VSP: జీవీఎంసీ 48వ వార్డు ఇందిరానగర్-4లో దొంగతనాల నివారణకు ప్రజలు, దాతల సహకారంతో 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాజీ కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు యాదవ్ వాటిని ప్రారంభించి, నేరాల నియంత్రణకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. వార్డు అభివృద్ధికి, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.
NDL: ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. క్యూ లైన్లోని భక్తులకు సిబ్బంది అల్పాహారం అందించారు.
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, ఆదివారం ఉదయం 5 గంటల నుంచే కోమటివాని చెరువు, బహుదా నది, బస్టాండ్, కాలనీలు వంటి ప్రాంతాలను పర్యటించి, శుభ్రత పనులను సమీక్షించారు. పారిశుద్ధ్య కార్మికులకు కాలువల్లోని చెత్తను పూర్తిగా తొలగించి, తీసిన మురుగును వెంటనే తరలించాలని సూచించారు.
ELR: శ్రీ గుబ్బల మంగమ్మ ఆలయాన్ని సందర్శించే భక్తులను అటవీ పర్యావరణాన్ని పరిరక్షించమని కోరుతూ, తెలంగాణ, ఏపీ అటవీ శాఖ ఒక ప్రకటన జారీ చేశారు. అడవి అంటే కేవలం చెట్లు మాత్రమే కాదు, అది 220కి పైగా పక్షి జాతులకు, 40 విభిన్న వన్యప్రాణుల జాతులకు, లెక్కలేనన్ని చిన్న జీవులకు నిలయం అన్నారు. సందర్శకులు అడవిలోకి ప్లాస్టిక్ తీసుకురావడం, చెత్త పాడవేయడం వద్దన్నారు.
NDL: వేసవి ఎండలు తీవ్రంగా పెరగడంతో నిమ్మకాయ ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం ఒక్క నిమ్మకాయ రూ.10 నుంచి రూ.15 వరకు విక్రయిస్తున్నారు. పంట దిగుబడి తగ్గడం, డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరిగాయని ఆదివారం వ్యాపారులు తెలిపారు. అయితే అధిక ధరలతో కొనుగోళ్లు తగ్గిపోవడంతో అమ్మకాలు లేక నిమ్మకాయలు ఎండిపోతూ.. నష్టాలు వస్తున్నాయని చిరు వ్యాపారులు వాపోతున్నారు.
KRNL: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సెన్సస్పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 5కే రన్లో విద్యార్థుల స్కేటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు వేగంగా స్కేటింగ్ చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించగా, పాల్గొన్న వారిని ఆకట్టుకున్నారు. సెన్సస్ ప్రాముఖ్యతపై నినాదాలు చేస్తూ ముందుకు సాగిన విద్యార్థులను అధికారులు అభినందించారు.
కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం రావులపాలెంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అదనపు బస్టాండ్ నిర్మాణంపై స్థల పరిశీలన చేశారు. ఏపీఎస్ఆర్టీసీ గ్యారేజ్ను సందర్శించి, ఆ స్థలంలో అదనపు బస్టాండ్ నిర్మించడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
KRNL: వేసవిని దృష్టిలో ఉంచుకుని పెద్దకడబూరు గ్రామంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో చెడిపోయిన బోర్కు టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆదేశాల మేరకు సొసైటీ ఛైర్మన్ మీ సేవ ఆంజనేయులు ఆదివారం మరమ్మతులు చేయించారు. పంచాయతీ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనయే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు.
KRNL: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదివారం విమర్శించారు. ఇంధనం లేక రవాణా వ్యవస్థ దెబ్బతిని నిత్యావసర సరుకుల రవాణాకు ఆటంకం కలుగుతోందన్ని పేర్కొన్నారు. నిల్వలు ఉన్నాయని చెబుతున్నా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు.
TPT: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వరదయ్యపాలెం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా కార్యదర్శి దాసరి జనార్ధన్ తెలిపారు. అధ్యక్షుడిగా JK రమణయ్య, కార్యదర్శిగా దూడల సుబ్బయ్య ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మే 2న సత్యవేడులో జరగనున్న జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
NLR: సాగర్ మిత్ర సమస్యలను కేంద్ర మంత్రి స్థాయిలో వివరించి మరో ఆరు నెలలు ప్రధాన్మంత్రి మత్స్య సంపద యోజన సేవలను పొడిగించడంపై సాగర్మిత్రలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని ఆదివారం తన కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. శాలువాతో ఘనంగా సత్కరించారు.
NDL: సంజామల మండలం మంగపల్లెలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 67వ మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతమైనట్లు డైరెక్టర్ పి.మౌలాలి రెడ్డి తెలిపారు. పేదల ఆరోగ్య రక్షణ దృష్ట్యా ప్రతి నెల ఈ శిబిరాలు నిర్వహిస్తున్ననట్లు పేర్కొన్నారు. వివిధ వ్యాధులకు నిపుణ వైద్యులచే సేవలందించి, సుమారు 1000 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు.
KDP: పోరుమామిళ్లలో డీజల్, పెట్రోల్ కొరత ఉదంటూ సీపీఐ నేతలు ఆదివారం నిరసన చేపట్టారు. ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ ఆధ్వర్యంలో ఆటోకు తాడు కట్టి రోడ్డుపై లాగారు. అధికారులు జిల్లాలో ఇంధన కొరత లేదని చెబుతున్నప్పటికీ పెట్రోల్ బంకుల వద్ద వందల సంఖ్యలో వాహనాలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. యాజమాన్యాలు ఏమైనా అక్రమంగా తరలిస్తున్నారా అని ఆరోపించారు.
W.G: ఉండి మండలం ఉప్పులూరరు లో శ్రీ చెన్నకేశ్వవస్వామివారి తిరుకల్యాణం ఈ 28 న జరుగుతుందని ఆలయ ఛైర్మన్ యర్రా వెంకట సుబ్బారావు తెలిపారు. ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రాంభమైనట్టు ఆయన పేర్కొన్నారు. వచ్చేనెల 2 వ తేదివరకు స్వామి వారి మహోత్సవాలు జరుగుతాయి అన్నారు. ఈ నెల 27 శేష వాహన సేవ, 28 న గరుడ వాహన సేవ 30న హనుమ సేవ ప్రతిరోజూ ప్రత్యేక పూజలు జరుగుతాయిని ఆయన తెలిపారు.
KKD: ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి జూన్ 6 వరకు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ ఈశ్వరరాజు వర్మ ఆదివారం తెలిపారు. కాకినాడ సెంట్రల్ లైబ్రరీలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఈ శిబిరాలు జరుగుతాయి. ఇందులో రచన, సైన్స్, చిత్రలేఖనం, సంగీతం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు.