KRNL: ఆదోనిలోని జంకన్వాడీ కాలనీకి చెందిన అమిన్ అస్వో (39) క్యాన్సర్, అల్సర్ వంటి అనారోగ్యాలతో మనస్తాపానికి గురై ఈనెల 7న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి కర్నూలుకు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KDP: ప్రొద్దుటూరు లింగాపురంలో సహజీవనం సాగిస్తున్న రామాంజనేయులు, ప్రమీల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రమీల మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు భర్త ఐజాక్, ఇటు బంధువులు రాలేదు. పోలీసులు సమాచారమిచ్చినా ఎవరూ స్పందించకపోవడంతో ఆమె మృతదేహం ప్రొద్దుటూరు ఆసుపత్రి మార్చురీలోనే ఉంచారు. మున్సిపాలిటీ, స్వచ్ఛంద సంస్థల దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కృష్ణా: మచిలీపట్నం రామానాయుడుపేట నుంచి ఐదు రోడ్ల సెంటర్ వరకు నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ సోమవారం పాల్గొని, పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు చెత్తాచెదారాన్ని ఎక్కడబడితే అక్కడ వేయరాదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
TPT: తిరుపతిలో ఆదివారం గంజాయి పట్టుబడింది. పోలీసుల వివరాల మేరకు.. తిరుపతికి చెందిన ఉమాపతి, ధనలక్ష్మి దంపతులు దామినేడుకు వెళ్లారు. అక్కడ జోసెఫ్ వద్ద గంజాయి తీసుకుని, బైకుపై తిరుపతికి తెస్తుండగా లక్ష్మీపురం సర్కిల్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 10కేజీల గంజాయి, బైక్, రూ.22,900, ఫోన్లు, బంగారు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమ గోదావరిలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్తో కలిసి టీడీపీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బాబ్జీ నిర్మాణంలో ఉన్న పలు కట్టడాలను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులకు కనీస భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో, సరైన వేతనాలు అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. నిర్మాణంలో భవనాలకు విధిగా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
బాపట్ల: వేసవి ఎండలు ముదురుతున్న వేళ గ్రామ ప్రజల అవసరాల కోసం సంతమాగులూరు మండలంలోని పాతమాగులూరు పంచాయతీలో ఈరోజు రెండు కొత్త చేతి పంపు బోరు బావులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ విజయ్ బాబు మాట్లాడుతూ.. గ్రామస్తులకు తాగునీటి కష్టాలు కలగకూడదనే ఉద్దేశంతో ఈ ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
NDL: బనగానపల్లె నియోజకవర్గం అవుకుమెట్ట ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం నిర్ణయించిన భూములను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. భూమి చదును, జంగిల్ క్లియరెన్స్ పనులను పర్యవేక్షించిన ఆయన, అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాలను కూడా పూర్తిగా చదును చేయాలని ఆదేశించారు.
NLR: నెల్లూరు విద్యుత్ భవన్ లో సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు. సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు నిర్వహించబడుతుందని 0861-2320427 నంబర్కు కాల్ చేయాలని జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ కె. రాఘవేంద్రం తెలిపారు. ఇవాళ వినియోగదారులు తమ సమస్యలను తెలియజేసి పరిష్కారాలు పొందాలని సూచించారు.
కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో సోమవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం10:30 గంటలకు జరిగే మేళాలో ప్రముఖ కంపెనీల్లో పనిచేసేందుకు పది, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చదివిన 45 ఏళ్ల లోపు వయసు గల స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులని చెప్పారు. అర్హత కలిగిన అభ్యర్థులు ధ్రువపత్రాలను తీసుకొని సకాలంలో హాజరుకావాలని సూచించారు.
ELR: కలిదిండి మండలంలో ఈనెల 14న అంబేడ్కర్ జయంతి వేడుకల భద్రతపై సీఐ రవికుమార్ ఆదివారం రాత్రి ఉత్సవ కమిటీలతో సమావేశమయ్యారు. విగ్రహాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని, కార్యక్రమాలకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వేడుకలు జరుపుకోవాలని వెల్లడించారు.
KRNL: ఆదోని పట్టణంలో ఇవాళ నూతనంగా ప్రారంభం కానున్న ఆంధ్రా గోల్డ్ అండ్ జ్యూవెలరీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటుడు ఆలీ తన సతీమణితో కలిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆలీ దంపతుల రాక నేపథ్యంలో అభిమానులు, వ్యాపార వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేటి మధ్యాహ్నం 3 గంటలకు అమలాపురం పంచాయతీరాజ్ అతిధి గృహం నందు పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు అని తెలిపారు. కూటమి నాయకులు ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు.
పల్నాడు: శావల్యాపురం మండలం పొట్లూరులోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఆదివారం తిరుణాల వేడుకలను భక్తులు వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అర్చనలు, అభిషేకాలు, కుంకుమ పూజలతో మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్ ప్రభలు నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
W.G: నిబంధనలు పాటించడం బాధ్యత మాత్రమే కాదని, అది వాహనదారుల భద్రత కూడా అని నరసాపురం టౌన్ ఎస్సై సీహెచ్ జయలక్ష్మి అన్నారు. ఆదివారం నరసాపురం పట్టణంలోని వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకపోవడం, అతివేగం, మొబైల్ డ్రైవింగ్, నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు, జరిమానాలు తప్పవని ఎస్సై తెలిపారు.
గుంటూరులో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్లో తెనాలి ఎన్సీఆర్ఎం హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. 7, 8 తరగతుల విద్యార్థులు భావన, పార్ధు, జాస్మిన్, రామకృష్ణ, రమ్య చిత్రలేఖనంలో బంగారు, వెండి పతకాలు గెలుచుకున్నారు. వీరికి హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థుల ప్రతిభపై ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.