అస్సాం రాష్ట్రంలో బాల్య వివాహాలు చేసుకున్న వేలాది మంది భర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. మైనర్లను వివాహం చేసుకున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవలే సీఎం హిమంత బిశ్వశర్మ హెచ్చరించిన విషయం తెలిసిందే. అటువంటి భర్తలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసులు రోజులో 24 గంటల పాటూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు ఎనిమిది వేల మందిపై కేసులు నమోదు చేశారు.
అలాగే, 2,258 మందిని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్ మరో మూడేళ్లపాటు నిర్వహిస్తూనే ఉంటామని ప్రభుత్వం చెబుతోంది. 14 ఏళ్లలోపు వయసున్న బాలికలను పెళ్లి చేసుకుంటే పోక్సో కింద కేసులు పెడుతున్నారు. అలాగే, ఒకవేళ భర్త వయసు 14 ఏళ్లు ఉంటే అటువంటి బాలుడిని రీఫాం హోంకు తరలిస్తున్నారు. 2026లోగా బాల్య వివాహాలను అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, తమ భర్తల అరెస్టుపై భార్యలు ఆందోళన తెలుపుతున్నారు. ధుబ్రీ జిల్లాలో నిన్న ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళలను వెళ్లగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు.