ప్రకాశం: టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఆరు కిలోల గంజాయి మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. కారులో అక్రమంగా తరలిస్తున్న గంజ్జాయిని పట్టుకున్నారు. అనంతరం కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
CTR: శాంతిపురం(M) గొల్లపల్లిలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ‘గొల్లపల్లి ప్రీమియర్ లీగ్’ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్లో అమిగోస్- 11 టీంపై భగత్ సింగ్- 11 టీం ఘన విజయం సాధించింది. అనంతరం విజేతలకు గ్రామస్థులు బహుమతులు ప్రదానం చేశారు. క్రీడల ద్వారా ఐక్యతను చాటడమే ఈ టోర్నీ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
VSP: పీఎం సూర్య ఘర్ పథకం కింద జిల్లాలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా చినవాల్తేరులో ఒక గృహంపై ఏర్పాటు చేసిన ప్లాంట్ను ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ…. 3,595 మందికి 7.19 మెగావాట్ల ప్లాంట్లు కేటాయించామని తెలిపారు.
ATP: కళ్యాణదుర్గం మండలం గాజులపల్లిలో పీఎం సూర్య ఘర్ పథకాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం రాయితీతో సోలార్ వ్యవస్థ అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 2438 మందికి 27.50 కోట్ల వ్యయంతో ఈ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మహిళల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు.
W.G: జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరంలో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘటితంగా ఉండటం ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని సామాజిక సమానత్వం కోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు.
GNTR: ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం వినూత్న సాహసయాత్రకు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా 21 మంది విద్యార్థులతో కూడిన బృందం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణకు సిద్ధమైంది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు 16 రోజులపాటు జరిగే ఈ యాత్రలో విద్యార్థులు ఖాట్మండు చేరుకుని అక్కడి నుంచి ట్రెక్కింగ్ ప్రారంభిస్తారు.
ELR: ఏపీ కో-ఆపరేటివ్ సెంట్రల్ బాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరుకు ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ర్యాలీ భీమడోలు చేరుకుంది. ఆప్కాబ్ ఛైర్మన్ గన్నివీరాంజనేయులు వారికి స్వాగతం పలికి కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఉద్యోగులపై అన్యాయపు కేసులు రద్దుచేసి రాజకీయ ప్రేరేపిత విచారణలు నిలిపివేయాలని కోరారు.
ASR: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం పాడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నిశాంతి, ఎస్పీ అమిత్ బర్దార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మేరకు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయ సాధకుడిగా, పీడిత వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారన్నారు.
TPT: ఏర్పేడు-శ్రీకాళహస్తి మధ్య రైలు పట్టాలు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వెంకటగిరి(M) కాంపాలెం గ్రామానికి చెందిన శ్రీను రైల్వే గేటు సమీపంలో పట్టాలు దాటే క్రమంలో బైకు అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AKP: సబ్బవరం మండల కేంద్రంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వద్ద నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి మనిషి గౌరవంగా జీవించే రోజు వచ్చినప్పుడే అంబేద్కర్కు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు.
PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ అప్పలస్వామి, ఓబీసీ జిల్లా జనరల్ సెక్రటరీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం-బ్రహ్మపూర్ ప్యాసింజర్ రైలు (58532) మంగళవారం రీషెడ్యూల్ అయినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. లింక్ రైలు ఆలస్యంగా రావడం వల్ల, సాయంత్రం 5:45 గంటలకు బదులుగా 6:45 గంటలకు బయలుదేరుతుందని వివరించారు. ప్రయాణికులు ఈ సమయ మార్పును గమనించి తమ ప్రయాణాలను సర్దుబాటు చేసుకోవాలని కోరారు.
SKLM: జిల్లాలో మత్స్య సంపద పునరుత్పత్తిని కాపాడేందుకు సముద్రంలో చేపల వేటపై ఇవాళ అర్ధరాత్రి నుంచి నిషేధం అమల్లోకి రానుంది. జూన్ 16 వరకు కొనసాగే ఈ నిషేధ కాలంలో వేట సాగిస్తే చేపల గుడ్లు, ఉత్పత్తులు నశించిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు ఈ 61 రోజుల పాటు వేటకు దూరంగా ఉండి సహకరించాలని మత్స్యశాఖ అధికారులు కోరారు.
CTR: పెద్దపంజనిలో రైస్ పుల్లింగ్ పేరుతో మోసానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తమ వద్ద అద్భుత శక్తులు గల వస్తువు ఉందని నమ్మించి ఓ బాధితుడి నుంచి లక్ష రూపాయలు వసూలు చేసి నిందితులు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు.
E.G: బొమ్మూరులోని అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో 135వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని నివాళులర్పించారు. క్యాంపస్ నియామకాలతో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. అనంతరం ఉచిత కోచింగ్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.