JNG: బచ్చన్నపేట మండలం పొచ్చన్నపేట గ్రామ మున్నూరుకాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగినట్లు సంఘం సభ్యులు శనివారం తెలిపారు. అధ్యక్షులుగా జుల కిష్టయ్య, ప్రధాన కార్యదర్శిగా చింతపండు బాలకృష్ణ ప్యానెల్ విజయం సాధించింది. ఉపాధ్యక్షులుగా గోపాల నర్సిములు, సభ్యులుగా ముదం సిద్దయ్య, జుల భాస్కర్లు, సలహాదారులుగా చింతపండు ఆంజయ్య, మట్టి బిక్షపతి, క్రిష్ణలు ఎన్నికయ్యారు.
MDK: చిన్న శంకరంపేట మండలంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. ఖాజాపూర్ సర్పంచ్ బాలస్వామి, ఉపసర్పంచ్ అక్బర్, కాజాపూర్ తండాకు చెందిన ప్రియనాయక్ సహా సుమారు 80 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మైనంపల్లి హనుమంత రావు, మండల నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చారు. రాత్రి హంస వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలు, వీకెండ్ కావడంతో యాదగిరిగుట్టకు భారీగా భక్తులు తరలివచ్చారు.
KMR: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో చీఫ్ సూపరింటెండెంట్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
HNK: ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు పొడిశెట్టి గణేష్ అన్నారు. శాయంపేటలో ఆయన మాట్లాడుతూ… ఉద్యమకారులకు ఇంటి స్థలం, పెన్షన్, ఇతర హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్న వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, స్వరాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్ర కీలకమన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ ఉన్నారు.
BDK: ఇల్లందు నియోజకవర్గం గార్ల గ్రామ పంచాయతీకి మత్స్య శాఖ కింద లైవ్ ఫిష్ వెహికల్ మంజూరు అయింది. శనివారం ఎమ్మెల్యే కోరం కనకయ్య జెండా ఊపి ఆ వాహనాన్ని ప్రారంభించి సంఘం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవాలని లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ADB: తల్లిదండ్రులు ఆడపిల్లల వయస్సును పరిగణనలోకి తీసుకోకుండా బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర అన్నారు. ‘ష్యూర్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బాల్య వివాహ విముక్తి ప్రచార రథం’ శనివారం జిల్లా కార్యాలయానికి చేరుకుంది. చట్ట ప్రకారం వివాహానికి అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండి ఉండాలన్నారు.
KNR: యూరియా వాడకంపై రైతులు అపొహలు వీడి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన మానకొండూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. యూరియాను అధికంగా వాడితే అధిక దిగుబడి వస్తుందనే అపొహ తీసేయాలని అన్నారు.
MBNR: కౌకుంట్ల మండలం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఫిర్యాదు ఇవ్వాలన్నా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం తక్షణమే సొంత పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
KMM: ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి శనివారం జిల్లా కలెక్టర్ అనుదీప్ను కలిశారు. ఆయనకు అదనపు కలెక్టర్ పీ.శ్రీనివాసరెడ్డి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్తో భేటీ అయ్యారు. ఎంపీ నిధుల పనుల పురోగతిపై ఆరా తీశారు. కొత్తగా చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఈజీఎస్ పనులు వేగవంతంగా పూర్తి చేయించాలని సూచించారు.
MHBD: తొర్రూరు మండలంలోని కంటాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని అనుష్క తన అత్యుత్తమ ప్రదర్శనతో రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థిని క్రీడల్లో రాణించి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
MDK: రేగోడ్ కేజీబీవీలో విద్యార్థుల అస్వస్థతకు బాధ్యులుగా ప్రత్యేక అధికారిని సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు అస్వస్థకు గురైతే ఎలాంటి ఫుడ్ పాయిజన్ జరగలేదంటూ రిపోర్టులో పేర్కొనడాన్ని తప్పుపట్టారు.
ఆసిఫాబాద్ జిల్లాలో పలు సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతి పూర్తి చేయాలని కలెక్టర్ హరిత సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో అన్ని విభాగాల అన్ని రకాల అభివృద్ధి పనుల ప్రగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
NRPT: మద్దూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మున్సిపల్ ఛైర్ పర్సన్ సరస్వతి జనార్దన్ తనిఖీ చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న కాంపౌండ్ వాల్ పనులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలపై విచారించి, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్ పావనిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నల్గొండ: శాలిగౌరారం మండలం మాదారం కలాన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అర్వపల్లి నుండి నకిరేకల్ వైపు భైక్పై వస్తున్న ఊట్కూరి వీరయ్య డివైడర్ను ఢీకొట్టడంతో తలకు, చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా అంబులెన్స్ సిబ్బంది వెంటనే చేరుకుని గాయపడిన వీరయ్యను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.