PLD: ‘ప్రజల వద్దకు ప్రవీణ్’ కార్యక్రమంలో భాగంగా 49వ రోజున శనివారం రాత్రి పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్రోసూరు మండలం విప్పర్ల గ్రామంలో పర్యటించారు. ప్రజల సమస్యలను నేరుగా విని, వాటిని తక్షణమే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులను ఆయన ఆదేశించారు. నిరంతరంగా గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే తీరును స్థానికులు అభినందించారు.
NTR: మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా తిరువూరులో సీపీఐ నేతలు శనివారం నిరసన చేపట్టారు. మెడికల్ మాఫియాపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని, ఔషధ ధరలను నియంత్రించే చట్టాలు తీసుకురావాలని, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ప్రైవేటు ఆసుపత్రుల మాఫియాను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం సచివాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.
E.G: వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనపై రాజమండ్రి ఎయిర్ పోర్ట్లో శనివారం రాత్రి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించుకున్నారు. బాధితులను పరామర్శించి అమరావతి వెళ్తున్న సీఎంకు, కాకినాడ వెళ్తున్న పవన్ కళ్యాణ్ ఎదురయ్యారు. ఈ సందర్భంగా ప్రమాద తీవ్రత, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన కఠిన చర్యలపై ఇరువురు నేతలు కొద్దిసేపు చర్చించారు.
NTR: వీరులపాడు మండలం జుజ్జూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ డే వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంఈవో విద్యార్థులు తయారు చేసిన నమూనాలను చూసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వినూత్న ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలతో ముందడుగు వేయడం హర్షనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
KDP: ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా NTR విద్యాలక్ష్మీ ,NTR కళ్యాణలక్ష్మీ పథకాలను ప్రారంభించనుంది. ఈ పథకాల కింద డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రూ.10 వేల నుంచి రూ.100,000 వరకు రుణం అందించబడుతుంది. NTR కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా కుమార్తెల వివాహాల కోసం, NTR విద్యాలక్ష్మీ పథకం ద్వారా పిల్లల విద్యాభ్యాసం రుణాలు పొందవచ్చు.
కోనసీమ: రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం పర్యటన వివరాలను మంత్రి సిబ్బంది వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటలకు మసకపల్లి గ్రామంలో కోరమండల్ కంపెనీ వారి సీఎస్ఆర్ నిధులతో వాటర్ ట్యాంక్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలో నందు రేగుబడవలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.
BPT: కారంచేడు మండలం కుంకలమర్రులోని కొమ్మమూరు కాలువ వద్ద శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవ్వడం కలకలం రేపింది. ఎస్సై ఖాదర్ భాష తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు గల ఈ వ్యక్తి మృతదేహం నరసయ్యపాలెం లాకుల వద్ద నుండి నీటిలో కొట్టుకువచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంలో శనివారం రాత్రి యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్, కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా రాజకీయ వేధింపులకు ఏ మాత్రం వెనుకాడబోమని, ప్రజల తరఫున పోరాటం మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.
ప్రకాశం: పొన్నలూరు మండలం చెన్నుపాడు సమీపంలో సంగమేశ్వర డ్యాం నిర్మాణానికి రూ.166.40 కోట్లు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. సంగమేశ్వర రిజర్వాయర్ ద్వారా కొండపి నియోజకవర్గంలో 9500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు 60 గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో రూ. 25 కోట్లు కేటాయించారని అన్నారు.
ATP: విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం నుంచి ప్రారంభమైన సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొంటున్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన ఈ లీగ్లో ఆయన సందడి చేస్తున్నారు. ఏపీ పొలిటికల్ లయన్స్ జట్టుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సారథ్యం వహిస్తున్నారు.
KRNL: రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఓవర్ స్పీడ్ 1,536, హెల్మెట్ లేకుండా 1,388, సెల్ఫోన్ డ్రైవింగ్ 392, ట్రిపుల్ రైడింగ్ 63 కేసులపై ఈ-చలాన్లు నమోదు చేశారు.
ప్రకాశం: పామూరు పట్టణంలో కొత్త విద్యుత్ లైన్ల పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నాయబ్ రసూల్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పామూరులోని పాత స్టేట్ బ్యాంకు రోడ్డు, కరెంట్ ఆఫీస్ కాలనీ, ఇరువురు రోడ్డు తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
PPM: కురుపాం MLA తోయక జగదీశ్వరీని శనివారం గుమ్మలక్ష్మీపురం మండలం గిరిశిఖర గ్రామమైన మంత్రజోల గ్రామస్తుల కలిసి తమ గ్రామానికి BT రోడ్డు పనులు పూర్తి చేయాలని వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. డోలిమోత గ్రామంగా గుర్తించి ప్రభుత్వం రోడ్డు మంజూరు చేసిందని, ఆయితే ఆటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో చివరి దశలో రోడ్డు పనులు ఆగిపోయాయని వాపోయారు.
కృష్ణా: మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది వీడ్కోలు సభ శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. ఇప్పటివరకు వీరంతా విధి నిర్వహణలో నిరంతరాయంగా మీతో గడిపే సమయం కూడా లేకుండా విధుల్లో నిమగ్నం అయ్యారని, విరమణ అనంతరం వారికి ప్రశాంత జీవితం అందజేయాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉందని తెలిపారు.
GNTR: తెనాలి పినపాడు గేటు సమీపంలో శనివారం జరిగిన రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి (55) మృతి చెందాడు. హౌరా-బెంగళూరు ఎక్స్ప్రెస్ పట్టాలు దాటుతున్న సమయంలో అతడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న తెనాలి జీఆర్పీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.