KMM: పాలేరు నియోజకవర్గ పరిధిలోని రాజేశ్వరపురం, పాలేరు గ్రామాల్లో ఎక్సైజ్ పోలీసులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రాజేశ్వరపురంలో 2 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హేమలత వెల్లడించారు. అక్రమ మద్యం రవాణా, సారా తయారీపై ఉక్కుపాదం మోపుతామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
HNK: క్షయవ్యాధిని నిర్మూలించడం మన అందరి బాధ్యతని, ప్రతిఒక్కరు టీబీని అంతం చేయడంలో భాగస్వాములు కావాలని జిల్లా క్షయ నియంత్రణ అధికారి డా.హిమబిందు అన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మార్చి-24 ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా మంగళవారం నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో క్షయ వ్యాధి అవగాహన సదస్సు నిర్వహించారు. హిమబిందు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
వరంగల్ 29వ డివిజన్ రామన్నపేటలో రెండేళ్ల చిన్నారి పై మంగళవారం వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అమ్మమ్మతో కలిసి కిరాణా షాపుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో బాలిక ఎడమ మోచేయి పై భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
MLG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా ములుగు (M) కాశీందేవిపేట గ్రామంలో నిర్వహిస్తున్న పరిశుభ్రత కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు స్వచ్ఛతకు సహకరించి, చెత్తను సరైన చోట వేయాలని, గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు.
NZB: ఏప్రిల్ 2న జిల్లాలోని NZB, బోధన్, ఆర్మూర్లలో నిర్వహించే హనుమాన్ జయంతి వేడుకలకు అనుమతి ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ (VHP) నాయకులు కోరారు. NZB CP సాయి చైతన్యను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో VHP విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, ప్రాంత గోరక్ష కృషి సంపర్క ప్రముఖ్ దాత్రిక రమేశ్ పాల్గొన్నారు.
KMM: నగరంలోని ప్రభుత్వ పశువైద్యశాల ఆవరణలో మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక చొరవతో గ్రామీణ జీవనం, పశువుల సంరక్షణను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కళాత్మక గోడ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాల ద్వారా పశువైద్యశాలకు వచ్చే రైతులకు, పశుపోషకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే కాకుండా, గ్రామీణ సంస్కృతిపై అవగాహన పెంచేలా సుందరీకరించారు.
మఠంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న సమాచార హక్కు రక్షణ చట్టం 2005, 5వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపాటి సందీప్ పిలుపునిచ్చారు. మంగళవారం మఠంపల్లి కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ పోస్టల్ ఆవిష్కరణను స్థానిక నాయకుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
MDK: జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న రెండు స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ (సెకండ్ క్లాస్) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయమూర్తి నీలిమ తెలిపారు. రిటైర్డ్, రాజీనామా చేసిన జ్యుడీషియల్ అధికారులు దీనికి అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
WGL: కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని BJP నర్సంపేట పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్ డిమాండ్ చేసారు. బీజేపీ రాష్ట్రశాఖ పిలుపుమేరకు మంగళవారం నర్సంపేట MRO కార్యాలయం ఇన్ఛార్జ్ సినీయర్ అసిస్టెంట్ సాయికృష్ణకు నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వం త్వరగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే BJP ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామన్నారు.
SRCL: వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. యాసంగి సీజన్ (2025-26) ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
BHPL: జిల్లా SP సంకీర్త్ గౌడ్ ఆదేశాల మేరకు BHPL జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.75 వేల విలువైన ఒక కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు CI నరేష్ కుమార్, SI సాంబమూర్తి తెలిపారు. వారిపై కేసు నమోదు చేశారు.
MHBD: గ్రామపంచాయతీ కార్మికులు తలపెట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమం నేపథ్యంలో మంగళవారం తొర్రూరు మండల వ్యాప్తంగా పలువురు కార్మికులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ కార్మికులు స్టేషన్ ఆవరణలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
PDPL: ధర్మారం శివారులో కిషన్ రావు పేటకు చెందిన గుమ్మడి వెంకటేష్ (37) నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. KNR ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించాడు. కాగా, వెంకటేష్ దుబాయ్ వెళ్లి తాగుడుకు బానిసయ్యాడని, అప్పులు పెరగడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.
SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం మహా లింగార్చన ఘనంగా నిర్వహించారు. మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పరివార దేవతల అర్చనలు నిర్వహించారు. మహా లింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించారు. ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ADB: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టే మహాధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు ప్రవీణ్ మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం ఆదిలాబాద్లో ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ పోరాటంలో మాదిగలు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.