NLG: నకిరేకల్ సమీపంలోని జాతీయ రహదారి 65పై ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ టైరు పగిలి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడగా నకిరేకల్ పోలీసులు క్లియర్ చేశారు.
ELR: నేర పరిశోధన, పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించే లక్ష్యంతో, హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్నత స్థాయి వర్క్ షాప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పాల్గొన్నారు. నేర పరిశోధనలో AI సాంకేతికతలో పోలీస్ లెర్నింగ్ గురించి వివరించారు.
HYD: ఎల్బీనగర్, ఉప్పల్ జోన్ ప్రాంతాల వారికి అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. వనస్థలిపురం సచివాలయ నగర్లో స్విమ్మింగ్ పూల్ ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపారు. రూ. 500 పెడితే నెలరోజుల పాటు స్విమ్మింగ్ చేయొచ్చని పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు 10 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న అందరికీ ఎంట్రీ ఉంటుంది. ఉదయం 10గంటల నుంచి 11గంటల వరకు ప్రత్యేకంగా మహిళలకు ఉంటుంది.
ప్రకాశం: కౌన్సిలర్లు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టారని మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు అన్నారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఐదేళ్ల సేవలను స్మరించుకుంటూ వారిని సన్మానించారు. మౌలిక వసతుల అభివృద్ధి, పేదల సంక్షేమం, పరిశుభ్రత, తాగునీటి సరఫరా, వంటి అంశాల్లో కౌన్సిలర్లు ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలన్నారు.
KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. గత నెల 13 నుంచి మంగళవారం వరకు రామయ్య క్షేత్రాన్ని దర్శించిన భక్తులు కానుకలను సమర్పించారు. రంగ, ముఖ మండపం, భక్త సంజీవరాయస్వామి ఆలయంలో హుండీలను తితిదే అధికారులు తెరిచారు. సిబ్బంది, శ్రీవారి సేవకులు మదింపు చేయగా రూ. 7,72,502 వచ్చినట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ తెలిపారు.
VSP: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సుమారు 500 మంది ఫిర్యాదుదారులు హాజరై తమ సమస్యలను వినిపించారు. భూ సమస్యలే అధికంగా వచ్చినట్లు ఆయన తెలిపారు. హౌస్ సైట్లు, పట్టాలు, అసైన్డ్ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
NGKL: లింగాల మండల కేంద్రంలో గల రైతు వేదికలో జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా ప్రకృతి వ్యవసాయంపై మండల వ్యవసాయ అధికారి అనిల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అప్పాయిపల్లి, శాయిన్ పేట గ్రామాలకు చెందిన రైతులకు ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు ప్రత్యేకంగా రూపొందించిన కిట్లను పంపిణీ చేశారు.
KRNL: పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల త్వరిత పరిష్కారానికి బుధవారం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లాల్లో పరిష్కారం కాని సమస్యలను నేరుగా సీఎండీకి వినిపించవచ్చని పేర్కొన్నారు.
AP: పాతిక సంవత్సరాల వ్యవధిలో 500 కోట్ల భోజనాల మైలురాయిని అందుకున్న అక్షయపాత్ర ఫౌండేషన్కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ‘పీఎం పోషణ్, అన్న క్యాంటీన్లలో అక్షయపాత్ర ఫౌండేషన్ భాగస్వామిగా ప్రజలు, చిన్నారులకు సేవలందిస్తోంది. ఆ సంస్థ 500 కోట్ల భోజనాల మైలురాయిని సాధించడం గర్వకారణం. ఈ ఫౌండేషన్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అని పేర్కొన్నారు.
పళ్లు తోముకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. గట్టిగా, ఎక్కువ సేపు బ్రష్ చేస్తే పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. కేవలం 2 నిమిషాలు, మెత్తని బ్రిజిల్స్ ఉన్న బ్రష్తో సున్నితంగా తోముకోవాలి. నాలుకను శుభ్రం చేయడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. రోజుకు రెండుసార్లు (ఉదయం, రాత్రి) బ్రష్ చేయాలి. ప్రతి 3 నెలలకోసారి బ్రష్ మార్చాలి. వాడిన తర్వాత బ్రష్ను శుభ్రంగా ఆరబెట్టాలి.
ASR: జిల్లాలో అమలవుతున్న ‘జల్ జీవన్ మిషన్’ పనులు వేగవంతం చేసి గ్రామాలకు తాగునీరు అందించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీరు సరఫరాకి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం కలెక్టరేట్లో రెండు జిల్లాల అధికారులతో వీసీ నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, తాగునీరు సదుపాయం, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.
తూ.గో: ప్రభుత్వం అమలు చేస్తున్న దివ్యాంగశక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఇవాళ ప్రారంభించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో దివ్యాంగశక్తి పథకంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రస్థాయిలో ఈ పథకాన్ని సీఎం ప్రారంభిస్తారన్నారు.
MLG: వెంకటాపురం మండలం సుడిబాక గ్రామానికి చెందిన మడప భాస్కర్ (27)కు విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న రాత్రి పొలం వైపు వెళ్తుండగా జంతువుల వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు విచారణ చేపట్టారు.
VZM: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ దామోదర్ ముస్లిం పోలీస్ అధికారులు, సిబ్బందిని కార్యాలయానికి పిలిపించుకుని, వారితో ముచ్చటించి మంగళవారం ఇప్తార్ విందును ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. రంజాన్ మాసం శాంతి, సహనం, సేవ భవానికి ప్రతీక అని అన్నారు. మనమందరం భారతీయులం అని ఒకటే కులం, అది కూడా పోలీసు కులం అని ఆయన అభివర్ణించారు.
W.G: పాలకొల్లు పట్టణంలో మంగళవారం రాత్రి పాల విక్రయ కేంద్రాలపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేపట్టారు. జిల్లా ఆహార భద్రత అధికారి శ్రీధర్ రెడ్డి నేతృత్వంలోని అధికారులు పలు పాల విక్రయ కేంద్రాల్లో ఫుడ్ లైసెన్స్, పాలను తనిఖీ చేసి శాంపిల్స్ను సేకరించారు. ఈ శాంపిల్స్ హైదరాబాద్ ల్యాబ్కు పంపిస్తామన్నారు.