KRNL: రాయలసీమను YCP రాజకీయం కోసమే వాడుకుందని శుక్రవారం మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాయలసీమకు YCP ఏం చేసిందో చెప్పాలన్నారు. ఆ ప్రాంతంపై ప్రేమ ఉంటే.. ఎంత ఖర్చు పెట్టారో చర్చకు రావాలని సవాల్ విసిరారు. సీమలో హార్టికల్చర్ హబ్ పెడతామని చెప్పామని.. చేస్తామని స్పష్టం చేశారు. YCP మొసలి కన్నీళ్లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
PPM: క్షయ, మలేరియా జ్వరాలు సకాలంలో గుర్తించి, వ్యాప్తి చెందకుండా నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. జిల్లా క్షయ విభాగపు సిబ్బంది, మలేరియా సబ్ యూనిట్ అధికారులతో శుక్రవారం ఆరోగ్య కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డా. సూర్య కౌశిక్ పాల్గొన్నారు.
GNTR: గుంటూరు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి స్వీకరించిన పీజీఆర్ఎస్ దరఖాస్తులను 12 గంటల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డయేరియా నివారణ చర్యలు, శుద్ధి త్రాగునీటి సరఫరా, జలవనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
KRNL: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్గా న్యాయవాది ఎం.శివ రామచంద్ర రావు ఎంపికైనట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి తెలిపారు. శుక్రవారం న్యాయ సేవాసదన్లో కబర్థి, న్యాయ సేవాధికార కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి నియమాకం పత్రాన్ని ఆయనకు అందజేశారు. అనంతరం ఆయనకు వారు అభినందనలు తెలిపారు.
KDP: ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలు జరగనున్నాయని పీఠాధిపతి వెంకటాద్రి స్వాములవారు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆలయ మాడ వీధులు, ఆలయ పరిసరాలను ఆయన శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని షాపుల యజమానులకు సూచించారు. అదేవిధంగా మాడవీధులను శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
ప్రకాశం: తాళ్లూరు మండలంలో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం పాల్పడ్డ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండగా తల్లి శుక్రవారం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. జరిగిన విషయం వెలుగులోకి రావడంతో తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
W.G: పైలేరియా నివారణకు దోమల నియంత్రణే ఏకైక మార్గమని DMHO గీతాబాయి స్పష్టం చేశారు. శుక్రవారం వీరవాసరం మండలం అండలూరులో నిర్వహించిన పైలేరియా నివారణోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రోగులకు అవసరమైన MMDT కిట్లను ఆమె పంపిణీ చేశారు.
BPT: రైతులు తాము పండించిన పంటలను ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు అమ్ముకోవాలని చేబ్రోలు మండల వ్యవసాయ అధికారిణి ప్రియదర్శిని సూచించారు. నారాకోడూరులో శుక్రవారం పెసర కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. కొనుగోలుకు పేర్లు నమోదు చేసుకునే రైతులు ఈకేవైసీ చేయించుకుని ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతు సేవ కేంద్రం సిబ్బంది, పాల్గొన్నారు.
TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం (SSD టోకెన్లు లేకుండా)కు సుమారు 6 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం నాటికి 65,534 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 24,560 మంది తలనీలాలు సమర్పించుకోగా, హుండీ ఆదాయం రూ. 3.22 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
AKP: వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీగా కోటవురట్ల మాజీ సర్పంచ్ బి.అనిల్ కుమార్ నియమితులయ్యారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం తనకు నియామక పత్రం అందజేసినట్లు అనిల్ కుమార్ శుక్రవారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ASR: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పాడేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మచ్చల మంగతల్లి అన్నారు. శుక్రవారం పాడేరులో మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు అందజేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏఎంసీ కృషి చేస్తుందన్నారు.
KDP: పులివెందులలోని స్థానిక శిల్పారామం పార్క్కు వెళ్లే రోడ్డులో నిన్న రాత్రి కారు ఢీకొని బాలుడు జస్వంత్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు పులివెందులకి చెందిన శ్రీనివాసులు ఇటుకల బట్టిలో పని చేస్తున్నాడు. జస్వంత్ను ఇటుకల బట్టీ వద్దకు రమ్మని కోరగా అక్కడికి వస్తుండగా కారు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే జస్వంత్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
SKLM: పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన శ్రీకాకుళం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. రూ.2 కోట్లతో వాడాడ, అచ్చెన్న పాలెం మీదుగా ఇప్పిలి వరకు నిర్మించిన బి.టి రోడ్ను, వాడాడ గ్రామంలో NREGS నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్లను కేంద్రమంత్రి ప్రారంభించారు.
PPM: దళాయిపేట గ్రామ పరిసర ప్రాంతాల్లోని అరటితోటల్లో ఇవాళ ఉదయం ఏనుగుల గుంపు సంచరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. ఏనుగులు కనిపించినప్పుడు వాటిని రెచ్చగొట్టకుండా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
WG: ఆచంట మండలం కొడమంచిలిలో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వెంకటస్వామిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఆచంట ఎస్సై కే.వెంకటరమణ తెలిపారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి పాలకొల్లు కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. గురువారం పోలీసులు నిందితుడి దుకాణం జేసీబీతో కూల్చి వేసిన విషయం విధితమే.