ప్రకాశం: త్రిపురాంతకం మండలం గొల్లపల్లికి చెందిన నేతాజికి దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై శివ బసవరాజు తెలిపారు. పాకిస్థాన్ను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడిని మార్కాపురం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
KDP: బ్రహ్మంగారిమఠంలో ఆదివారం నుంచి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకుఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. వేసవికాలం కావడంతో భక్తులకు ఇబ్బంది లేకుండా చలువ పందిళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మఠం ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ తెలిపారు.
KKD: క్రీడాకారులకు పుట్టినిల్లు కాకినాడ జిల్లా అని ఎంపీలు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, సానా సతీష్ పేర్కొన్నారు. రూరల్ ఎన్టీఆర్ బీచ్లో జరుగుతున్న బీచ్ కబడ్డీ పోటీలను శనివారం రేట్ వారు సందర్శించారు. పోటీలు తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఉత్సాహభూరిత వాతావరణంలో పురుష, మహిళా క్రీడా పోటీలు బీచ్లో జరగడం అభినందనీయమన్నారు.
GNTR: మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నుంచి ఫోరెన్సిక్ వర్క్షాప్ ప్రారంభమవుతోంది. ఈ వర్క్షాప్ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించనున్నారు. 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో విచారణాధికారులు, డాక్టర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఫోరెన్సిక్ ఆధారాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించనున్నారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలో వాగులు, వంకలను సైతం ఆక్రమించి కొందరు అక్రమంగా వెంచర్లు, కట్టడాలు నిర్మించారనే ఫిర్యాదులతో శనివారం రెవెన్యూ యంత్రాంగం కదిలింది. తహసిల్దార్ రవిశంకర్ ఆధ్వర్యంలో పది బృందాలు పట్టణంలోని ఆక్రమణలపై సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ భూములను, వాగులు కబ్జా చేసినట్లు తెలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ హెచ్చరించారు.
VSP: గాజువాక డిపో వద్ద మున్సిపల్ వాటర్ ట్యాంక్లో పడి ఒకరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. నక్కవానిపాలెం ప్రాంతానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి మతిస్థిమితం లేకుండా తిరుగుతుంటాడు. శనివారం మధ్యాహ్నం వాటర్ ట్యాంక్ లోపలికి దిగడంతో నీటిలో మునిగిపోయాడు. పరిసరప్రాంత ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసుల సాయంతో బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు.
కృష్ణా: ఇద్దరు పాత నేరస్థులను శనివారం TGకి చెందిన సత్తుపల్లి పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండకు తరలించారు. సత్తుపల్లి సీఐ టీ. కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన దేవరకొండ రాంబాబు, చిలకలూరిపేటకు చెందిన బొమ్మల విజయ్ జైలుశిక్ష అనుభవిస్తూ బయటకు వచ్చాక పలుచోట్ల దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవారు. వాహనాల తనిఖీలలో పారిపోతుండగా పట్టుకొని అరెస్ట్ చేశారు.
KRNL: కోడుమూరు పట్టణంలో ముక్కుపచ్చలారని శిశువు మృతదేహం బకెట్లో శనివారం లభ్యమైంది. మగ బిడ్డకు జన్మనిచ్చి శిశువును బకెట్లో విడిచి వెళ్లిన సంఘటన స్థానిక సంత మండలం మార్కెట్ సమీపంలోని పాఠశాల వద్ద వెలుగు చూసింది. నెలలు నిండని శిశువు మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని శిశువు మృతదేహానికి ఆసుపత్రికి తరలించారు.
ASR: డుంబ్రిగుడ మండల కురిడి సమీపంలోని చెట్టును ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై పాపినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లోగిలికి చెందిన కే.నాగేశ్వరరావు అనే గిరిజనుడు కనిపించడం లేదని ఈనెల 2న స్థానిక పోలీస్ స్టేషన్లో వారి బంధువులు ఫిర్యాదు చేశారని తెలిపారు. శనివారం కురిడి సమీపంలోని ఆయన మృతదేహం లభ్యం అయిందన్నారు.
NLR: మాలకోండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాలకొండపై జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.
CTR: గుడిపల్లి మండలం యామగానిపల్లిలో వెలసిన శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల స్వామి మహాభారత మహోత్సవానికి సీఎం చంద్రబాబుకు టీడీపీ నేతలు ఆహ్వానం పలికారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను ఆ పార్టీ నేత రాజు.. సీఎంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
KDP: మైదుకూరు మండలం చింతకుంట వద్ద బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. నల్లపురెడ్డి పల్లె గ్రామస్తులు అహోబిలం నరసింహస్వామి దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. గాయపడ్డ వారిని మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: పులివెందుల ఎంపీడీవోగా శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ జిల్లా పరిషత్ కార్య నిర్వహణ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇంఛార్జ్ ఎంపీడీఓగా పనిచేసిన రామాంజినేయరెడ్డి అదే మండలానికి ఏవోగా బదిలీ అయ్యారు. సింహాద్రిపురంలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డిని పులివెందుల ఎంపీడీఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన ఇవాళ బాధ్యతలు చేపట్టారు.
VZM: సమస్యలు పరిష్కరించడానికే వార్డు సందర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చైర్ పర్సన్ బంగారు సరోజిని, కమిషనర్ ఎ తారక్ నాథ్ చెప్పారు. నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి జరజాపుపేటలో వైస్ చైర్మన్ సముద్రపు రామారావుతో కలిసి 1, 19, 20 వార్డుల్లో శనివారం వార్డు సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.