»Pawan Kalyan Who Announced The Machilipatnam Lok Sabha Candidate
Janasena: ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్
ఏపీలో జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఒక ఎంపీ అభ్యర్థిని ఖారారు చేశారు.
Janasena: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. కూటమితో పోటీగా వైసీపీ విస్తృత ప్రచారం చేస్తుంది. బస్సు యాత్ర ప్రారంభించిన సీఎం జగన్ సిద్ధం పేరిట బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన సైతం వాడీవేడీగా ప్రచారాలు సాగిస్తున్నాయి. ఇక జనసేన పార్టీ నుంచి మచిలీపట్నం లోక్ సభ అభ్యర్థిని పవన్ కల్యాణ్ ప్రకటించారు. పార్టీ తరపున వల్లభనేని బాలశౌరి పేరును ఖరారు చేశారు. ఈ మేరకు జనసేన నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. టీడీపీ, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 2 లోక్ సభ స్థానాలు, 21 శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తోంది.
అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలకు ఇంకా అభ్యర్థులు ఖరారు కాలేదు. అభ్యర్థుల కోసం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు పవన్ కల్యాణ్. విశాఖ సౌత్ అభ్యర్థిగా వంశీకృష్ణ యాదవ్ పేరు దాదాపు ఖరారు అయినట్టు సమాచారం. కానీ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏంటన్నది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఆశావాహకులు ఉన్నారు. అలాగే అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల కోసం కసరత్తు జరుగుతోంది. సరైన అభ్యర్థి కోసం సర్వేలు చేస్తున్నారని, వాటిలో సంతృప్తికర ఫలితాలు వస్తేనే అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన పార్టీ వెల్లడించింది.