MHBD: ఈనెల 25వ తేదీన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నూతన పార్టీ ఆవిర్భావం సందర్భంగా బహిరంగ సభ ఉంటుందని, సభకు జిల్లా నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని జాగృతి అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. మహబూబాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విప్లవాత్మకమైన మార్పులతో జాగృతి పార్టీ ప్రజల ముందుకు రాబోతుందన్నారు.
MDCL: మచ్చ బొల్లారంలోని స్వయంభూ, సంజీవని ఆంజనేయ ఆలయాలలో శనివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా పారాయణం చేసి సంస్కృతి, దేశ రక్షణకు కట్టుబడాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పూజారి దక్షిణమూర్తి, భక్తులు పాల్గొన్నారు.
HNK: GWMC 17వ డివిజన్ పరిధిలో చేపడుతున్న సిసి రోడ్ల నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ గద్దే బాబు పరిశీలించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తిచేయాలని, 17వ డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
BHNG: ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం పిలుపునిచ్చారు. మండల అధ్యక్షుడు మేకల్ రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విగ్రహాలను శుభ్రపరచి, ‘పంచతీర్థాల’ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని సూచించారు.
ములుగు పట్టణంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా హెల్త్ వీక్ సందర్భంగా “డ్రగ్స్ కంట్రోల్ & రెగ్యులేటరీ స్ట్రెంగ్తనింగ్ డే” కార్యక్రమం శనివారం నిర్వహించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మందులు తప్పనిసరిగా డాక్టర్ సూచనల మేరకే వాడాలని సూచించారు. యాంటీబయోటిక్స్ దుర్వినియోగం వల్ల యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ప్రమాదం పెరుగుతుంది.
WGL: ఖానాపూర్ మండలం కొత్తూరు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈనెల 12న సాయంత్రం 4 గంటలకు విగ్రహావిష్కరణ జరుగనుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జై భీమ్ యువజన సంఘం నాయకులకు పిలుపునిచ్చారు.
WNP: పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవుతుందంటూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేతపై ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పీ. శివకుమార్ విమర్శించారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు.
SRPT: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవాలని ఎస్పీ నరసింహ సూచించారు. 13వ తేదీ నుంచి వారం పాటు జిల్లావ్యాప్తంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటివి ప్రాణాంతకమని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
RR: ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నందిగామ మండలం చేగూరు గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. యువత టోర్నమెంట్లో పాల్గొనడానికి ఉత్సాహం కనబరిచారు. యువతలో దాగిఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయని క్రీడాకారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
NLG: స్థానిక చేనేత సహకార సంఘం ఎన్నికల నేపథ్యంలో కొత్త సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తగా చేరే వారు తమ ఆధార్ జిరాక్స్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, రూ. 300 ఫీజుతో దరఖాస్తు చేసుకోవాలని సంఘం సూచించింది. ఈనెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో గడువు ఉంటుందని, కొత్త సభ్యులకు రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు.
JGTL: గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్పై కఠిన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మైనర్గా వాహనాలు నడుపుతున్న ఐదుగురిని గుర్తించి వాహనాలను సీజ్ చేశారు. అనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ADB: ఈ నెల 13న ఉట్నూర్ మండలం నర్సాపూర్ (జె) గ్రామంలో నిర్వహించనున్న మెగా మెడికల్ క్యాంప్ ను విజయవంతం చేయాలని ఉట్నూర్ సీఐ సర్పంచ్లకు సూచించారు. శనివారం పోలీస్ స్టేషన్లో సర్పంచ్లతో సమావేశం నిర్వహించారు. ఈ శిబిరానికి రాష్ట్ర డీజీపీతో పాటు జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతారని, 15 మంది నిపుణులైన వైద్యులు సేవలందిస్తారని తెలిపారు.
SRCL: రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తామని సిరిసిల్ల సూపరింటెండెంట్ ఇంజనీర్ బిక్షపతి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో ప్రజల వద్దకే విద్యుత్ అధికారులు అనే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ.. గతంలో విద్యుత్ వినియోగదారులు రూ. 20వేల నుంచి 60 వేల వరకు ఉన్న ఓఆర్సీ చార్జీలను రద్దు చేశామన్నారు.
SDPT: సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. బెజ్జంకి మండలంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో సమావేశమై అవగాహన కల్పించారు. ఒక్క కెమెరా వంద మంది పోలీసుల పనిని చేస్తుందన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐ ఎం.శ్రీను, ఎస్సై సౌజన్య పాల్గొన్నారు.
GDWL: పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఈనెల 14న నిర్వహించనున్న జార్జ్ రెడ్డి వర్ధంతి సభను జయప్రదం చేయాలని ఆ సంఘం గద్వాల జిల్లా అధ్యక్షుడు హరీశ్ పిలుపునిచ్చారు. శనివారం మల్దకల్ ఎస్సీ బాలుర వసతి గృహంలో సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా అరుణతార జార్జ్ రెడ్డి పీడీఎస్యూను స్థాపించి, విద్యార్థి ఉద్యమంలో నూతన చైతన్యాన్ని నింపారన్నారు.