SRD: మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ ఆలయం ప్రాంగణంలో రేకులు షెడ్డు నిర్మాణానికి రూ. 11,115 దాతలు విరాళం ఇచ్చినట్లు ఆలయ ఛైర్మన్ మల్లయ్య నేడు తెలిపారు. హైదరాబాద్లోని బొరబండ ప్రాంతానికి చెందిన M రాజు అమ్మవారి ఆలయ అభివృద్ధికి సహకరించారని చెప్పారు. ఈ సందర్భంగా అర్చకులు దాతకు అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది ఉన్నారు.
KMM: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు 14 ఏళ్లు నిండిన బాలికలకు ప్రభుత్వం ఉచితంగా HPV వ్యాక్సిన్ అందిస్తోందని ఖమ్మం DMHO రామారావు తెలిపారు. ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు తదితర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ టీకా అందుబాటులో ఉందన్నారు. ప్రాణాంతక క్యాన్సర్ బారి నుంచి రక్షణ పొందేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
NRPT: మరికల్ మండలం రాకొండ ఊకచెట్టు వాగు వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపును బుధవారం రాత్రి పోలీసులు, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సీఐ భగవంతు రెడ్డి, ఎస్సై రాము ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు మూడు హిటాచీలు, రెండు టిప్పర్లను సీజ్ చేసినట్లు తెలిపారు.
HNK: ప్రజా పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ చావత్ బాజ్పాయ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అభివృద్ధి పనులు వేగవంతంగా అయ్యేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
GDWL: గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలో మతసామరస్యం వెల్లివిరిసింది. సర్పంచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జామియా మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు సర్పంచ్ను శాలువాతో సన్మానించారు. కులమతాలకు అతీతంగా అందరూ సోదరభావంతో మెలగాలని వారు ఆకాంక్షించారు.
MDK: సింగూరు ప్రాజెక్టు భద్రత, మరమ్మతు పనులను రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూణే CWPRS రిటైర్డ్ ఛైర్మన్, నిపుణుడు విజయ్ త్రింబక్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం ఆనకట్టను సందర్శించింది. ఆనకట్ట రివిట్మెంట్ పనులను పూర్తి స్థాయి నాణ్యతతో చేపట్టాలని అధికారులకు సూచించారు.
PDPL: మంథని పట్టణంలోని కాకతీయ హై స్కూల్ విద్యార్థులు నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి తెలిపారు. NSOలో 200 మంది పాల్గొని 146 మంది రెండో స్థాయికి ఎంపిక కాగా 128 మంది గోల్డ్ మెడల్స్ సాధించారని చెప్పారు. IMOలో 248 మంది పాల్గొని 74 మంది విద్యార్థులు ప్రతిభ చూపారు.
సూర్యాపేట జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతపై హోటల్ యజమానుల సంఘం అత్యవసర సమావేశం మంగళవారం రాత్రి పట్టణంలో నిర్వహించారు. హోటల్ యజమానుల సంఘం జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్యాస్ లభ్యత లేక 200 హోటళ్లు మూతపడే దశకు చేరాయని, రూ.30 లక్షల మేడ నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
NZB: జనగణన విధులను పక్కాగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టరేట్లో ‘సెన్సెస్-2027’ శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు. జనాభా లెక్కల ఆధారంగానే భవిష్యత్తులో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలపై ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎక్కడా తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
BDK: ITDA పీవో బి.రాహుల్ ఆదేశాల మేరకు కిన్నెరసాని (బాలుర) కాంచనపల్లి(బాలికల) క్రీడా పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు ఈనెల 16,17 తేదీల్లో ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆళ్లపల్లి HM శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. సంబంధిత ధ్రువపత్రాలతో కిన్నెరసాని గిరిజన క్రీడా పాఠశాలలో ఉదయం 8:30 గంటలకు హాజరుకావాలని కోరారు.
VKB: వ్యవసాయంలో తెలంగాణ ప్రభుత్వం భారీ సబ్సిడీని ప్రకటించింది. రైతులు డ్రోన్లను కొనుగోలు చేసేందుకు 40 శాతం రాయితీ అందించనున్నట్లు పెద్దేముల్ మండల వ్యవసాయ అధికారి పవన్ ప్రీతం తెలిపారు. మండల కేంద్రాల్లోని రైతు వేదికల ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని ఆయన సూచించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులు అధిక లాభాలు గడించాలని పవన్ ప్రీతం ఈ సందర్భంగా కోరారు.
SRCL: విద్యార్థి జీవితంలో పదవ తరగతి మొదటి మెట్టని, సిరిసిల్ల అర్బన్ మండలం చంద్రంపేట ఉన్నత పాఠశాల హెచ్ఎం కైరి పద్మ అన్నారు. సిరిసిల్ల అర్బన్ మండలం చంద్రంపేట ఉన్నత పాఠశాల ఆవరణలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
NGKL: వంగూరు మండల ఎస్సై మహేష్ మైనర్ల వివాహాలపై బుధవారం కఠిన హెచ్చరికలు జారీ చేశారు. 18 ఏళ్ల లోపు బాలికలు, 21 ఏళ్ల లోపు బాలురకు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని ఆయన స్పష్టం చేశారు. మైనర్లను ప్రలోభపెట్టి వివాహం చేసుకున్నా, లేదా అందుకు సహకరించినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
KMR: కళాభారతి ఆడిటోరియంలో సర్పంచులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి (DPO) మురళి తెలిపారు. గ్రామ పంచాయతీలకు కేటాయించే నిధుల వినియోగం, సర్పంచుల విధులు, బాధ్యతలపై ఈ సమావేశంలో పూర్తిస్థాయి అవగాహన కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచులు ఈ శిక్షణ తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.
WGL: మహిళల సాధికారత, సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న నర్సంపేట మున్సిపల్ ఛైర్మన్ పెండెం లక్ష్మి రామానంద్ను కస్తూర్బా మహిళా మండలి సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కోసం తాను కృషి చేస్తానని ఛైర్మన్ తెలిపారు. మహిళల్లో చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు.