ATP: రాప్తాడు నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం సమావేశం నిర్వహించారు. ఈనెల 20న సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని అన్ని గ్రామాలు, మండలాల్లో ఘనంగా జరపాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె సూచించారు.
కడపలో రూ.5 కోట్ల అభివృద్ధి పనుల టెండర్లను అధికారులు ఏకపక్షంగా రద్దు చేయడంపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. జనరల్ బాడీ ఆమోదించిన పనులను నిలిపివేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించింది. కేంద్ర నిధులతో చేపట్టాల్సిన పనులు ఎందుకు ఆపారో సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేసింది. అవసరమైతే ముట్టడి, న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించింది.
TPT: వాకాడులో వైసీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి శనివారం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. వాకాడు, కోట, చిట్టమూరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు, నాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు.
GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మహిళా విద్యకు మార్గదర్శిగా నిలిచిన మహాత్మా పూలే సేవలు అపారమని కొనియాడారు.
PPM: శిశు, బాలల ఆరోగ్య కార్యక్రమాలను పక్కాగా నిర్వహించి వారి ఆరోగ్యవంతమైన ఎదుగుదల ధ్యేయంగా కృషి చేయాలని రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమ జిల్లా అధికారి డా. టి.జగన్ మోహనరావు పేర్కొన్నారు. జగన్నాధపురం 30వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన సార్వత్రిక టీకా కార్యక్రమాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గడువు తేదీకి టీకా అర్హుల జాబితా పరిశీలించారు.
E.G: రంగంపేట రైతు సేవా కేంద్రం వద్ద యువసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం PACS ఛైర్మన్ గారపాటి రాంబాబు ప్రారంభించారు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు నేతలు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అన్నమయ్య: రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రైతు సంఘం నేతలు విమర్శించారు. గిట్టుబాటు ధరలు, ఎరువుల కొరత, మార్కెట్ దోపిడీతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 50 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
CTR: నగరి నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తన కార్యాలయంలో వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని, సంబంధిత అధికారులకు తక్షణ పరిష్కారానికి సూచనలు చేశారు. సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తామని ఆయన తెలిపారు.
KDP: ఖాజీపేట అగ్రహారంలో జరిగిన యువతి కీర్తన హత్య ఘటనపై రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రిమ్స్ మార్చురీలో మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
SKLM: కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో జిల్లాను ఎందుకు విధ్వంసం చేయాలనుకుంటున్నారో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షన శనివారం పలాసలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భూమిపైన ఉపాధి పొందుతున్న ప్రజలకు భూమి నుంచి వెళ్లగొడితే ఈ ప్రాంతమంతా నాశనం అయిపోతుందని వారు పేర్కొన్నారు.
NTR: పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని మాజీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ తొండపు దశరథ జనార్ధన్ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ ఏఈవో జంగం శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు ఆయనను దుశ్శాలువాలతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.
ASR: డుంబ్రిగూడ మండలం పనసపుట్ గ్రామంలో కిషన్ కాంగ్రెస్ 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పాంగి గంగాధర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు వంతల ఆనందరావును కాంగ్రెస్ శ్రేణులు సన్మానించారు. అనంతరం పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని గంగాధర్, గ్రామస్తులు డిమాండ్ చేశారు.
AKP: ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రశాంతత చేకూరుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మండల కేంద్రమైన ఎస్.రాయవరంలో కొత్తగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఈ నెల 26న ప్రారంభిస్తున్న నేపథ్యంలో శనివారం గోడపత్రికను మంత్రి ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు.
GNTR: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గుంటూరు నగరంలోని హిందూ కళాశాల వద్ద ఉన్న పూలే విగ్రహానికి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో కులవివక్ష నిర్మూలన, మహిళా సాధికారత కోసం పూలే చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
BPT: పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని ఖచ్చితత్వంతో నిర్వహించాలని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శనివారం మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని కేంద్రాన్ని తనిఖీ చేసి ప్రక్రియను పరిశీలించారు. 750 మంది ఉపాధ్యాయులు 1,77,819 పత్రాలను మూల్యాంకనం చేస్తున్నారని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.