ASF: సిర్పూర్ (U) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హరిత బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. వైద్య సేవల అమలు తీరుపై సమీక్షించారు. ఓపీ రిజిస్టర్, హాజరు పుస్తకాలు, ఔషధ నిల్వలు, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని ఆమె స్పష్టం చేశారు.
WGL: మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ముసాయిదా బడ్జెట్ సమావేశం జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయ అంచనాలపై ఈ సందర్భంగా చర్చించారు. నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఈ బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించారు.
ADB: గుడిహత్నూర్ మండలంలోని డోంగర్గావ్ గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే మంజూరుతో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా రూ.5 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించారు. గ్రామ అభివృద్ధి దిశగా చేపట్టిన ఈ పనులు ప్రజలకు సౌకర్యాన్ని కల్పించనున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అబ్దుల్ రహేమాన్, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
SRCL: అక్రమ కేసులకు భయపడేది లేదని బీఆర్ఎస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న అన్నారు. తంగళ్ళపల్లిలోని పోలీస్ స్టేషన్ ముందు బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ను విచారణ పేరుతో వేధిస్తున్నందుకు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసామన్నారు. దానికి గాను 18 మంది బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టారని వాపోయారు. కేసులకు భయపడేది లేదన్నారు.
KNR: కాంగ్రెస్ చేనేత రాష్ట్ర కార్యదర్శిగా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందినకూరపాటి రామచంద్రం నియమకం అయ్యారు. ఈ మేరకు ఆయనకు చేనేత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్రం మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
MDCL: మల్లాపూర్ ప్రాంతంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి HMWSSB ఆధ్వర్యంలో త్వరలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. నీటి సరఫరాలో తలెత్తుతున్న తక్కువ ప్రెషర్, లీకేజీలు, పైప్లైన్ లోపాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోనున్నారు. కాలనీల వారీగా ప్రత్యేక బృందాలు పర్యటించి ప్రజల ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తారు.
PDPL: జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆయిల్ ఫామ్ తోటలు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పరిశీలించారు. సాగు వివరాలు తెలుసుకొని, ఆయిల్ ఫామ్ పంట పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పంట సాగు విస్తరణకు చర్యలు చేపట్టాలని సూచించారు. రమ్య అనే మహిళ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు.
HYD: వైద్యుల సలహా లేకుండా బరువు తగ్గించే మందులు వాడటం ఆరోగ్యానికి ప్రమాదకరమని సీపీ సజ్జనార్ హెచ్చరిస్తున్నారు. వీటివల్ల తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉన్నందున, ఎల్లప్పుడూ లైసెన్స్ ఉన్న ఫార్మసీల్లోనే మందులు కొనాలని సూచిస్తున్నారు. అక్రమ విక్రయాల గురించి తెలిస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
VKB: బంట్వారం మండలంలోని మద్వాపూర్ నుంచి బుగ్గాపూర్ వెళ్లే మట్టి రోడ్డు గుంతలమయంగా మారి ప్రయాణికులకు నరకాన్ని చూపుతోంది. వర్షాకాలంలో ఈ దారిలో ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, లేనిపక్షంలో రోడ్డుపైనే ధర్నా నిర్వహిస్తామని స్థానికులు హెచ్చరించారు.
NRPT: మక్తల్ పట్టణంలో సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని మంత్రి శ్రీహరి సతీమణి లలిత ఈరోజు సందర్శించారు. కంప్యూటర్ కోర్సులో శిక్షణ పొందుతున్న మహిళలకు స్టడీ మెటీరియల్ను వారికి అందజేశారు. కుట్టు మిషన్లో శిక్షణ పొందుతున్న యువతులకు మెలకువలను నేర్పించారు. శిక్షణ పొందుతున్న వారి దగ్గరికెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
RR: మియాపూర్ 240 డివిజన్ నాయకుడు అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ను ఎమ్మెల్యే గాంధీ ఈరోజు ప్రారంభించారు. పేద ప్రజలకు అత్యవసర సమయాల్లో వేగంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్యే అభినందిస్తూ, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ASF: ఆసిఫాబాద్ పట్టణంలోని ఉస్మానియా మజీద్ నగర్ కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ బాధిత కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించారు. ఉపాధ్యాయుడి భౌతిక దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
SRCL: వేములవాడ బార్ అసోసియేషన్ సభ్యులను స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యుడు కిరణ్ కుమార్ కలిసి వారి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా న్యాయవాదుల వృత్తి అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమం కోసం బార్ కౌన్సిల్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు తన గెలుపునకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
JGL: కేరళలోని శబరిమల పుణ్యక్షేత్రంలో అయ్యప్ప స్వామి సన్నిధిలో మాజీ మంత్రి, ధర్మపురి BRS పార్టీ ఇంచార్జ్ కొప్పుల ఈశ్వర్ దంపతులు, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందారు. వారు మాట్లాడుతూ.. స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నారు.
MNCL: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం అటవీ డివిజన్లో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులపై వేటు పడింది. బీట్ ఆఫీసర్ లవన్ కుమార్, డీఆర్ కుమారస్వామిని సస్పెండ్ చేసినట్లు ఎన్డీఓ రామ్మోహన్ బుధవారం ప్రకటించారు. అటవీ దొంగలకు సహకరించినా, విధుల్లో అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.