JGL: రాయికల్ మండలం ఇటిక్యాల ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు ‘జయీభవ-విజయీభవ 2.0’ కరపత్రాలు అందజేశారు. విద్యార్థులకు కలెక్టర్ ఆశీస్సులతో కూడిన పంచ సోపానాల కరపత్రాలు అందజేశారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. హెచ్ఎం సదాశివ్, మాజీ ఎంపీపీ గంగారెడ్డి, లావణ్య, సాయి రెడ్డి, వేణు పాల్గొన్నారు.
WNP: ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం రూ. 26,000కు పెంచుతూ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలని ఏఐటీయూసీ (AITUC) రాష్ట్ర కార్యదర్శి సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తి జీజీహెచ్ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో పడకలు, పనిభారం పెరుగుతున్నా, 14 ఏళ్ల క్రితం నాటి వేతనాలే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
MDK: మహిళా సంఘాల సభ్యుల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ‘వుమెన్ వెల్నెస్ ప్రొఫైల్’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. మహిళలందరికీ అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య రక్షణ కల్పిస్తామన్నరు.
SRPT: ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ రోజుల గడువు గడిచినప్పటికీ కూడా శ్రీరాంరెడ్డి దామోదర్ రెడ్డి శ్రీరాం సాగర్ రెండవ దశ నీళ్లు ఎప్పుడొస్తాయో..?అంటూ ఎదురుచూస్తున్న జిల్లా రైతాంగానికి నీటిపారుదల శాఖ బుధవారం సాయంత్రం చల్లని కబురు అందించారు. ఈ మేరకు జనగామ జిల్లా కొడకండ్ల మండలం బయ్యన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద నీటిని విడుదల చేశారు.
KMR: లింగంపేటలోని మంబోజీపేట్ రైతు వేదిక వద్ద గురువారం అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ తెలిపారు. ఈ సదస్సులో రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, నానో యూరియా వినియోగం ద్వారా పంటల దిగుబడి పెంపు, ఖర్చులు తగ్గించే విధానాలను వివరించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను తెలుసుకుని ప్రయోజనం పొందాలని సూచించారు
SRD: పలుగు మీది నల్ల పోచమ్మ ఆలయం బ్రహ్మోత్సవాలు ఈనెల 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. 12న గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు, 13న శుక్రవారం నల్ల పోచమ్మ–రేణుక ఎల్లమ్మ కళ్యణోత్సవం, అగ్నిగుండాలు, సాయంత్రం బోనాల ఊరేగింపు జరుగుతాయి. 14న శనివారం ప్రత్యేక పూజలతో పాటు జాతర బండ్ల ఊరేగింపు నిర్వహిస్తారు.
NGKL: బిజనపల్లి మండలం మాన్య నాయక్ తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి ఇళ్లను పరిశీలించిన ఆయన, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
HYD: చాంద్రాయణగుట్ట నియోజకవర్గం బండ్లగూడ వద్ద AIMIM ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రాండ్ దావత్ – ఏ-ఇఫ్తార్ విందుకు AIMIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలతో స్థానిక ముస్లింలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మత పెద్దలతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేసి, అందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
NLG: మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మెనూపై జరుగుతున్న ప్రచారంలో భాగంగా బుధవారం మండల తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్ విచారణ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు MRO కేజీబీవీలో బాలికలతో పాటు ప్రత్యేక అధికారి, సిబ్బందిపై విడివిడిగా విచారణ నిర్వహించారు. అనంతరం వండిన అన్నం, కూరగాయలను పరిశీలించారు.
PDPL: రామగుండం సీనియర్ జర్నలిస్ట్ జక్కం మారుతి సతీమణి ప్రేమలత ఇటీవల మరణించగా, ఆమె నేత్రాలను సదాశయా ఫౌండేషన్ ద్వారా కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ కృష్ణానగర్ మారుతి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫౌండేషన్ వారు కుటుంబ సభ్యులకు అభినందన పత్రాన్ని అందజేశారు. ఇద్దరికీ చూపు ప్రసాదించి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.
KNR: డ్రగ్స్, గంజాయి, ఆన్ లైన్ బెట్టింగ్ వంటి అలవాట్లు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, అడిషనల్ డీసీపీ వేంకటరమణ తెలిపారు. డివైఎఫ్ఎ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యువతలో అవగాహన కల్పించేందుకు విడుదల చేసిన కరపత్రాన్ని వారు KNRలో ఆవిష్కరించారు. మత్తు పదార్థాలు, బెట్టింగ్లకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు.
JGL: ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మెట్పల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం రూ.65,07, 540 విలువైన 65 చెక్కులను అందజేశారు. ఈ సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన పథకాల ప్రాముఖ్యతను ఎమ్మెల్యే తెలిపారు.
PDPL: లేబర్ కోడ్లపై సమరశంఖం పూరిస్తూ మార్చి 16న పెద్దపల్లి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు ఐఎస్టీయూ ప్రకటించింది. 11ఏ గని వద్ద మల్లేశం, శేఖర్ పోస్టర్ విడుదల చేశారు. కేంద్రం తెస్తున్న 4 కొత్త చట్టాలు ఏప్రిల్ 1 నుంచి అమలైతే కార్మికుల బతుకులు అంధకారమవుతాయని మండిపడ్డారు. హక్కుల రక్షణ కోసం కార్మికులంతా ఈ పోరాటంలో పాల్గొనాలన్నారు.
KNR: చొప్పదండి పట్టణంలో తమ సంఘానికి 2 గుంటల స్థలం కేటాయించాలని కోరుతూ ప్లంబర్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు బుధవారం వినతిపత్రం సమర్పించారు. 27 ఏళ్లుగా ప్లంబర్స్ అసోసియేషన్ ప్రతి అమావాస్య రోజున చెట్ల కింద సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నామని, తద్వారా ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని పేర్కొన్నారు.
KNR: శంకరపట్నం మండలం మెట్ పల్లి గ్రామంలో మార్చి 10, 11 తేదీల మధ్య రాత్రి సమయంలో 6 ఇళ్లలో దొంగలు తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేశవపట్నం ఎస్సై సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.