పార్వతీపురంమండలంలోని తాళ్లబురిడి గ్రామంలో ఆరవిల్లి శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు అయ్యల స్వామి యాజుల శ్రీనివాసశర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు బసవ రాజుల పర్యవేక్షణలో శివాలయ ప్రతిష్ట పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూడు రోజుల నుంచి గ్రామస్తుల సహాయ సహకారాలతో శివాలయపునఃప్రతిష్ట పూజలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
NDL: పట్టణంలోని చిన్నచెరువు వద్ద ఉన్న వినాయక ఘాట్లో యువకుడి మృతదేహం మంగళవారం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. బిల్లలపురంకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చరణ్(25)గా గుర్తించారు. ఆత్మహత్య లేదా ఇతర కారణాలు ఉన్నాయా తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మేడ్చల్: రాజేంద్రనగర్ సర్కిల్ గగన్ పహాడ్ పారిశ్రామికవాడలో మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది. గగన్ పహాడ్లోని ఓ లారీ మెకానిక్ షెడ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించి స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది.
HYD: నేటి నుంచి 2 రోజుల పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో షీల్డ్ కాంక్లేవ్ 2025 జరగనుంది. సైబర్ నేరాల నుంచి ప్రజలను రక్షించే ఆవిష్కరణలపై కాంక్లేవ్కు సీఎం రేవంత్, పోలీస్ ఉన్నత అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కాంక్లేవ్లో పాల్గొనేందుకు 1,200 సైబర్ భద్రత నిపుణులు దరఖాస్తులు చేసుకోగా 590 మందిని TGCSB సెలెక్ట్ చేసింది.
HYD: GHMC స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ పత్రాలను కమిషనర్ కార్యాలయంలో మంగళవారం పరిశీలించనున్నారు. పోటీకి అర్హులుగా నిలిచేవారు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈనెల 21వ తేదీ వరకు గడువుంది. అన్ని నామినేషన్లు అర్హత పొంది, ఎవరూ ఉపసంహరించుకోని పక్షంలో 25వ తేదీన పోలింగ్ జరగనుంది.
HYD: మూసాపేట్ ఆంజనేయ నగర్కు చెందిన సోమా ప్రభాకర్ 14 ఏళ్ల క్రితం తనకు దొరికిన కుక్క పిల్లను చేరదీసి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. తనకు ఆడపిల్లలు లేకపోవడంతో ఆ శునకానికి కుట్టి అని పేరు పెట్టి కుటుంబ సభ్యుడిగా చూసుకుంటున్నారు. అనారోగ్య కారణాలతో కుక్కపిల్ల సోమవారం మృతి చెందింది. దీంతో వారు శోకసంద్రంలో మునిగారు. శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
HYD: శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం భారీ ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్కు వస్తున్న బ్లూడార్ట్ కార్గో విమానానికి ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్కు అనుమతి కోరాడు. వెంటనే ఎయిర్ పోర్ట్ అధికారులు స్పందించి ఇతర అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ను నిలిపివేశారు.
VZM: వంట గ్యాస్ లీకై ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కొత్తవలస మండలంలో చోటు చేసుకుంది. కంటకాపల్లిలో సోమవారం జరిగిన అమ్మవారి తీర్థ మహోత్సవాలు సందర్భంగా బాడితబోని మల్లయ్య ఇంట్లో పిండి వంటలు తయారు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని శారదా కంపెనీ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
VZM: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబందించి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న బ్యాలెట్ పత్రాల తనిఖీ కార్యక్రమం నేడు కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో చేపట్టారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. బిఆర్. అంబేద్కర్ తనిఖీ ప్రక్రియను పరిశీలించారు. డీఆర్ఓ ఎస్. శ్రీనివాసమూర్తి, ఎన్నికల సూపరింటెండెంట్ భాస్కరరావు పాల్గొన్నారు.
పార్వతీ పురం జగన్నాధపురంలోని జనావాసాలకు అనుకొని మార్కెట్ యార్డ్లో జీడి పిక్కల క్రాసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఐటీడీఏ అధికారులు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని సీపీఎం నాయకులు గొర్లె వెంకట్రమణ, పాకల సన్యాసిరావు డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ.. కొమరాడ గరుగుబిల్లి మండలాలు రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు 1974లో ఇది నియమించారు అన్నారు.
NLR: నేటి నుంచి 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలలో భాషల పండుగ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 345 పాఠశాలలో ఎంపిక చేసిన భాషల వకృత్వ, వ్యాసరచన, కథలు చెప్పడం, రాయడం, చర్చా వేదికలు, సెల్ఫ్ చెక్, పాటలు పాడడం, డాన్సులు వేయడం, బోధనోపకరణాల తయారీ వంటి అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
KRNL: అగ్రికల్చర్ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ సొసైటిలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించి వెంకటాపురంకు చెందిన శేఖర్, సుధాకర్లు రూ.3.50 లక్షల తీసుకొని మోసం చేశారని బేతపల్లి గ్రామంకు చెందిన రాజశేఖర్ సోమవారం జిల్లా SP విక్రాంత్కు ఫిర్యాదు చేశారు. అలాగే రూ.2.80 లక్షలు తీసుకొని నకిలీ ఇళ్ల పట్టాలు ఇప్పించి రమేష్ అనే వ్యక్తి మోసం చేశాడని నరసింహులు ఫిర్యాదు చేశారు.
VZM: సాలూరు పట్టణంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం 25వార్డు రోడ్డు పక్కన ఉన్న చెత్తను మున్సిపల్ శానిటరి అధికారి పర్యవేక్షణలో జేసీబీతో తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు చెత్తను రోడ్డుపై వెయ్యకుండా చెత్త బుట్టలు వినియోగించాలని కోరారు. తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా ఉంచి, చెత్త కుండీలలో వెయ్యాలన్నారు.
KRNL: జిల్లాలో గ్రూపు-2 మెయిన్స్ పరీక్షల పకడ్బందీ ఏర్పాట్లపై APPSC జిల్లా కోఆర్డినేటర్, జేసీ డాక్టర్ బి. నవ్య సోమవారం కలెక్టరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని, లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఆలయ ఈఓ బాపిరెడ్డి శ్రీకాళహస్తి 12వ అడిషనల్ డిస్ట్రిక్ జడ్జి శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియను మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానం పలికారు.