RR: షాబాద్ మండల ఎంపీడీవో కార్యాలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇవాళ కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం షాబాద్ మండల కేంద్రం & శంకర్పల్లి మండలంలో మైనారిటీ సోదరులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని రంజాన్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు.
HYD: బండ్లగూడలోని గోదాముల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేపట్టారు. అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గృహవినియోగ సిలిండర్ల గ్యాస్ను వాణిజ్య సిలిండర్లలోకి నింపుతున్నట్లు గుర్తించారు. 96 డొమెస్టిక్ సిలిండర్లు, 58 వాణిజ్య సిలిండర్లు, 50 చిన్న సిలిండర్లు, గ్యాస్ రీఫిల్లింగ్ చేసే 4 యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
SRPT: కోదాడ పట్టణంలో రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి అన్నారు. మంగళవారం ప్రధాన రహదారులపై అనధికారికంగా ఏర్పాటు చేసిన దుకాణాలు, బోర్డులు, షెడ్లు వెంటనే తొలగించాలని వ్యాపారులకు సూచించారు. ఇప్పటికే పలువురు దుకాణదారులకు నోటీసులు జారీ చేసి, స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలని అన్నారు.
WNP: అల్లాహ్ ఆశీస్సులతో ప్రతి కుటుంబానికి శాంతి, సంతోషం కలగాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆకాంక్షించారు. కొత్తకోట ఖాద్రియా మజీద్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందులను అందజేస్తూ ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడిందని గుర్తు చేశారు.
NZB: టీయూలోని బాలుర, బాలికల హాస్టళ్లను వీసీ ప్రొ. యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరితో కలిసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టళ్లలో అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన వైస్ ఛాన్సలర్, హాస్టళ్లలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలన్నారు.
BHNG: ఆలేరు మండలంలో అర్హులైన పేదలకు తక్షణమే ఇంటి స్థలాలు కేటాయించి పట్టాలు ఇవ్వాలని CPI మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావుకు మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా CPI జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. కొలనుపాకలో సర్వే నంబర్ 8 లోని ప్రభుత్వ భూమిలో పేదలు గుడిసెలు వేసుకుని ఉన్నారని తెలిపారు.
NLG: చండూరు మండలం కొండాపురం గ్రామ శివారులో బుధవారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు ఒక్కసారిగా అదుపు తప్పి రహదారి పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు గట్టుప్పల్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
GDWL: గత కొన్ని నెలల నుంచి అలంపూర్ మండల కేంద్రంలోని సింగవరం 1 గ్రామంలో మిషన్ భగీరథ నీరు సరిగ్గా రాక స్థానిక గ్రామ ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు స్థానిక సర్పంచ్ గోంగోల ఈశ్వర్ మిషన్ భగీరథ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవిచంద్రను కలిసి నీటి సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన సమస్యను తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని అనురాధ అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ అత్యవసర సమయంలో ఆమె కుటుంబానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు భారతి రూ. 18 వేల ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు. వారు మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఉన్న విద్యార్థిని అనురాధ త్వరగా కోలుకుని, మళ్లీ పాఠశాలకు హాజరై తన విద్యాభ్యాసాన్ని విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు.
MDK: రామాయంపేటలోని పెద్ద మసీదులో ముస్లింలు కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి, మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజుల ఆధ్వర్యంలో ఈ విందు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గంగా జమున తహజీబ్కు ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుందని తెలిపారు.
PDPL: ఎలిగేడు మండల కేంద్రంలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ అధికారులు ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ఎరువుల యాప్ వాడకం, సేంద్రియ వ్యవసాయం, డ్రోన్ వాడకంపై అవగాహన కల్పించారు. రైతులకు సాయి హెల్త్ కార్డులు, సేంద్రియ వ్యవసాయ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమలో MAO ఉమాపతి, AEO సురేష్, రైతులు పాల్గొన్నారు.
ASF: అసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి వికారాబాద్ కలెక్టర్గా పదోన్నతిపై వెళ్తున్న సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలికారు. కలెక్టర్ హరిత మాట్లాడుతూ.. జిల్లాలో అదనపు కలెక్టర్గా, ఇంఛార్జ్ DEOగా ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. అధికారులందరు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించారని ప్రశంసించారు. అనంతరం దీపక్ తివారిని శాలువా, జ్ఞాపికతో సన్మానించారు.
SRCL: బీసీ నేతల ఎదుగుదలను ఓర్వలేకనే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అసెంబ్లీలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్పై ఆరోపణలు చేశారని రాజన్న ఆలయ మాజీ ధర్మకర్త సగ్గు పద్మ అన్నారు. చేతికున్న వాచ్ను కోట్ల రూపాయలు అంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. బీసీ సమాజానికి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని మంగళవారం ఓ ప్రకటన ద్వారా ఆమె డిమాండ్ చేశారు.
JGL: ఎండపల్లి మండలంలో 2025-26 యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి మహేశ్ తెలిపారు. కొత్తగా పట్టాదార్ పాస్బుక్ పొందిన రైతులు 28-02-2026 వరకు డిజిటల్ సంతకం పూర్తి చేసిన వారు, ఇంతకుముందు పాస్బుక్ ఉన్నప్పటికీ దరఖాస్తు చేయని రైతులు, అలాగే బ్యాంకు ఖాతా మార్చుకోవాల్సిన వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ADB: ఉట్నూర్ మండలంలోని రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ సంతోష్ను ఐటీడీఏ ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ సభ్యులు కలిశారు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం జీవో నెం. 3 స్థానంలో జీవో 18ను వెంటనే తీసుకురావాలని విన్నవించారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు రాజేశ్, సోమేశ్ తెలిపారు.