నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని అనురాధ అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ అత్యవసర సమయంలో ఆమె కుటుంబానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు భారతి రూ. 18 వేల ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు. వారు మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఉన్న విద్యార్థిని అనురాధ త్వరగా కోలుకుని, మళ్లీ పాఠశాలకు హాజరై తన విద్యాభ్యాసాన్ని విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు.
MDK: రామాయంపేటలోని పెద్ద మసీదులో ముస్లింలు కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి, మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజుల ఆధ్వర్యంలో ఈ విందు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గంగా జమున తహజీబ్కు ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుందని తెలిపారు.
PDPL: ఎలిగేడు మండల కేంద్రంలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ అధికారులు ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ఎరువుల యాప్ వాడకం, సేంద్రియ వ్యవసాయం, డ్రోన్ వాడకంపై అవగాహన కల్పించారు. రైతులకు సాయి హెల్త్ కార్డులు, సేంద్రియ వ్యవసాయ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమలో MAO ఉమాపతి, AEO సురేష్, రైతులు పాల్గొన్నారు.
ASF: అసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి వికారాబాద్ కలెక్టర్గా పదోన్నతిపై వెళ్తున్న సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలికారు. కలెక్టర్ హరిత మాట్లాడుతూ.. జిల్లాలో అదనపు కలెక్టర్గా, ఇంఛార్జ్ DEOగా ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. అధికారులందరు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించారని ప్రశంసించారు. అనంతరం దీపక్ తివారిని శాలువా, జ్ఞాపికతో సన్మానించారు.
SRCL: బీసీ నేతల ఎదుగుదలను ఓర్వలేకనే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అసెంబ్లీలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్పై ఆరోపణలు చేశారని రాజన్న ఆలయ మాజీ ధర్మకర్త సగ్గు పద్మ అన్నారు. చేతికున్న వాచ్ను కోట్ల రూపాయలు అంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. బీసీ సమాజానికి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని మంగళవారం ఓ ప్రకటన ద్వారా ఆమె డిమాండ్ చేశారు.
JGL: ఎండపల్లి మండలంలో 2025-26 యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి మహేశ్ తెలిపారు. కొత్తగా పట్టాదార్ పాస్బుక్ పొందిన రైతులు 28-02-2026 వరకు డిజిటల్ సంతకం పూర్తి చేసిన వారు, ఇంతకుముందు పాస్బుక్ ఉన్నప్పటికీ దరఖాస్తు చేయని రైతులు, అలాగే బ్యాంకు ఖాతా మార్చుకోవాల్సిన వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ADB: ఉట్నూర్ మండలంలోని రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ సంతోష్ను ఐటీడీఏ ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ సభ్యులు కలిశారు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం జీవో నెం. 3 స్థానంలో జీవో 18ను వెంటనే తీసుకురావాలని విన్నవించారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు రాజేశ్, సోమేశ్ తెలిపారు.
SDPT: హుస్నాబాద్ బస్టాండ్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కొండ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని తెలిపారు. ఇళ్లు, దుకాణాల వద్ద కెమెరాలు ఏర్పాటు చేస్తే భద్రత మెరుగుపడుతుందని చెప్పారు. కెమెరాల ద్వారా నేరాలను త్వరగా గుర్తించి దర్యాప్తు సులభమవుతుందని వివరించారు.
KNR: కరీంనగర్ నగరంలో వీధి దీపాల నిర్వహణ సక్రమంగా ఉండాలని కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ప్రధాన రహదారులు, పలు డివిజన్లలో ఆయన పర్యటించి దీపాల వెలుగులను పరిశీలించారు. ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండాలని, వెలగని చోట వెంటనే కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
MDK: అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పనలో జనాభా గణన కీలక పాత్ర పోషిస్తుందని మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన అధికారుల శిక్షణా తరగతుల ముగింపులో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి జనగణన ఇదని, 2021లో జరగాల్సిన ఈ ప్రక్రియ కోవిడ్ వల్ల ఆలస్యమైందన్నారు. ప్రతి ఒక్కరి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆయన పూచించారు.
ASF: రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్ని, ఆసిఫాబాద్ మాజీ MLA ఆత్రం సక్కు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జిల్లాలోని అడా ప్రాజెక్టు మరమ్మతుల గురించి వట్టివాగు, చెల్మెల, అమ్మనమడుగు (కేస్లాగూడ ) ప్రాజెక్టుల ప్రధాన కాలువల ఆధునీకరణ గురించి చర్చించారు. పలు మండలాల్లో గతంలో చేసిన సర్వే పూర్తి చేసిన నూతన చెరువులు మంజూరు చేయాలని కోరారు.
MBNR: జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. మొబైల్ యాప్లు, వెబ్ పోర్టల్లను ఉపయోగించి గణన ప్రక్రియను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టలు ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
SDPT: అకాల గాలి దుమారంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తోగుట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి డిమాండ్ చేశారు. వెంకటరావుపేటలో మొక్కజొన్న చేలు నేలకూలి, మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి రైతులకు తగిన పరిహారం అందించాలని కోరారు.
MNCL: పారదర్శకమైన ఓటర్ జాబితా రూపకల్పన కోసం రాజకీయ పార్టీలు BLASను నియమించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. నస్పూర్ కలెక్టరెట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో త్వరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభం కానుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అందరు సహకరించాలన్నారు.
ADB: ఉట్నూర్ మండలంలోని లింగోజి తండా ఎక్స్ రోడ్ వద్ద ‘పీఎం స్వనిధి 2.0’ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆదిలాబాద్ ఎల్డీఎం ఉత్పల్ మాట్లాడుతూ.. వీధి వ్యాపారులు ఎస్బీఐ ద్వారా అందించే రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. తక్కువ వడ్డీతో లభించే ఈ రుణాలతో వ్యాపారాలను వృద్ధి చేసుకోవాలని కోరారు.