GNTR: అన్నదాత సుఖీభవ పథకంతో పాటు ప్రభుత్వ సబ్సిడీల కోసం రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఈ-కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని గురువారం మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు సూచించారు. పంటల నమోదు గడువు ముగిసిందని, ప్రస్తుతం ఆ వివరాలను అప్లోడ్ చేస్తున్నామని తెలిపారు. పవర్ ప్రేయర్లు, డ్రోన్ల వంటి యంత్ర పరికరాల కోసం యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు.
NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలకు మద్దతు తెలిపారు. హైదరాబాద్లోని అసెంబ్లీ ఆవరణలో వారిని కలిసి, గురువారం జరిగిన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి రాజగోపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
KRNL: దేవనకొండ MPDO కార్యాలయంలో అధికారుల పేర్లు సూచించే బోర్డుపై గందరగోళం నెలకొంది. కొందరి పేర్లు లేకపోగా, మరికొందరి పేర్లు పేపర్పై ఉండటాన్ని స్థానికులు విమర్శిస్తున్నారు. దీంతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు సంబంధిత అధికారులను గుర్తించడం కష్టమవుతోందని అంటున్నారు. పూర్తి వివరాలతో బోర్డును సరిచేసి ప్రజలకు స్పష్టమైన సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెడ్డింగ్ రిసెప్షన్లో రష్మిక తల్లిదండ్రులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఖరీదైన దుస్తులకు పోకుండా, తమ కొడవా(కూర్గ్) గిరిజన సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తండ్రి ‘కుప్యా’ కోటులో, తల్లి ప్రత్యేక కొడవ చీరకట్టులో మెరిశారు. సెలబ్రిటీ వేడుకలోనూ తమ మూలాలను, వారసత్వాన్ని ఘనంగా చాటిచెప్పిన ఈ జంట అందరి ప్రశంసలు అందుకుంటోంది.
TG: హైదరాబాద్లో ఎండలు మార్చిలోనే తీవ్రరూపం దాల్చాయి. సాధారణంగా మే నెలలో ఉండే విద్యుత్ డిమాండ్, ఈసారి మార్చిలోనే 4,421 మెగావాట్లకు చేరి పాత రికార్డులను అధిగమించింది. ఏసీలు, కూలర్ల వాడకం పెరగడంతో సబ్ స్టేషన్లపై భారం పెరిగి ఇప్పటినుంచే అక్కడక్కడ విద్యుత్ కోతలు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో డిమాండ్ 5,000 మెగావాట్లు దాటే అవకాశం ఉందని అంచనా.
NZB: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB మాజీ MP కల్వకుంట్ల కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తన కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి గురువారం బయలుదేరి వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు వెళ్లి శుక్రవారం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.
ATP: వెలగపూడి సచివాలయంలో గురువారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గంలోని మూడు మండలాలకు సంబంధించిన కాలువల కల్వర్టులకు సంబంధించిన వివిధ అంశాలను డిప్యూటీ సీఎం దగ్గర ప్రస్తావించారు. నిధులు విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
CTR: బాసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఖాదర్ బాషా తండ్రి బాబాసాహెబ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ఎస్ఆర్ పురం మండల టీడీపీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు తెలిపారు. మృతదేహానికి ఇవాళ నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, బాబాసాహెబ్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో స్కూటీ అదుపుతప్పి కిందపడి జడ్చర్ల నాగసాల గ్రామానికి చెందిన కృష్ణయ్య తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది కృష్ణయ్యకు ప్రథమ చికిత్స నిర్వహించి జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని వద్ద లభించిన సెల్ ఫోను, రూ.50 వేల నగదును భద్రపరిచి కుటుంబ సభ్యులకు అందజేశారు.
E.G: విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూటింగ్ ద్వారా అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ నియామకాల కోసం వివాహం కాని పురుష అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. ఈనెల 13 నుంచి వచ్చేనెల 1వ తేదీ వరకు, Join Indian Army వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయాన్ని అర్హత గల అభ్యర్థులు గమనించాలని సూచించారు.
TPT: వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, తిరుపతి జిల్లాకు చెందిన సూళ్లూరుపేట మున్సిపల్ ఛైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డిని సత్యవేడు నియోజకవర్గ పరిశీలకుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ బలోపేతం మరియు సమన్వయం కోసం ఈ నియామకం చేపట్టినట్లు సమాచారం.
BPT: పర్చూరు మండలం దేవరపల్లిలో రూ. 35 లక్షల వ్యయంతో డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులను గురువారం స్థానిక నాయకులు, అధికారులు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సహకారంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రహదారుల సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు రోడ్ల నిర్మాణం ప్రారంభం కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NLR: మర్రిపాడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి విద్యార్థినులకు మండల సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సిబ్బంది విద్యా సామగ్రి అందించారు. రాబోయే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి విద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
SRD: పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిందనీ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. వెబ్సైట్ www. bse.telangana.gov.in నుంచి విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు. ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్ సేవలు కూడా అందుబాటులో ఉంచామని, 8096958096 వాట్సాప్ నంబరుపై సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.
PDPL: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డిని ప్రకటించిన నేపథ్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ సమక్షంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బీ-ఫాం ప్రక్రియలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర శాసనసభ్యులతో కలిసి వేం నరేందర్ రెడ్డిను అభినందించారు.