KNR: 99 రోజుల కార్యాచరణపై స్థానిక ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించాలని సీఎస్కే.రామకృష్ణారావు తెలిపారు. మంగళవారం సీఎస్ కె.రామ కృష్ణా రావు ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి ఈ కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా హాజరయ్యారు.
SDPT: ABVP స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలు, చెత్తను ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు కలిసి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడడం వల్ల ప్రకృతి తీవ్రంగా నష్టపోతుందని పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు.
SRPT: మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చింతకాయల అరుణ్ తన గొర్రెల మందను చెరువు వద్దకు నీరు తాగించడానికి తీసుకువెళ్లగా, విద్యుత్ షాక్తో 23 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. చెరువులో వ్యవసాయ మోటార్లకు ఉన్న విద్యుత్ వైరు నీళ్లలో పడి చెరువు నీటిలో విద్యుత్ సరఫరా కావడంతో ఈ ఘటన జరిగింది.
HYD: చార్మినార్ టాస్క్ ఫోర్స్, అంబర్పేట పోలీసులు 2వ భార్య హత్య కుట్రను ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అరుణ్ తన 2వ భార్యపై అనుమానంతో హత్య చేయడానికి పథకం వేశాడు. మహమ్మద్ అబ్బు, మీర్ ముజమ్మిల్ అలీ ఖాన్ సహకారంతో బీహార్ నుంచి దేశవాళీ పిస్టల్, 6 రౌండ్లు, మ్యాగజైన్ కొనుగోలు చేశాడు. 9న అలీ కేఫ్ వద్ద సమావేశమైన సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు.
KMM: ఖమ్మం భూదాన్ భూముల వివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు, ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేందుకు బాధితులకు ప్రభుత్వం సహకరించనుంది. ఈ నిర్ణయం భూదాన్ భూముల వివాదంలో బాధితులకు ఊరట కలిగించే పరిణామం.
జగిత్యాలలో అన్ని ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు కలెక్టర్ సత్యప్రసాద్ పరీక్షలపై దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. వారిని ఎలాంటి స్ట్రెస్కు గురి కావద్దని, అదేవిధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలకు సన్నద్ధం కావాలని జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే, మంచి ఆహారం తీసుకోవాలని, ఫోన్లు, టీవీలకు దూరంగా మంచిగా ప్రిపేర్ కావాలన్నారు.
BHPL: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఐడీవోసీ కార్యాలయంలో మెడికవర్, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరై మాట్లాడుతూ.. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి ఉన్నారు.
NRPT: నర్వ మండలం లక్కర్ దొడ్డి గ్రామ రహదారి పక్కన ఉపాధి హామీ పథకం కింద నాటిన మొక్కలు రక్షణ లేక మంటల్లో కాలిపోతున్నాయని గ్రామస్థులు తెలిపారు. మొక్కల చుట్టూ భద్రతా చర్యలు లేకపోవడంతో అజాగ్రత్తగా వేసే మంటలు వాటిని దహనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
RR: చేవెళ్ల ఆర్డీవోగా ఇటీవల పార్థసింహరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రావులపల్లి సర్పంచ్ రామచంద్రయ్య గౌడ్ మంగళవారం ఆర్డీవోను మర్యాదపూర్వకంగా కలిశారు. వారు మాట్లాడుతూ.. నూతన బాధ్యతల్లో ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అనూష అంజన్ కుమార్, పీఏసీఎస్ డైరెక్టర్ నరేందర్, నాయకులు పాల్గొన్నారు.
MHBD: కొత్తగూడ మండల కేంద్రంలోని మండల పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాల (MPUPS)లో మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి.. పాఠశాల బాధ్యతలను స్వీకరించి తమదైన శైలిలో రాణించారు. విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో ముస్తాబై తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.
HNK: హసన్పర్తి మండలం చింతగట్టు క్యాంపు వడ్డెర కాలోని గ్రామంలో పల్లెబోయిన కుమారస్వామి ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేశారని సమాచారం మేరకు మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 66 క్వింటాళ్ల రూ. 2,31,000 విలువగల రేషన్ బియ్యం పట్టుబడింది. అక్రమంగా నిల్వ చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.
NZB: నసురుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్పల్లి ZPHS పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు నంద్యాల శ్రీనివాస్ (మ్యాథ్స్)ను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు DEO రాజు నేడు సస్పెండ్ చేసినట్లు MEO చందర్ తెలిపారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు నంద్యాల శ్రీనివాస్ మ్యాథ్స్, రామోజీ శ్రీనివాస్ ఇద్దరు గొడవపడిన విషయంలో పోలీస్ కేసు నమోదు చేశారు.
KMR: బిచ్కుంద ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ రోగి విషయంలో జరిగిన నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కఠిన చర్యలు చేపట్టారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్ భరత్ను సస్పెండ్ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాళిదాస్కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. విధుల్లో అలసత్వం వహించిన డయాలసిస్ టెక్నీషియన్ లక్ష్మణ్ సేవలను తొలగించాలని ఆదేశించారు.
GDWL: పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ మినీ డైరీ పథకం కింద ఎంపికైన 44 మంది రైతులు గేదెల కొనుగోలు కోసం ఉత్తరప్రదేశ్ వెళ్తున్న వాహనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు.
SDPT: అక్బర్పేట – భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నట్లు సర్పంచ్ మాధవనేని భాను ప్రసాద్ తెలిపారు. మంగళవారం డ్వాక్రా మహిళా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళల ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ స్టీల్ బ్యాంక్ మరియు టెంట్ హౌస్ నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకే అప్పగిస్తున్నట్లు వెల్లడించారు.