంస్థ, వేల సంఖ్యలో రిటైల్, కార్పొరేట్ ఉద్యోగులను ఇంటికి పంపింది. ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లో ఇవాళ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,040 వద్ద, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల ధర రూ.1,41,200 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, వెండి మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఏకంగా రూ.5,000 పెరిగి కిలో వెండి ధర రూ.2,70,000కు చేరింది. పసిడి కొనేవారికి ఇది మంచి వార్తే అయినా.. వెండి ప్రియులకు మాత్రం భారమే.
NRML: టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ జన్మదిన సందర్భంగా జిల్లా యూనియన్ అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి భూమయ్య, జాతీయ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాజశేఖర్, ప్రమోద్ రెడ్డి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ కుమార్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలతో పాటు మరింత ఉన్నత స్థానాలు అలంకరించాలని వారు ఆకాక్షించారు.
జియో కొత్తగా రూ.500 మెగా కంటెంట్ ప్లాన్ను తెచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, యూట్యూబ్ ప్రీమియం, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, 10కిపైగా OTTల సబ్స్క్రిప్షన్స్ను ఇస్తోంది. ఇందులోనే 5 వేల GB క్లౌడ్ స్టోరేజీతో 18 నెలల గూగుల్ జెమినీ ప్రో ప్లాన్ చేర్చింది. యూట్యూబ్ ప్రీమియం, 5GB హైస్పీడ్ డేటాతో రూ.200 మెగా కంటెంట్ యాడ్ ఆన్ ప్లాన్ కూడా ఉంది.
అంతర్జాతీయంగా ఇంధన ధరల ఒడుదొడుకులు, పశ్చిమాసియా యుద్ధం కారణంగా 2025-26 మార్చి త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం 12.5% తగ్గి రూ.16,791 కోట్లుగా నమోదైంది. అయితే మొత్తం ఆదాయం రూ.3.03 లక్షల కోట్లకు చేరడం విశేషం. పూర్తి ఆర్థిక సంవత్సరానికి(2025-26) లాభం 16% వృద్ధితో రూ.80,775 కోట్లుగా ఉంది. సంస్థ వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.6 డివిడెండ్ ప్రకటించింది.
RBI ఆంక్షల నేపథ్యంలో Paytm యాప్ సేవలపై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ ఆ సంస్థ అధికారిక వివరణ ఇచ్చింది. పేటీఎం యాప్ ద్వారా అందించే దాదాపు అన్ని సేవలు ఎప్పటిలాగే నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. పేటీఎం యాప్, UPI, వాలెట్, బిల్లు చెల్లింపులు, మనీ ట్రాన్స్ఫర్, టికెట్ బుకింగ్ వంటి ఫీచర్లు ఎలాంటి అంతరాయం లేకుండా పని చేస్తాయని వెల్లడించింది.