KMR: రాందాస్ అగర్వాల్ జయంతిని పురస్కరించుకుని ఐవీఎఫ్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో వైశ్య ఏక్తా దివాస్ మంగళవారం రాత్రి నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా వైశ్యులను ఏకం చేయడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని నాయకులు కొనియాడారు. అనంతరం గోశాలలో గోవులకు పశుగ్రాసం పంపిణీ చేసి తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. వైశ్యుల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
GDWL: ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ గద్వాల జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నరసింహ పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ధర్నా, వంటావార్పు నిర్వహించారు. అనంతరం కొత్త కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇచ్చారు.
MBNR: ఉమ్మడి జిల్లాలో 74 కస్తూర్బా గాంధీ పాఠశాలలు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 15 పాఠశాలలు. వీటిలో కొన్నింటిని ‘యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్’ శిక్షణ కోసం అధికారులు ఎంపిక చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా 20, వనపర్తి 14, జోగులాంబ గద్వాల జిల్లా 12, నారాయణపేట జిల్లాలో 13 పాఠశాలలు ఉన్నాయి. ఇంటర్ ప్రవేశాల కోసం నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు.
NLG: నకిరేకల్ సమీపంలోని జాతీయ రహదారి 65పై ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ టైరు పగిలి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడగా నకిరేకల్ పోలీసులు క్లియర్ చేశారు.
HYD: ఎల్బీనగర్, ఉప్పల్ జోన్ ప్రాంతాల వారికి అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. వనస్థలిపురం సచివాలయ నగర్లో స్విమ్మింగ్ పూల్ ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపారు. రూ. 500 పెడితే నెలరోజుల పాటు స్విమ్మింగ్ చేయొచ్చని పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు 10 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న అందరికీ ఎంట్రీ ఉంటుంది. ఉదయం 10గంటల నుంచి 11గంటల వరకు ప్రత్యేకంగా మహిళలకు ఉంటుంది.
NGKL: లింగాల మండల కేంద్రంలో గల రైతు వేదికలో జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా ప్రకృతి వ్యవసాయంపై మండల వ్యవసాయ అధికారి అనిల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అప్పాయిపల్లి, శాయిన్ పేట గ్రామాలకు చెందిన రైతులకు ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు ప్రత్యేకంగా రూపొందించిన కిట్లను పంపిణీ చేశారు.
MLG: వెంకటాపురం మండలం సుడిబాక గ్రామానికి చెందిన మడప భాస్కర్ (27)కు విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న రాత్రి పొలం వైపు వెళ్తుండగా జంతువుల వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు విచారణ చేపట్టారు.
KMM: పెనుబల్లి మండలం తాళ్లపెంట సమీపంలో విద్యుత్తు తీగలతో అడవిపందిని వేటాడుతున్న ముగ్గురు వ్యక్తులను తల్లాడ రేంజ్ అటవీ అధికారులు ఇవాళ తెల్లవారుజామున అరెస్టు చేశారు. వారి నుంచి 60 KGల మాంసం రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు రేంజ్ అధికారి ఉమ తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారవ్వగా పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
SRD: బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన ఆదిత్య (17) మియాపూర్లో నివసిస్తూ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం మల్లంపేటలో బంధువుల ఇంటికి వచ్చి, స్నేహితులతో కలిసి కాజిపల్లి శివారులోని కంకర క్వారీలో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
PDPL: సింగరేణి ఆర్జీ-1 ఏరియా పరిధిలోని ఆర్సీఓఏ క్లబ్లో ఈనెల 19న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరంలో ఆయుర్వేద నిపుణులు విశ్వనాధ మహర్షి పాల్గొని బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు, థైరాయిడ్ వంటి వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని నిర్వహకులు తెలిపారు.
MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఉగాది పండుగ వేడుకలు నిర్వహిస్తున్నామని శాఖ అధిపతి మన్నెమోని కృష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపకులపతి శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని సూచించారు.
KNR: తెలంగాణ సహకార శాఖ గెజిటెడ్ అధికారుల డైరీ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సహకార భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సహకార అధికారి ఎస్.రామానుజాచార్య ముఖ్య అతిథిగా హాజరై డైరీని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. శాఖ చరిత్ర, ముఖ్య సమాచారం, ఉపయోగకరమైన వివరాలతో డైరీని రూపొందించినట్లు తెలిపారు. సహకార రంగ అభివృద్ధికి ఉద్యోగులు సమష్టిగా పనిచేయాలన్నారు.
HNK: ఆత్మకూర్ మండలంలోని బాలల సంరక్ష సేవా కేంద్రాలను జిల్లా కలెక్టర్ చావత్ బాజ్ పాయ్ సందర్శించారు. శిశు గృహాలలోని సదుపాయాలు, బాలల సంరక్షణ, పోషణ, ఆరోగ్య పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. చిన్నారుల అభివృద్ధి కోసం అధికారులు పనిచేయాల్సిందిగా సూచించారు.
SRD: జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమ్మ గూడెం ఎల్లమ్మ జాతర సందర్భంగా నిర్వహించిన పలారం బండి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు వడ్డె కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
JGL: చెగ్యాం రైతు వేదికలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు 125 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయం పద్ధతులు, ప్రయోజనాలను వివరించారు. అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉపసర్పంచ్, వ్యవసాయ అధికారి సాయి కిరణ్, అధికారులు పాల్గొన్నారు.