WGL: జిల్లాలో కార్యదర్శుల డిప్యూటేషన్ ప్రక్రియ చర్చనీయాంశమైంది. ఇటీవల నర్సంపేట, వర్ధన్నపేట, డివిజన్లకు చెందిన GP కార్యదర్శులను ఇతర డివిజన్లకు డిప్యూటేషన్పై పంపగా, వారు గ్రామాల వారీగా నేడు రిపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది కార్యదర్శులు సెలవులో ఉండటంతో సోమవారం రిపోర్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ మార్పులతో గ్రామాల అభివృద్ధి సాగుతుందని ప్రజల చర్చ కొనసాగుతుంది.
BHPL: గోరికొత్తపల్లి పోలీస్ స్టేషన్కు భవనాన్ని మంజూరు చేయాలని, గోరికొత్తపల్లి మండలంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శాసనసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… అటవీ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఫారెస్ట్ అధికారులు ఆపకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
MHBD: చిన్నగూడూరు మండల కేంద్రంలోని మాంగోలిగూడెం గ్రామానికి చెందిన ధారవత్ శతాక్షి JNVST-2026 ప్రవేశ పరీక్షలో అద్భుత విజయం సాధించింది. గత నెలలో నిర్వహించిన జవహర్ నవోదయ విద్యాలయం 6వ తరగతి ప్రవేశ పరీక్షలో 92.50 మార్కులు సాధించి ఆల్ ఇండియా ర్యాంక్ 32 స్థానంలో నిలిచి ఎంపికైంది. ఈ సందర్భంగా విద్యార్థి శతాక్షిని, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు.
SRPT: గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతో అవసరమని మునగాల మండలం రేపాల గ్రామ సర్పంచ్ సత్యనారాయణ అన్నారు. బుధవారం గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఎస్సై ప్రవీణ్ పర్యవేక్షణలో ప్రధాన కూడలి వద్ద అత్యాధునిక సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
JGLG: రాయికల్ మండలం సింగరావుపేట గ్రామానికి చెందిన గోరేమియాకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 60 వేల చెక్కును ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగారెడ్డి,. పాల్గొన్నారు.
RR: కొందుర్గు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రేపు పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఉదయం 6 గంటలకు స్వామివారికి విశేష అభిషేకం, సాయంత్రం 4 గంటలకు పల్లకి సేవ, రాత్రి 7 గంటలకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ కోరింది.
HNK: వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ కనెక్షన్ల విధానంలో మరింత సౌకర్యవంతమైన మార్పులు తీసుకున్నట్లు NPDCL HNK SE మధుసూదన్ రావు తెలిపారు. కొత్త విధానం ప్రకారం 1 కిలోవాట్ వ్యవసాయ కనెక్షన్కు కేవలం ₹1000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఈ మార్పులతో కనెక్షన్ పొందడం సులభతరం, వేగవంతం, పూర్తిగా పారదర్శకంగా మారిందన్నారు.
NLG: వట్టిమర్తి గ్రామంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 8వ వార్డులో పారిశుద్ధ్య పనులను వార్డు సభ్యుడు మేడి హరికృష్ణ వేగవంతం చేశారు. పంచాయతీ సిబ్బందితో కలిసి వార్డు అంతటా బ్లీచింగ్ పౌడర్ చల్లించే పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. వార్డులో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూస్తానని, సర్పంచ్, ఉపసర్పంచ్ల సహకారంతో 8వ వార్డును ఆదర్శంగా నిలుపుతానన్నారు.
NZB: నందిపేట్ గ్రామపంచాయతీ 2026-27 సంవత్సరానికి త్రైబజార్ (సోమవారం అంగడి, రోజువారీ సంత) వేలంపాటను మార్చి 24, 2026 మంగళవారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు పంచాయతీ కార్యాలయంలో ఈ వేలాన్ని నిర్వహించనున్నట్లు కార్యదర్శి మహేందర్ బుధవారం తెలిపారు. పాల్గొనదలచిన వారు నిర్ణీత డిపాజిట్తో హాజరుకావాలన్నారు.
PDPL: మంథని మండలం ధర్మారం బస్టాండ్ ప్రమాదకరంగా మారింది. పిల్లర్లు, పైకప్పు పూర్తిగా దెబ్బతిని శిథిలావస్థకు చేరుకుంది. బస్టాండ్ సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఎండలో, వర్షంలో వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి నూతన బస్టాండ్ను రోడ్డుకు దగ్గరగా ప్రజలకు అందుబాటులో నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
MBNR: అసెంబ్లీలో బుధవారం జరిగిన క్వశ్చన్ అవర్లో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖపై మాట్లాడారు. జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న 25 వెంటిలేటర్ బెడ్లకు అదనంగా మరో 25 బెడ్లను ఏర్పాటు చేయాలని కోరారు. గత రెండేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగిన దృష్ట్యా, వైద్యుల సంఖ్యను కూడా పెంచాలని ఆయన తెలిపారు.
BDK: భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి, మాస్ కాపీయింగ్కు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు. పాఠశాల భవన దుస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వెంటనే మరమ్మత్తులు, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
MHBD: ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతాంగానికి మేలు చేయాలని, మక్కలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరుతూ అదనపు కలెక్టర్కు రైతు సంఘం నేతలు వినతి పత్రం అందజేశారు. రైతు సంఘం నాయకులు సుధాకర్ రెడ్డి, నాగేశ్వరరావు మాట్లాడుతూ… రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రైతులు పండించిన పంటకు మద్దతు ధర చెల్లించాలన్నారు.
MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన పదవ తరగతి పరీక్షల్లో 100% మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ఎంఈవో శ్రీనివాస్ తెలిపారు. బుధవారం హిందీ పరీక్ష నేపథ్యంలో ఐదు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 816 మంది విద్యార్థులకు గాను 100% మంది పరీక్షకు హాజరయ్యారని ఆయన ప్రకటించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.