KRNL: హాలహర్వి మండలానికి చెందిన లబ్ధిదారులకు ఆలూరు టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ CMRF చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని మొత్తం 14 మందికి రూ. 6,84,487 విలువైన చెక్కులు అందజేశారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఇంఛార్జ్ పేర్కొన్నారు.
ATP: గుత్తిలోని తాడిపత్రి రోడ్డులో గురువారం దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు వరుసగా మూడు దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. మురళీకృష్ణ జనరల్ స్టోర్స్, గంగా గౌరి ట్రేడర్స్, శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ షాపుల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. దుకాణాల్లో ఉన్న నగదుతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
TPT: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు సీతారాముల కల్యాణం, 11 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే భక్తులకు విందు భోజనం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
E.G: కడియం మండలం కడియపులంకలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్, ఉద్యాన శాఖ సంయుక్తంగా గురువారం అలంకరణ మొక్కల ఎగుమతులు, సంబంధిత విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి హాజరై మాట్లాడుతూ కడియం నర్సరీల నుంచి మొక్కలను ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేయాలని సూచించారు.
PLD: జిల్లాలో జరగనున్న 16వ జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం కావాలని జేసీ సంజన సింహ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణా కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. మార్చి 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణలో పాల్గొనే అధికారులు జనగణన డేటా సేకరణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
కృష్ణా: చల్లపల్లిలో వడ్రంగి దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మేకల డొంక వద్ద ఉన్న ఉడ్ వర్క్ టింబర్ డిపోలో బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో దుకాణ యజమాని అద్దంకి సత్యనారాయణకు రూ.10లక్షల మేరకు నష్టం వాటిల్లింది. ఘటన స్థలికి పోలీస్, ఫైర్ సిబ్బంది, స్థానికులు చేరుకుని మంటలు అదుపు చేశారు.
కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో జనాభా గణన–2027 (దశ-1)కు సంబంధించిన శిక్షణా కార్యక్రమాన్ని కమిషనర్ రాకేష్ చంద్ర ప్రారంభించారు. గణన ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితంగా నిర్వహించాలని ఆయన సూచించారు. మాస్టర్ ట్రైనర్లు ఫీల్డ్ సిబ్బందికి సమగ్ర శిక్షణ అందించి, ఎలాంటి లోపాలు లేకుండా డేటా సేకరణ జరగాలని ఆదేశించారు.
NLR: మల్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 13 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. సుమారు15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వాసులు ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.మంత్రి స్పందిస్తూ.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
VZM: ఎల్.కోట మండలం కళ్లేపల్లి గ్రామంలో గురువారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులకు పశు వైద్య శిబిరం నిర్వహించడం శుభ తరుణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్, సిబ్బంది పాల్గొన్నారు.
GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బీఆర్ స్టేడియం అభివృద్ధి పనులకు గురువారం కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. బీఆర్ స్టేడియం కేవలం మైదానం మాత్రమే కాకుండా క్రీడాకారుల కలలకు రెక్కలు ఇచ్చే దేవాలయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ నసీర్, గల్లా మాధవి పాల్గొన్నారు.
W.G.భీమవరం పట్టణంలోని రాయలం జిల్లా రెడ్ క్రాస్ కార్యాలయంలో గురువారం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ సంస్థ నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలు అత్యవసర సమయాల్లో రోగులకు ప్రాణ రక్షణగా నిలుస్తున్నాయని అన్నారు. అనంతరం రక్తదాతలను అభినందించారు.
VSP: జీవీఎంసీ 33వ వార్డు ఎంజీఎం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూసి, నాణ్యతను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డొక్కా సీతమ్మ పథకం ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తుందన్నారు.
AKP: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్స్లో చేర్పించాలని డీఈవో అప్పారావు నాయుడు గురువారం విజ్ఞప్తి చేశారు. మార్చి ఒకటవ తేదీ నుంచి అడ్మిషన్స్ కూడా ప్రారంభం అయినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూల్స్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. మౌలిక సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటాయన్నారు.
సత్యసాయి: ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. మంత్రి సత్య కుమార్ ఆదేశాల మేరకు గురువారం 4వ మాస్టర్ తనిఖీలో మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్తపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ఉన్న కాలువ పనులను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు.
KRNL: ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి దక్కనుందని జిల్లా TDP అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ ఇవాళ తెలిపారు. రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో 5,475 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ ఏర్పడనుండగా, లక్ష మందికి ఉపాధి లభించనుందన్నారు. ప్రాజెక్ట్తో రాష్ట్రం గ్లోబల్ స్టీల్ హబ్గా మారుతుందని ఆమె పేర్కొన్నారు.