AKP: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటవిడుపుగా విజయవాడలో శుక్రవారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. దీనిలో భాగంగా ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ‘లలిత ప్రియా కమలం.. విరిసింది’ అంటూ పాడిన సినీ గేయం ఆకట్టుకుంది. పాట పాడిన ఎమ్మెల్యేను సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభినందించారు.
విశాఖలోని నేవల్ ఆసుపత్రి కల్యాణిలో కంటి వైద్య సేవలను మరింత మెరుగుపరచేందుకు ఆప్తాల్మాలజీ విభాగంలో అధునాతన 3-డి ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ‘Zeiss ARTEVO 850’ను శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సాంకేతికత అందుబాటులోకి రావడంతో కంటి శస్త్రచికిత్సల్లో అధిక ఖచ్చితత్వం, స్పష్టత సాధ్యమవుతుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ASR: రాజముద్రతో ముద్రించిన పట్టా పాసు పుస్తకాల వల్ల, రైతులకు తమ భూమిపై పూర్తి హక్కు లభిస్తుందని పాడేరు ఏఎంసీ ఛైర్మన్ మంగతల్లి అన్నారు. శుక్రవారం కొయ్యూరు మండలం పుట్టకోటలో తహసీల్దార్ పీ.మురళీ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టా పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి 17మంది రైతులకు పట్టా పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.
కడప: జిల్లాలో శుక్రవారం 62 కేంద్రాల్లో సెకండ్ ఇంటర్ జువాలజీ, సివిక్స్ పరీక్షలు జరిగాయి. మొత్తం 6,801 మంది విద్యార్థులకు గాను 6,528 మంది హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 5,659 మందికి 5,453 మంది, ఒకేషనల్ విద్యార్థుల్లో 1,142 మందికి 1,075 మంది పరీక్షలు రాశారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ప్రకాశం: మార్కాపురం ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మానాయక్ ఏఎస్డబ్ల్యూ, ఏఎస్డబ్ల్యూవోలకు జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్స్ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల అకాడమిక్ గ్రేడింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
PPM: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం ఇవాళ జిల్లా కేంద్రానికి రానున్నారని జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారిత అధికారి శ్యామల శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక MPDO కార్యాలయ సమావేశ మందిరంలో అందుబాటులో ఉంటారని, వివిధ ఎస్సీ సంఘాల నాయకులు, ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారని ఆమె తెలిపారు.
KNR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని చింతకుంటలో సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలు ఉత్సాహంగా సాగాయి. 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు న్యాలమడుగు శంకరయ్య, కార్యవర్గ సభ్యులు ఆయనను సన్మానించారు. అనంతరం ప్రదీప్ మాట్లాడుతూ.. మార్చి 8న నిర్వహించే ప్రధాన వేడుకల్లో పాల్గొవాలన్నారు
ELR: జిల్లాలో గతేడాది ఏప్రిల్ 7న ఏలూరు రూరల్ పరిధిలో ఈ అమానుష ఘటన జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆర్ఎంపీ ఎల్లా రత్నప్రసాద్కు న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో శుక్రవారం ఈ తీర్పు వెలువరించింది. బాధితురాలికి రూ. 2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోర్టు సూచించింది.
GNTR: గుంటూరులో కృష్ణా నది నుంచి శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తున్నామని కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు. తాగునీటి నాణ్యతను పరిశీలించేందుకు వార్డు సచివాలయ సెక్రటరీలు, ఏఈలు ప్రతిరోజూ 10 శాంపిల్స్ సేకరించి రిజిస్టర్లో నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)పై శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
PLD: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తుది ఓటరు జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ.. డిప్యూటీ ఎంపీడీవోలు ఎన్నికల సంఘం పోర్టల్లో వివరాలను వెంటనే అప్డేట్ చేయాలని సూచించారు. జాబితా తయారీలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
W.G: రాష్ట్ర మాజీ సాప్ ఛైర్మన్, వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి శుక్రవారం పాలకొల్లులో సందడి చేశారు. మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పెద్ద కుమారుడు సందీప్ వివాహ వేడుకకు ఆయన హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. భీమవరం వైసీపీ ఇన్ఛార్జ్ చినమిల్లి వెంకటరాయుడు, ఏపీ మానవ వనరుల కమిటీ ఉపాధ్యక్షుడు చిర్ల కృష్ణారెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు జానంపేటలో, మధ్యాహ్నం 3 గంటలకు సంకలమద్దిలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో పాల్గొంటారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు మహబూబ్నగర్ ముడా కార్యాలయంలో జరిగే సమీక్షా సమావేశానికి హాజరవుతారని ఆయన వ్యక్తిగత సహాయకులు తెలిపారు.
KMM: ఖమ్మం జడ్పీ సెంటర్లోని నిజాంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న అంధుల ప్రత్యేక పాఠశాలను నిన్న కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించి, అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడ చదువుతున్న విద్యార్థిని భవాని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయగా కలెక్టర్ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆ చిన్నారిని ఆశీర్వదించారు.
NZB: భద్రాచలంలో ఈ నెల 27న జరగనున్న సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే పంపిణీ చేయనున్నట్లు తపాలా శాఖ బోధన్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ తెలిపారు. దేవాదాయ శాఖ సహకారంతో ఈ తలంబ్రాలను స్పీడ్ పోస్ట్ ద్వారా భక్తులకు అందజేయనున్నారు. కళ్యాణ తలంబ్రాల కోసం రూ. 450, ముత్యాల తలంబ్రాల కోసం రూ. 151 చెల్లించలన్నారు.
SRCL: ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు అందించడం ద్వారా ప్రజలకు భరోసా కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజలకు నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించడంలో ప్రభుత్వం సక్సెస్ సాధిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను CM రేవంత్ రెడ్డి నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.