MBNR: జిల్లాలోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. హాజరైన ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ.. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యతే కాదని, ప్రతి పౌరుడు నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన అవసరమని పేర్కొన్నారు.
KNR: జమ్మికుంట రైతు ప్రగతి ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘంకు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం “కో ఆపరేటివ్ ఎక్సలెన్స్ & మెరిట్-2025” అవార్డు లభించింది. దీనిని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ అవార్డును హైదరాబాద్ లోని టెస్కాబ్లో వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్ చేతుల మీదుగా FPO ప్రెసిడెంట్ మహేందర్ స్వీకరించారు.
WGL: ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రభుత్వం 100 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ఆర్టీసీ, రెవెన్యూ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ హితమైన రవాణా సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
JN: ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాన్ని(EHS) ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు, డీఏలను తక్షణమే చెల్లించాలని కోరారు. పీఆర్సీ నివేదికను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేయకూడదని స్పష్టం చేశారు.
HNK: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధ్యక్షతన శుక్రవారం సివిల్ సప్లైస్ విజిలెన్స్ కమిటీ సమావేశం జరిగింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు తరచుగా దాడులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ విభాగం క్షేత్రస్థాయిలో నిఘా పెంచాలని సూచించారు. సమావేశంలో అ.కలెక్టర్ రవి, DCSO వాజిద్ అలీ, కమిటీ సభ్యురాలు అనిత రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
WGL: కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు భద్రత కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ప్రమాదాల తగ్గింపు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ప్రమాదాల ప్రదేశాలను గుర్తించి హచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అంకిత్ కుమార్, AJC సంధ్యారాణి పాల్గొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పాలనాధికారులు (కలెక్టర్లు) ముగ్గురూ మహిళలే కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి కలెక్టర్గా ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్గా హైమావతి ఉండగా తాజాగా జరిగిన కలెక్టర్ల బదిలీలో మెదక్ కలెక్టర్గా ప్రతిమా సింగ్ నియమితులయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిపాలనలో మహిళల చేతిలో ఉంది.
ADB: మహిళా సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారై అన్ని రకాల విధుల్లో సమర్థంగా పాల్గొనాలని SP అఖిల్ మహాజన్ ఆకాంక్షించారు. జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో 3 రోజుల పాటు నిర్వహించిన మహిళా సిబ్బంది మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళలు పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్క విధులకు పూర్తి సంసిద్ధతతో ఉండాలని కోరారు.
VKB: మే 10 నుంచి జూన్ 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జనగణన సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో తమకు సూపర్వైజర్లుగా విధులు కేటాయించాలని కుల్కచర్ల తహాశీల్దార్ మనోహర్ చక్రవర్తికి శుక్రవారం PSHMA జిల్లా అధ్యక్షుడు తుప్పలి ఆనంద్ కుమార్ నేతృత్వంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నరేష్, వీరేశం, తౌర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
SDPT: మద్దూరు మండలం లద్నూర్ గ్రామానికి చెందిన ఆలేటి మహేష్(28) శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మహేష్, తీవ్ర మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై అసిఫ్ ఆధ్వర్యంలో ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
SRD: దేశం కోసం రాహుల్ గాంధీ బాధ్యత గల ప్రతిపక్ష నేతగా విలువైన సూచనలు ఇస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ఇచ్చే సలహాలను ప్రధాని మోదీ వింటున్నారే తప్ప, అమలు చేయడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఆ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
HYD: నగర యువతలో ఇప్పుడు ‘అప్సైక్లింగ్’ ఒక మతంలా మారుతోంది. మురికివాడల్లో పారేసిన టైర్లు, విరిగిన ప్లాస్టిక్ డబ్బాలను సేకరించి వాటిని లగ్జరీ ఫర్నీచర్గా మార్చి ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఇది కేవలం వ్యాపారం కాదు.. పర్యావరణం మీద వారికున్న ‘యూనిక్’ ప్రేమ. పాత సామన్ల మార్కెట్ (జుమ్మెరాత్ బజార్) వీరి పాలిట ఇప్పుడు ఒక ఐడియా బ్యాంక్గా మారింది.
MBNR: పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మేయర్, కార్పొరేటర్లు సమన్వయంతో పనిచేస్తూ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
MLG: గోదావరి పుష్కరఘాట్ల ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని పుష్కరఘాట్లను శుక్రవారం పరిశీలించారు. జూలై 2027లో నిర్వహించనున్న గోదావరి నది పుష్కరాల సందర్భంగా ములుగు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పుష్కరఘాట్ల నిర్మాణాల పనులు ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే అందించాలన్నారు.