BHPL: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరణ తప్పనిసరిగా పెట్టుకోవాలని MLA గండ్ర స్పష్టం చేశారు. గణపురం పోలీస్ స్టేషన్లో చక్రవర్తి హాస్పిటల్, శ్రీకాంత్ మిత్ర బృందం, జర్నలిస్టుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమంలో MLA హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపితే సీజ్ చేయాలని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో SP పాల్గొన్నారు.
NLG: రాష్ట్రవ్యాప్తంగా మోడల్ స్కూల్లో ఆరవ తరగతిలో మొత్తం సీట్లు, 7-10వ తరగతుల్లో మిగిలిన సీట్ల ప్రవేశాల దరఖాస్తుకు నేడు చివరి తేదీ. ఇంగ్లీష్ మీడియంలో విద్య బోధన ఉంటుంది. దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్ కావున ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలిని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ కోరారు.
వనపర్తి జిల్లాలో కేంద్రం ప్రభుత్వం నిర్ణయంతో 15 ఏళ్లలోపు బాలికలకు HPV టీకా అందుబాటులో ఉంటుంది. ఇది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షణనిస్తుంది. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అశ్విని రాధా మాట్లాడుతూ.. బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NZB: రుద్రూర్ మండల పరిధిలోని ఆహార సాంకేతిక కళాశాల వద్ద శుక్రవారం రాత్రి అక్బర్ నగర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మొరం కుప్పను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతూ అక్బర్ నగర్ గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
KMM: ప్రజలకు లబ్ది చేకూరేలా కేంద్ర ప్రాయోజిత పథకాలను జిల్లాలో పూర్తి స్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలనీ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా వచ్చిన వికసిత్ భారత్ జి రామ్ జి పథకం మార్గదర్శకాలు పాటించాలన్నారు.
BHPL: జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని పేర్కొన్నారు. ప్రభుత్వ సిబ్బంది నిరంతరం ప్రజలతో మమేకమై విధులు నిర్వహిస్తారని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు.
HYD: భూమి లోపల పైపులైన్ రిపేరు జరగదు కానీ కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి మాత్రం నిధులు చేరిపోతున్నాయి. పాత లీకేజీల ఫొటోలనే కొత్తవిగా చూపిస్తూ క్షేత్రస్థాయిలో పని చేయకుండానే బిల్లులు డ్రా చేసే ‘ట్రిక్కు’ జలమండలిలో వైరల్ అయ్యింది. సెక్షన్ ఆఫీసర్ల అండదండలతోనే ఈ బోగస్ బిల్లుల దందా సాగుతోంది. థర్డ్ పార్టీ క్వాలిటీ చెక్ పేరుకే తప్ప అంతా కాంట్రాక్టర్లదే నడుస్తోందని విమర్శలు వస్తున్నాయి.
SRD: జిల్లాలో జాతీయ చేనేత అవార్డులకు అర్హులైన వారు మార్చి 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చేనేత శాఖ సహాయ సంచాలకులు వెంకటరావు తెలిపారు. దరఖాస్తుదారులు తాము స్వయంగా మగ్గంపై రూపొందించిన కొత్త డిజైన్లను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ఎక్కడా లేని వినూత్న డిజైన్లకు ప్రాధాన్యత ఉంటుందని, వివరాలకు స్థానిక చేనేత కార్యాలయంలో సంప్రదించాలన్నరు.
NZB: భీంగల్ మండలంలోని బడా భీంగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం మండల స్థాయి ఎస్ఎస్సీ ఇంటర్నల్ మార్క్స్ పరిశీలన బృందం సందర్శించింది. పదవ తరగతి విద్యార్థుల వివిధ విద్యా సామర్థ్యాలను పరిశీలించి, అంతర్గత మార్కులను నమోదు చేశారు. ఈ బృందంలో మచ్కూర్ పాఠశాల హెడ్మాస్టర్ హఫీసుద్దీన్, ఉపాధ్యాయులు మారుతి పాల్గొన్నారు.
SRCL:108 అంబులెన్స్, 102 అమ్మఒడి వాహనాలలో అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఉమ్మడి KNR 108 ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్, సిరిసిల్ల జిల్లా మేనేజర్ అరుణ్ కుమార్ అన్నారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం వారు అత్యవసర వాహనాలను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులను తరలించే సమయంలో ప్రథమ చికిత్సకు అవసరమయ్యే మందులు ఉండాలన్నారు.
SDPT: ప్రభుత్వం నియమించిన విద్యా కమిటీలో నిజమైన విద్యా వేత్తలు ఎందరున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ‘X’ వేదికగా ప్రశ్నించారు. కమిటీ ఛైర్మన్గా ఒక ఇంజినీర్, సభ్యులుగా మాజీ ఐఏఎస్ అధికారులను నియమించారని, పాఠ్యాంశాల రూపకల్పనలో నైపుణ్యం ఉన్న ఒక్క సభ్యుడైనా ఉన్నారా అని నిలదీశారు.
JGL: సీఎం కప్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులను, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభినందించారు. జగిత్యాలకు చెందిన హర్షిత్, కృష్ణ గోల్డ్ మెడల్, అక్షయ్ సిల్వర్ మెడల్, కనిష్క్ బ్రాంజ్ మెడల్ సాధించగా, ఎమ్మెల్యే వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. డీవైఎస్వో రవికుమార్, సమిండ్ల శ్రీనివాస్, రాజారెడ్డి, లు అభినందించారు.
NGKL: కుమ్మెర ఘటన నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ న్యాయ పోరాట ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రం సమర్పించారు. జాతర ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్న సర్పంచ్ తుకారం రెడ్డిని తక్షణమే భర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామంలోని ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయాలని కోరారు.
ADB: గిరిజన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. నిన్న రాత్రి పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్టీల సామాజిక, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
MDK: జిల్లాలో గత 9 నెలల్లో వివిధ రంగాలకు రూ.4,611 కోట్ల రుణాలను పంపిణీ చేసి, వార్షిక లక్ష్యంలో 67.32 శాతం పూర్తి చేశామని అడిషనల్ కలెక్టర్ నగేష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. రైతులకు, మహిళా సంఘాలకు రుణాల పంపిణీలో పెద్దపీట వేశామన్నారు.