KMM: కల్లంలో ఆరబోసిన మిర్చిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన కామేపల్లి మండలంలో కలకలం రేపింది. గరిడేపల్లికి చెందిన రైతు బానోత్ మత్రు తన మిరప పంటను కోసి, చేను వద్దే ఆరబోశాడు. బుధవారం తెల్లవారుజామున దుండగులు సుమారు 4 క్వింటాళ్ల మిర్చిని ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ.80 వేలు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మహబూబ్ నగర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో 250 ఉద్యోగ ఖాళీల భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలకు నేడు ఉదయం 10:30 గంటలకు జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్సైజ్, పిల్లలమర్రి రోడ్డులోని కార్యాలయంలో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మైత్రి ప్రియ తెలిపారు. టెన్త్, ఆపై చదివిన 18 – 30 ఏళ్ల యువత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డుతో హాజరుకావాలని అన్నారు
ADB: వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన ఘటన నార్నూరులో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని ఎంపల్లి గ్రామానికి చెందిన సెడ్మకి మారుతీరావు(57) బుధవారం మండల కేంద్రంలోని వారపుసంతకు వస్తుండగా ఒక్కసారిగా వడదెబ్బ తగిలింది. ఈ మేరకు ఆయనను కుటుంబ సభ్యులు ఉట్నూర్ ఆసుపత్రికి తరలించగా మారుతీరావు మృతి చెందారన్నారు.
ASF: కాగజ్నగర్లోని పలు హోటళ్లలో ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ ప్రణీల్ కుమార్, శానిటరీ ఇన్ స్పెక్టర్ శంకర్ తనిఖీలు చేశారు. హోటళ్లలో పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం, వ్యర్థాల నిర్వహణను అధికారులు పరిశీలించారు. పరిశుభ్రత పాటించని కొన్ని హోటళ్లకు జరిమానాలు విధించారు. వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించాలని హోటల్ యజమానులకు సూచించారు.
SRCL: తమ డిమాండ్ల సాధనకు సెస్ అసిస్టెంట్ హెల్పర్లు చేపట్టిన నిరవధిక సమ్మె ఉద్ధృతమైంది. 72 గంటల పాటు విద్యుత్ పనుల బహిష్కరణకు పిలుపునిచ్చిన కార్మికులు.. బుధవారం రాత్రి సమ్మె శిబిరంలోనే నిద్రించి నిరసన తెలిపారు. సెస్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన దీక్షా స్థలిలోనే భోజనాలు చేసి, అక్కడే పక్కలు వేసుకున్నారు.
SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టు ద్వారా యాసంగి పంటల సేద్యానికి మూడో విడత సాగు నీటి పారుదల కొనసాగింది. కల్హేర్ మండలం ఇందిరానగర్ వరకు ఉన్న చివరి ఆయకట్టు దాక నీళ్లను పంటలకు అందించనున్నట్లు ప్రాజెక్ట్ AE శ్రీవర్ధన్ నేడు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1493 అడుగులు కాగా, ప్రస్తుతం 1488 అడుగుల వద్ద నీటి లేవల్ ఉందని AE చెప్పారు.
BDK: ఇల్లందు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయినట్లు సహాయ ఎన్నికల అధికారి దంతాల ఆనంద్ తెలిపారు. అధ్యక్ష పదవికి రవికుమార్ నాయక్, కార్తిక్ పోటీ పడుతున్నారు. ఉపాధ్యక్ష పదవికి వల్లభనేని అరుణ ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ దొర.ఎండీ కాసిం బరిలో ఉన్నారు. ఈ నెల 26న పోలింగ్ జరగనుంది.
KMM: ఖమ్మం నగర పాలక సంస్థ ప్రకటించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 6వ రోజు ‘ప్రజా పాలన’ కార్యక్రమం వేగంగా సాగింది. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య వివిధ విభాగాల్లో జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించారు. పౌర సేవల అమలులో నిర్లక్ష్యం వహించకూడదని, కీలకమైన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి పాలనలో వేగం పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు.
NGKL: రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ హైదరాబాద్లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. నరేందర్ రెడ్డి లాంటి నిబద్ధత గల నాయకుడికి ఈ పదవి దక్కడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.
MBNR: దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం తాళ్లగడ్డ పెద్దవాగు వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం వేణు తెలిపారు. ఈ సంఘటనతో అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల చర్యలు మరోసారి స్పష్టమయ్యాయి.
SRCL: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెన్నమనేని వికాస్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు బుధవారం అధికార ప్రతినిధుల జాబితాను విడుదల చేశారు. మాజీ కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడైన వికాస్ రావు గత ఎన్నికలలో వేములవాడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, వేములవాడ ఇన్ఛార్జ్గా ఉన్నారు.
WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ కిరణ్ రాజ్ తెలిపారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, పిల్లల వైద్య నిపుణులు సహా పలువురు వైద్యులు పాల్గొంటారన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
జగిత్యాల పట్టణంలోని టౌన్-3 సెక్షన్ పరిధిలో గురువారం ఉదయం 10.30 గంటల నుంచి ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని జగిత్యాల డివిజనల్ ఇంజనీర్ కె. గంగారాం తెలిపారు. ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల కారణంగా కారణంగా ఎస్పీ కార్యాలయం, వినాయక నగర్, రామాలయం, అంతర్గాం రోడ్ తదితర ప్రాంతాల్లో కరెంట్ ఉండదని అన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు.
NLG: ఈనెల 14 నుంచి జరిగే టెన్త్ పరీక్షల కోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు సెల్ నెంబర్ 9121213504 ను సంప్రదించవచ్చని డీఈవో బిక్షపతి తెలిపారు. అలాగే సందేహాల నివృత్తికి గురువారం ఉ. 10:30 నుంచి 11:30 వరకు ఫోన్ ఇన్ నిర్వహిస్తున్నట్లు, విద్యార్థులు 9121212513, 8498889294, 8309214196 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
MNCL: మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం రాత్రి రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. మృతుని వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉండగా.. పడిగల రజనీ కాంత్, మల్కపల్లి గ్రామం అనే చిరునామా కలిగిన ఆధార్ కార్డు లభ్యమైంది. ముఖం నుజ్జు నుజ్జు కావడంతో గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం ఉంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సంపత్ కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.