MHBD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ జిల్లాల కలెక్టర్లు, అధికారులు సమావేశంలో పాల్గొని ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అమలు చర్యలపై చర్చించారు.
సత్యసాయి: కదిరి టౌన్ కుమ్మరోల్లపల్లి శ్రీరాముల గుడి వద్ద విగ్రహాలను ధ్వంసం చేసిన కుంచపు వెంకటేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయ గోపురం పనుల విషయంలో యజమాన్యంతో ఏర్పడిన ఆర్థిక విభేదాలే ఈ ఘటనకు కారణమని విచారణలో తేలింది. తనకు రావలసిన డబ్బులు ఇవ్వకుండా, పనిని వేరే వారికి అప్పగించారనే కోపంతోనే నిందితుడు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
MLG: ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి అమెరికాలో స్థిరపడిన సర్పంచ్ కాకులమర్రి శ్రీలత, లక్ష్మణ్ బాబు దంపతుల మేనకోడలు 2,000 డాలర్లు (సుమారు ₹1.83 లక్షలు) విరాళం ప్రకటించారు. శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సమక్షంలో చెక్కును అందజేశారు. ఈ నిధులతో మహిళా టాయిలెట్లు మరియు పారిశుధ్య పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
MBNR: భూత్పూర్ మండలం తాటికొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సతీమణి కవిత హాజరయ్యారు. పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆమె పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసి అభినందనలు తెలిపారు.
జగిత్యాలలోని 2BHK అర్బన్ కాలనీలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని సీపీఐ జిల్లా నాయకుడు వెన్న సురేశ్ మున్సిపల్ కమిషనర్కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. 4520 కుటుంబాలకు అంగన్వాడీ, పాఠశాలలు, ఆసుపత్రి, మార్కెట్ వంటి సదుపాయాల కోసం ఉన్న భూమిలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఆక్రమణలను తొలగించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
కర్నూలు: జోన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లుగా ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం దేహదారుఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ పి. శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్. హనుమంతరావు సమక్షంలో 20 మంది అభ్యర్థులకు రిజర్వ్ ఇన్స్పెక్టర్ జావిద్ బృందం ఫిజికల్ పరీక్షలు నిర్వహించింది. అనంతరం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో మెడికల్ పరీక్షలు జరిగాయి.
VSP: రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఆస్తి పన్నుల రివిజన్ పిటిషన్లను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జివీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జోనల్ కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం జివీఎంసీ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ విభాగ పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
TPT: టెంపుల్ సిటీ తిరుపతిపై యుద్ధం ప్రభావం పడింది. రేపటి నుంచి కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని గ్యాస్ కంపెనీలు నిర్ణయించాయి. 19.5 కిలోల సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలనే ఈ నిర్ణయంతో 3 వేలకు పైగా హోటళ్లు ప్రభావితం కానున్నాయి. ఈ పరిణామం తిరుపతిలోని హోటల్ వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది.
AP: స్పీకర్ అయ్యన్నపాత్రుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం నియోజకవర్గం అభివృద్ధి నివేదికను పవన్ అందజేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిసరఫరా శాఖల ఆధ్వర్యంలో నర్సీపట్నంలో రూ.312 కోట్లతో 5,628 పనులు మంజూరు చేశామని చెప్పారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో 4,530 పనులు పూర్తి అయ్యాయని వివరించారు.
TPT: అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 100 బస్తాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఏఎస్వో లక్ష్మీనారాయణ రెడ్డి వివరాలు తెలియజేశారు. కలువాయి మండలం నుంచి బియ్యాన్ని అక్రమ మార్గాల్లో గూడూరుకు తరలించి అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఈ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ATP: గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో MRI స్కానింగ్, రేడియాలజిస్ట్ డాక్టర్ను నియమించాలని కోరుతూ మండల తహసీల్దార్ రమాదేవికి కిసాన్ కాంగ్రెస్ మాజీ ఎగ్జిక్యూట్ సభ్యుడు టీసీ.నారాయణరెడ్డి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులు MRI స్కానింగ్ లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆస్పత్రిలో MRI స్కానింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడుల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో రేపు పశ్చిమాసియాలో నిర్వహించాల్సిన 12వ తరగతి పరీక్షను రద్దు చేస్తున్నట్లు సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ భరద్వాజ్ తెలిపారు. పరిస్థితిని బట్టి రానున్న పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు.
రాజస్థాన్కు చెందిన 19 ఏళ్ల 126 రోజుల రాజకుమారి పరేఖ్.. సీఏ ఫైనల్ పరీక్షలో పాసై దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన చార్టర్డ్ అకౌంటెంట్గా రికార్డు సృష్టించారు. గతంలో నందిని అగర్వాల్ పేరిట ఉన్న రికార్డును ఆమె తిరగరాశారు. శ్రమ, అంకితభావంతో ఏ వయసులోనైనా అసాధ్యమైన లక్ష్యాలను సుసాధ్యం చేయవచ్చని ఆమె నిరూపించారు.
ప్రకాశం: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడిని ప్రజలంతా ఖండించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సయ్యద్ హనీఫ్ కోరారు. చంద్రశేఖరపురంలో మండల కమిటీ సమావేశంలో హనీఫ్ మాట్లాడుతూ.. చమురు సంపద కోసం అమెరికా యుద్ధానికి దిగిందని విమర్శించారు. ఈ దాడుల్లో పౌరులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా చర్యలను భారత ప్రభుత్వం ఖండించాలని డిమాండ్ చేశారు.
కడప: పులివెందుల ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా శాంతిలాల్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ట్రాఫిక్ సీఐ హాజీవల్లిని నంద్యాల డీపీటీసీకి బదిలీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.