TPT: సూళ్లూరుపేట మండలంలోని కోరిడి గ్రామంలో బస్టాండ్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పైకప్పు దెబ్బతినడం, గోడలు కూలిపోవడం వల్ల ప్రయాణికులు అక్కడ నిలబడేందుకు కూడా భయపడుతున్నారు. వర్షం, ఎండ నుంచి రక్షణ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ చుట్టూ చెత్త పేరుకుపోయి, మొక్కలు పెరిగి అపరిశుభ్రంగా మారిందని విమర్శలు వస్తున్నాయి.
W.G: ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పండుగను శనివారం నరసాపురంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మిషన్ హైస్కూల్ రోడ్డులో ఉన్న ఈద్గా మైదానానికి ముస్లింలు, పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
సత్యసాయి: కదిరి పట్టణం ఈద్గా మైదానంలో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆయన అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో సోదరభావం, శాంతి వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పండుగ పూట ముస్లిం సోదరులతో కలిసి సమయం గడపడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అన్నమయ్య: సంబేపల్లిలో రంజాన్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. నెలరోజులు ఉపవాస దీక్షలో పాల్గొన్న ముస్లింలు చివరి రోజు ఈద్గా వద్దకు వెళ్లారు. అందరూ కలిసి ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలకు దానధర్మాలు చేశారు.
ELR: రేపు ఉదయం 10 గంటలకు ఏలూరులోని యూటీఎఫ్ భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ ఇవాళ తెలియజేశారు. ఏలూరు పవర్ పేట అన్నే భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏలూరులో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు జూన్ 3, 4, 5 తేదీలలో నిర్వహిస్తున్నామన్నారు.
KDP: కొండాపురం మండలంలోని 67 జాతీయ రహదారిలో ఉన్న వెంకటాపురం సీతారామయ్యస్వామి ఆలయానికి 116 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ దేవాలయాన్ని 1910లో ఒక భక్తుడు నిర్మించాడు. ఈ నెల 27న శ్రీరామనవమి పండగ పర్వదినం సందర్భంగా.. పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు పానకం, వడపప్పు వితరణ, రామ భజనలు ఈ ప్రాచీన ఆలయంలో జరగనున్నట్లు స్థానికులు తెలిపారు.
NTR: విజయవాడ మధురానగర్ నేతాజీ కాలనీలో నివాసం ఉంటున్న బుక్త జ్యోతి ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని, గత కొంతకాలంగా కంటి సమస్యతో బాధపడుతూ,సరిగ్గా చూడలేకపోతున్నానని ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే తక్షణమే స్పందించి, జ్యోతికు అవసరమైన కళ్ళజోళ్లను శుక్రవారం ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NLR: కందుకూరి ఎమ్మెల్యే నాగేశ్వరరావు ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అన్నారు. ఈద్ పండుగ అందరి ఇంట కొత్త వెలుగులు తీసుకురావాలని, అల్లాహ్ దీవెనలతో ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలన్నారు. రంజాన్ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
శ్రీకాకుళం: నగరంలోని సూర్య మహల్ జంక్షన్ వద్ద ఉన్న జమియా మసీదులో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం శాంతి, సహనం, సౌహార్దానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
మన్యం: మక్కువ మండలం కన్నంపేట గ్రామంలో శుక్రవారం పిడుగు పడి నల్ల గోపి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో పిడుగులు పడ్డాయి. అదే సమయంలో పొలంలో ఉన్న నల్ల గోపి, బలగ సాయి అనే ఇద్దరి వ్యక్తులకు పిడుగు పాటు వల్ల గాయాలయ్యాయి.
KKD: ఈ నెల 24న జిల్లా ఉపాధి కార్యాలయంలో 62 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫోన్ పే, రామకృష్ణ ఎలక్ట్రికల్ వర్క్స్ వంటి సంస్థలలో పనిచేసేందుకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న వారు టెన్త్ నుంచి డిగ్రీ అర్హత కలిగిన వారు ఉదయం 10 గంటలకు ధ్రువపత్రాలతో రావాలన్నారు.
VZM: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతోందని బొబ్బిలి MLA బేబినాయన అన్నారు. శనివారం బొబ్బిలి కోటలో మాట్లాడుతూ.. మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో 50 వేలమందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రబుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 20 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, రెండో ఏడాది జాబ్ క్యాలెండ్ విడుదల చేశామన్నారు.
ASR: చింతపల్లిలో పెట్రోల్ కొరతతో బంకుల వద్ద వాహనదారులతో భారీ రద్దీ పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు, సరఫరా అంతరాయాలపై భయాందోళనల నేపథ్యంలో చింతపల్లి మండలంలోఇంధన సంక్షోభ వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం నుంచే మండల కేంద్రంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలు కూడా గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.
KRNL: ఎమ్మిగనూరు, పవిత్రమైన రాంజాన్ పండుగను పురస్కరించుకుని ఎమ్మిగనూరు స్థానిక ఈద్గాలో ముస్లింలు సోదర, సోదరిమణులకు ఎమ్మెల్యే డాక్టర్ బివి.జయనాగేశ్వర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 30 రోజులు ఉపవాస దీక్షలు నిర్వహించి ఇవాళ ఈదుల్ ఫితర్ పండగ నిర్వహించుకోవడం శుభ పరిమాణమమని ఆయన పేర్కొన్నారు.
W.G: కృష్ణా జిల్లా తరిగొప్పుల రైల్వే స్టేషన్ ప్లాట్ఫారమ్ వద్ద గుర్తుతెలియని యువకుడు (సుమారు 25-30 ఏళ్లు) రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుని వివరాలు తెలిసిన వారు వెంటనే గుడివాడ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భీమవరం రైల్వే జీఆర్పి సుబ్రహ్మణ్యం కోరారు. మృతుని ఆచూకీ తెలిస్తే 92475 85713, 99890 29379 నెంబర్లను సంప్రదించాలని విన్నవించారు.