W.G: ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు (RRR) బ్యాంకులను మోసం చేసి కోట్లాది రూపాయల రుణాలు ఎగ్గొట్టారని ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఆరోపించారు. ఈ కుంభకోణాలపై ఇప్పటికే సీబీఐ కేసులు ఉన్నాయని, ఆయన బయట ఉంటే సాక్షులను భయపెట్టి కేసులను పక్కదారి పట్టించే అవకాశం ఉందని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని సునీల్ కుమార్ తెలిపారు.
కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తన కుటుంబసభ్యులతో గురువారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చి దర్శనం చేశారు. అధికారులు, అర్చకులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఆయన జిల్లా ప్రజలకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని వేడుకుంటూ.. వేద పండితుల ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు పొందారు.
NTR: (D)లోని రెడ్డిగూడెం(M), కొత్త నాగులూరులో అర్ధరాత్రి ఆస్తి వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. అన్నదమ్ముల మధ్య చెలరేగిన గొడవలో కత్తులు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన మొత్తం ఎనిమిది మందికి గాయాలు కాగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
E.G: రాజమండ్రి కిమ్స్ ఆస్పత్రిలో కల్తీ పాల ఘటన బాధితులను మంత్రి కందుల దుర్గేష్ గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కల్తీ ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
ATP: కూడేరు మండలం అంతరగంగ గ్రామంలో టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా నిర్మిస్తున్న రాములవారి దేవస్థానానికి పెండింగ్ నిధులను విడుదల చేయాలని టీడీపీ నేత శ్రీకాంత్ కోరారు. గురువారం ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆలయ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని వివరించారు.
PPM: సీతానగరంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ముడుపులు పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు తెచ్చిన వివిధ రకాల పుష్పాలు తులసి మాలలతో స్వామివారిని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసచార్యులు మాట్లాడుతూ.. స్వామివారిని విశ్వాసంతో, భక్తిశ్రద్ధలతో పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అని తెలియజేశారు.
ATP: జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ సమక్షంలో పలువురు యువకులు పార్టీలో చేరారు. యువమోర్చా నాయకులు తేజశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దివాకర్ నాయక్, రజక శ్రీకాంత్, చక్రధర్ రెడ్డి, మనిదీప్, సురేంద్ర పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి రాజేష్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని రాజేష్ తెలిపారు.
శ్రీకాకుళం నగరంలో ఐదు వార్డు సచివాలయాల పరిధిలో ఈనెల 23 నుంచి డయేరియా ప్రధాన సమస్యగా మారింది. గరిష్టంగా 102 కేసులు నమోదు కావడంతో యంత్రాంగాన్ని ఆందోళన గురి చేసింది. ఈ నేపథ్యంలో గురువారం నాటికి కొంతవరకు తగ్గు ముఖం పట్టింది. ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి, ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు.
తిరుపతి స్విమ్స్ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు మార్చి 3 నుంచి 6వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మెడికల్ ఆఫీసర్లు-4, స్టాఫ్ నర్సులు-4, ఏఎన్ఎం-4, మమోగ్రఫీ టెక్నీషియన్-2, కార్డియో వాస్క్యలర్ టెక్నీషియన్ గ్రేడ్-2, డీఏవో-2, పీఆర్వో-2, మెడికో సోషల్ వర్కర్-2, ఎలక్ట్రిషియన్-62, డ్రైవర్లు-2 పోస్టులు ఉన్నాయి. svimstpt.ap.nic.in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
SS: అమరాపురం మండలం కె. శివరం పంచాయతీ పరిధిలో ఉన్న కె. గొల్లహట్టి గ్రామస్తుల తాగునీటి సమస్య పరిష్కారమైంది. చాలా కాలంగా నీటి ఇబ్బందులతో సతమతమవుతున్న గ్రామం గురించి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే స్పందించారు. అధికారులను ఆదేశించి గురువారం తెల్లవారుజామున గ్రామంలో బోర్వెల్ వేయించారు.
కడపలో దేశానికే స్ఫూర్తిగా ఏర్పాటైన ‘సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్’ ద్వారా పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని చేరవేసేందుకు సిద్ధం చేసిన అధునాతన ఫుడ్ ట్రక్కులను కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి బుధవారం రాత్రి పరిశీలించారు. యూలర్ సంస్థ ప్రతినిధులు కలెక్టరేట్లో ఈ ట్రక్కుల పనితీరు, మానిటరింగ్ విధానంపై కలెక్టర్కు డెమో ఇచ్చి, వాటి ప్రత్యేకతలను వివరించారు.
W.G: తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు ఏఎస్ఐలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పి.సత్యనారాయణను మొగల్తూరుకు, ఎం.రాజ్యలక్ష్మిని భీమవరం వన్ టౌన్కు పంపారు. ఇటీవల స్టేషన్ సిబ్బందిపై వచ్చిన పలు ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపిన అనంతరం ఈ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
BPT: కర్లపాలెం సెంటర్, మసీదు, బుద్దాం, గణపవరం రోడ్లలో ఎస్సై రవీంద్ర గురువారం తనిఖీలు నిర్వహించారు. గంజాయి విక్రయించినా, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. కొత్త వ్యక్తులు వస్తే గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు. అలాగే, నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తామని ఆయన హెచ్చరించారు.
NLR: నెల్లూరులో భూదేవి శ్రీదేవి సమేత శ్రీతల్పగిరి రంగనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో నేడు ప్రారంభమయ్యాయి. మార్చి 8వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. మార్చి 2న హనుమంతసేవ, 3న బంగారు గరుడసేవ, 4న కళ్యాణోత్సవం, 5న రథోత్సవం, 6న తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ప్రధానోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది.
KRNL: పెద్దకడబూరు మండలంలోని నాగలాపురం గ్రామానికి చెందిన 2007–2008 యస్.యం.కె.వి ఉన్నత పాఠశాల పదవ తరగతి బ్యాచ్ మిత్రుడు బి. కేశవప్ప అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బ్యాచ్ మిత్రులు రూ. 36,500లను సమీకరించి గురువారం సహాయంగా అందజేశారు. అదేవిధంగా దేవాలయం వద్ద తీసుకున్న రూ. 6,500 అప్పును కూడా తీర్చారు.