NDL: చాగలమర్రి మం.నీలంపాడు రాంపల్లి గ్రామాల మధ్య ఆదివారం ద్విచక్రవాహనం – ఆటో ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. జంగాలపల్లికు చెందిన మహబూబ్ బాషా ద్విచక్ర వాహనంపై చాగలమర్రికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు క్షతగాత్రుడిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
KRNL: నగరంలోని పద్మశాలి నగర్ కాలనీ ప్రజలు తమ సమస్యలను టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మకు ఆదివారం వివరించారు. టీడీపీ కార్యాలయంలో ఆమెను కలిసి సమస్యల పరిష్కారం కోరారు. సమస్యలను విన్న ఆది కృష్ణమ్మ, అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు.
కడప: చెన్నూరు మండలం దౌలతాపురంలో ఆదివారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు యామిని, సెక్రటరీ ఎస్. బాబా ఫక్రుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయ విభాగ ఆధ్వర్యంలో నీటి దినోత్సవం ప్రాముఖ్యత, న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు.
SKLM: రానున్న పలాస మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని పలాస టీడీపీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు అన్నారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శిరీష ఆదేశాల మేరకు క్లస్టర్, యూనిట్ స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని, అండగా నిలవాలని కార్యకర్తలకు సూచించారు.
AKP: నర్సీపట్నం శాఖా గ్రంథాలయంలో చదవడం నాకు ఇష్టం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గ్రంధాలయాధికారి దమయంతి విద్యార్థులకు కథలు చదివించి, కెరీర్ మార్గదర్శక సూచనలు అందించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు పీ. ప్రభాకర్ ప్రపంచ జల దినోత్సవ ప్రాముఖ్యత వివరించి, నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. పజిల్, వినోదాత్మక ఆటలతో కార్యక్రమం ముగిసింది.
నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై ఆత్మకూరు మున్సిపాలిటీ వెంకటరావుపల్లి సమీపంలో ఆదివారం ప్రమాదం జరిగింది. మర్రిపాడు నుంచి నెల్లూరుకు బైకుపై యువకుడు వెళ్తుండగా పొగాకు ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: కొండపిలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. బైకులపై ప్రయాణించే వారిని వెంటాడుతున్నాయి. దీంతో ఆ కంగారులో బైకుల పైనుంచి యువకుల కింద పడి గాయాల పాలైన సంఘటనలు గతంలో ఉన్నాయి. చిన్నారులు వీధి గుమ్మాల ముందు ఆడుకునే క్రమంలో పిల్లలపై దాడి చేసిన సంఘటనలు సైతం ఉన్నాయి. వీధి కుక్కలను పంచాయతీ అధికారులు నివారించాల్సిందిగా పలువురు కోరుతున్నారు.
ATP: గుమ్మఘట్ట మండలం గోనబావిలో పెట్రోల్ మంటలు అంటుకొని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక హోటల్ యజమాని శ్రీనివాసులు, భార్య, కుమార్తె ఆదివారం ఒక సీసా నుంచి మరో సీసాలోకి పెట్రోల్ మారుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమీపంలో వెలుగుతున్న గ్యాస్ స్టవ్ వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. గాయపడిన వారిని చికిత్స కోసం రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు.
E.G: పిల్లల పౌష్టికాహారంపై చేసిన వ్యాఖ్యలపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని గోదావరి బాలోత్సవం సెక్రటరీ టి. తులసి డిమాండ్ చేశారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో, పౌష్టికాహార లోపంపై అవగాహన లేకపోవడమేనా లేక తెలిసి వ్యాఖ్యానించారా అని ప్రశ్నించారు. గుడ్డు కోసం పిల్లలు బడికి వస్తారనడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందన్నారు.
PLD: చిలకలూరిపేట మండలం కావూరు గ్రామంలో ఇటీవల ప్రతిష్టించిన శ్రీ రుద్రాణి సమేత శ్రీ రుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఆదివారం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకున్నారు. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని, శివాలయ పరివార దేవతా మూర్తులను కూడా దర్శించుకుని ఆశీర్వాదాలు స్వీకరించారు.
VZM: మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం, మహేంద్ర హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో విజయనగరంలో ఆదివారం మెగా రక్తదానం శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేంద్ర మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. ప్రతి వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 మంది యువకులు స్వచంధంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.
సత్యసాయి: అమరాపురం మండలంలోని వారపుసంత, బస్టాండ్, దినసరి సంతలకు ఈనెల 25న వేలంపాట నిర్వహిస్తున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి యోగానంద్ తెలిపారు. ఈనెల 25న ఉదయం 11 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దినసరి సంతకు రూ. 20 వేలు, వారపు సంతకు రూ.20 వేలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని కోరారు.
KDP: మైదుకూరు పట్టణంలోని 8వ వార్డులో డ్రైనేజీ ఉన్నా ఉపయోగం లేదని స్థానిక ప్రజలు అంటున్నారు. మురుగునీరు కాలువల ద్వారా ముందుకు పోవడం లేదన్నారు. దుర్వాసనతో పాటు దోమలు విపరీతంగా పెరిగాయని తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. మురుగు రోడ్డు పైకి వచ్చి చేరడంతో రాకపోకలకు అసౌకర్యంగా ఉందని వాపోతున్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
TPT: లేబర్ కోడ్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని వరదయ్యపాలెం డీవీఎంసీ మెంబర్ గుత్తి త్యాగరాజు డిమాండ్ చేశారు. 12 గంటల పని విధానంపై వస్తున్న ప్రచారాలు కార్మికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని, అధిక పని గంటలు చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇది కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. కార్మిక హక్కులను కాపాడాలని, ఉల్లంఘించే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జడ్పీ ఛైర్మన్ అధ్యక్షతన స్థాయి సంఘాల సమావేశం నిర్వహించారు. ఆదివారం ఈ సమావేశంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో పీఎసీఎస్లలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు.