SS: వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం పుట్టపర్తిలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బస్ స్టాండ్లు, మార్కెట్లు, ఆసుపత్రులు తదితర ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
SKLM: మెలియాపుట్టి మండలం పెద్దపద్మపురం ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఆజారి జశ్విత నవోదయ పాఠశాలకు ఎంపికయ్యారు. మంగళవారం నవోదయ విద్యాసంస్థ విడుదల చేసిన ఫలితాలలో బాలికల కోటాలో సీటు సాధించారు. విద్యార్థి ఉత్తమ ఫలితం సాధించడం పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
CTR: గుడిపల్లి మండలం చిన్న గొల్లపల్లిలో TATA సంజీవిని అవగాహన కార్యక్రమం జరిగింది. వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ బాబు పాల్గొని, ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ప్రజల ఆరోగ్య స్థితిని ముందుగానే గుర్తించి, సకాలంలో నాణ్యమైన చికిత్స అందించడమే సంజీవిని లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
W.G: ఉండి విద్యుత్ ఉపకేంద్రములో RDSS పనులు,11 కేవీ చెరుకువాడ ఫీడర్పై వాలిన చెట్లు, కొమ్మలు తొలగించుట కొరకు రేపు ఉదయం విద్యుత్కు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్. వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ ఉండదన్నారు.
TPT: చంద్రగిరి మండలం చిన్న రామాపురంలో అటవీ శాఖ అధికారులు మెరుపు దాడి చేశారు. ఆవులు మేపుకొంటూ జీవనం సాగించే ఓ వ్యక్తి ఇంట్లో రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నాట్లు సమాచారం. ఈ దాడిలో 20 మంది అధికారులు పాల్గొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫారెస్ట్ బంగ్లాకు తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
KRNL: రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకుని నగరంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ ఆదేశించారు. మంగళవారం పాత ఈద్గా, సంతోష్ నగర్ ఈద్గాలను పరిశీలించారు. పండుగ నాటికి స్వచ్ఛత, తాగునీటి వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
KDP: తమిళనాడుకి చెందిన అన్నామలై పలని స్వామి అనే వ్యక్తి 2017 సంవత్సరంలో సిద్ధవటం రేంజ్ నందు సిద్ధవటం బీట్లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. కేసు ఫైనల్ జడ్జిమెంట్ మంగళవారం తిరుపతి ఎర్రచందనం ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. అతనికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష రూ.6 లక్షలు జరిమానా విధించింనట్లు సిద్ధవటం రేంజ్ అధికారిణి కళావతి తెలిపారు.
కోనసీమ: బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులుగా అయినవిల్లి మండలంకు చెందిన సీనియర్ నాయకులు విళ్ల దొరబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను మంగళవారం అయినవిల్లి లంకలో ఆయన గెస్ట్ హౌస్ వద్ద బీజేపీ మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ, ఏఎంసీ డైరెక్టర్ కుడుపూడి సత్యవతి చంద్రశేఖర్ శాలువాతో ఘనంగా సత్కరించారు.
ASR: వాహనదారులు రహదారి నిబంధనలు పాటించాలని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం ఎస్సై పీ.కిషోర్ వర్మతో కలిసి కాకరపాడు గ్రామంలోని జంక్షన్ వద్ద రహదారి నిబంధనలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటిస్తూ, రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
BPT: ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొని లబ్ధిదారులు తమ గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
CTR: రాష్ట్రంలో అర్హత గల నిరుపేదలకు టిడ్కో గృహాలు, పక్కా ఇండ్లు మంజూరు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామా నాయుడు మంగళవారం డిమాండ్ చేశారు. ఇందుకోసం చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈనెల 24న ధర్నా నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
AKP: సీఎం చంద్రబాబు నక్కపల్లి పర్యటనపై టీడీపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు పార్టీ నాయకులు మంగళవారం సాయంత్రం పాయకరావుపేట పట్టణంలో ప్రతి షాపుకు వెళ్లి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
PPM: గరుగుబిల్లి మండలం గిజబ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది మంగళవారం సాయంత్రం తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. చేతికందొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు.
NLR: బుచ్చి పట్టణం ఖాజానగర్లోని ఏడవ వార్డులో మైనార్టీ యువత పేద ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి 50 మంది నిరుపేద కుటుంబాలను గుర్తించి రంజాన్ తోఫాను అందజేశారు. రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పేదవారికి ఈ తుఫాను అందజేసినట్లు వారు తెలిపారు.
VSP: జీవీఎంసీ పరిధిలో ఆస్తిపన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీ అందుబాటులో ఉందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. మార్చి 31లోగా పన్నులు ఒకేసారి చెల్లిస్తే ఈ సదుపాయం పొందవచ్చన్నారు. వార్డు సచివాలయాలు, బ్యాంకులు, జీవీఎంసీ కార్యాలయాల్లో చెల్లింపులు చేయవచ్చని సూచించారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.