GNTR: ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు గ్రామపంచాయతీలో ఆదివారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో వేజ్ సీకర్స్ మొబిలైజేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ గ్రామ ప్రజలకు ఉపాధి హామీ పథకం ద్వారా లభించే ప్రయోజనాలను వివరించారు. ఉపాధి హామీ పనుల్లో పాల్గొని గ్రామాన్ని సస్యశ్యామలంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.
PLD: గురజాల నూతన డీఎస్పీగా మల్ల మహేశ్వరరావు విధుల్లో చేరారు. బదిలీలో భాగంగా విజయనగరం నుంచి గురజాలకు వచ్చారు. ఆదివారం గురజాల డీఎస్పీ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. పోలీసు శాఖలో తన అనుభవంతో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
AKP: ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తామని నర్సీపట్నం అగ్నిమాపక శాఖాధికారి పీ. అప్పలస్వామి ఆదివారం తెలిపారు. మొదటి రోజు చనిపోయిన అమరవీరులకు నివాళి అర్పిస్తామన్నారు. మరుసటి రోజు నుంచి బస్టాండ్, పాఠశాలలు, కళాశాలలు, థియేటర్లు, అపార్టుమెంట్లు, గ్యాస్ గొడౌన్లు, పెట్రోల్ బంక్ల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ సాధారణ తనిఖీలలో భాగంగా ఆదివారం బొబ్బిలి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే బేబీ నాయన ఆహ్వానం మేరకు బొబ్బిలి కోటకు వచ్చి దర్బార్ మహల్ని సందర్శించారు. ఎమ్మెల్యే దగ్గరుండి బొబ్బిలి యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలను, చిత్రపటాలను చూపించి వాటి గురించి వివరించారు. అనంతరం బొబ్బిలి వీణను బహూకరించి సత్కారించారు.
ATP: కనగానపల్లి మండల కేంద్రంలోని రెడ్డివారికుంట చెరువు మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. 2024 భారీ వర్షాలకు తెగిపోయిన ఈ చెరువుకు రూ. 86 లక్షల డీఎంఎఫ్ నిధులు కేటాయించారు. గత నెల 17న పనులు ప్రారంభం కాగా, ప్రస్తుతం జరుగుతున్న తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు.
VZM: డెంకాడ మండలం చింతలవలస పంచాయతీ జనసేన నాయకులు బూడి కృష్ణ రావు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు వైసీపీ నుంచి జనసేనలో చేరారు. రెల్లివలస పంచాయతీలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. వీరికి భోగాపురంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నాగ మాధవి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
SKLM: పల్లెల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం మండలం రాయపాడు పంచాయతీలో రూ .46 లక్షల NREGS నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
PLD: లంకెలకురపాడులో మొక్కజొన్న తోటలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3,040 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
E.G: బీజేపీ ఆధ్వర్యంలో మహిళల 33% రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా రేపు సోమవారం ఉదయం 9:30 గంటలకు కొవ్వూరులో పాదయాత్ర నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర పేర్కొన్నారు. కొవ్వూరు బస్ స్టాండ్ సర్కిల్ నుంచి RDO కార్యాలయం వరకు జరిగే ర్యాలీని విజయవంతం చెయ్యాలని కోరారు. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిశిధరాజు పాల్గొంటారని తెలిపారు.
AKP: అడ్డురోడ్డు జంక్షన్ రెవిన్యూ డివిజన్ వీఆర్వోల సంఘం నూతన కార్యవర్గం ఆదివారం ఏర్పాటు అయింది. అధ్యక్షుడిగా కోటవురట్లకు పీ. రమేష్, ప్రధాన కార్యదర్శిగా ఎలమంచిలి మండలానికి చెందిన సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా నూకరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎల్లపు నాయుడు, కోశాధికారిగా రమణను ఎన్నుకున్నారు.
TPT: యర్రావారిపాళెం మండలం వైసీపీ యూత్ అధ్యక్షుడు సన్నీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న చంద్రగిరి వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయనను ఇంటి వద్ద పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శలో పలువురు స్థానిక నాయకులు కూడా ఉన్నారు.
ASR: జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి విస్తరణ, అనుసంధాన రహదారుల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ నిషాంతి అధికారులను ఆదేశించారు. ఆదివారం జీ.మాడుగుల మండలంలో పర్యటించి, జాతీయ రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. జీ.మాడుగుల నుంచి ఉరుము జంక్షన్ వరకు, డీ.గొందూరు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు.
PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో ఆదివారం ఆకస్మిక డ్రంక్ అండ్ డ్రైవ్ను పట్టణ సీఐ బి. వెంకటరావు సిబ్బందితో నిర్వహించారు. పట్టణంలో ఉన్న ఎస్.వి.డి డిగ్రీ కళాశాల వద్ద ప్రతి వాహనాన్ని ఆపి బ్రీత్ అనలైజ్ చేశారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కేసులు నమోదు చేశామని సీఐ చెప్పారు.
కోనసీమ: అమలాపురం పట్టణంలో మహిపాల వీధిలో ఉన్న పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా ఆదివారం స్వామివారికి లక్ష మల్లె పువ్వులతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రవణ నక్షత్రం రోజున స్వామి వారిని ఆరాధించడం అత్యంత శుభప్రదమని అర్చకులు అన్నారు.
SS: ధర్మవరం నియోజకవర్గ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో రెండో విడత సైకిళ్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. సంస్కృతి సేవా సమితి సహకారంతో ఏప్రిల్ 14న మార్కెట్ యార్డ్లో ఈ వేడుక జరుగుతుంది. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల పరిధిలోని 24 పాఠశాలలకు చెందిన 1000 మంది పదో తరగతి విద్యార్థులకు మంత్రి వీటిని అందజేస్తారు.